Andhra Pradesh Political news: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ఉప ఎన్నిక హీటు పెంచుతోంది. అయితే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ (TDP), ఓట్ల పరంగా కాస్త మెరుగ్గా కనిపించే జనసేన (Janasena)రెండూ ఈ ఉప ఎన్నిక నుంచి తప్పుకున్నాయి. దీంతో వార్ వన్ సైడ్ అవుతుందని.. ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది అనుకన్నారు. అయితే ఏ మాత్రం రేసులో లేవు అనుకున్న రెండు జాతీయ పార్టీలు బద్వేల్ ఉప ఎన్నిక బరిలో నిలిచాయి. కేవలం బరిలో దిగడమే కాదు.. గెలుపు తమదే అని తొడలు కొడుతూ... అధికార వైసీపీ (YCP) వైపు కాలు దువ్వుతున్నాయి. ఎలాగైనా ఈ ఎన్నికల్లో చెప్పుకోదగ్గ ఓట్లను కొల్లగొట్టి తమ సత్త చాటాలని బిజెపీ(BJP)., కాంగ్రెస్ (Congress) తహతహలాడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉన్నా.. బద్వేలు ఉపఎన్నికలో ప్రతిపక్షపాత్ర పోషించేందుకు బీజేపీకి అరుదైన అవకాశం దక్కింది. చనిపోయిన సిట్టింగ్ మెంబర్ కుటుంబానికే టిక్కెట్ కేటాయించడంతో టీడీపీ, జనసేనలు బరిలో నుంచి తప్పుకొన్నాయి. దీంతో అధికారపార్టీకి ఎదురుగా బీజేపీనే పోటీకి ఉంది. ఈ పరిస్థితుల్లో బద్వేలులో బీజేపీ పోటీపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. గతంలో జరిగిన బద్వేల్ ఎన్నికలో బీజేపీ అభ్యర్థికి 735 ఓట్లు వచ్చాయి. డిపాజిట్ రాలేదు. కానీ ఈసారి డిపాజిట్ కోసం కాకుండా గెలుపు కోసం ఫైట్ చేస్తున్నామంటోంది బీజేపీ. బద్వేలులో సుమారు 2 లక్షల 14 వేల మంది ఓటర్లు ఉన్నట్టు సమాచారం. 2019లో లక్షా 50 వేల మంది ఓటేశారు. ఇప్పుడు ఇంకా పెరిగే వీలుంది. ఈ ఎన్నికలో కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్ దక్కాలంటే పోలైన ఓట్లలో ఆరోవంతు రావాల్సి ఉంటుంది. ఆ లెక్క ప్రకారం చూస్తే.. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు కనీసం 25 వేలకుపైగా ఓట్లు పోల్ కావాలి. రెండు పార్టీలు ఆ టార్గెట్ దాటి వైసీపీకి పోటీ ఇవ్వగలవా..? రెండు పార్టీ అభ్యర్థుల్లో ఎవరికి అత్యధిక ఓట్లు రావాలి అన్నా.. టీడీపీ, జనసేన ఓట్లే కీలకం కానున్నాయి.
జనసనే ఓట్లు బీజేపీకి పడతాయా..?
జనసేన పోటీ చేయకున్నా.. మిత్రపక్షం బీజేపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించింది. బద్వేలు పరిధిలో బలిజ సామాజికవర్గం ఓట్లు గణనీయంగానే ఉన్నాయి. జనసేన మద్దతువల్ల బలిజ సామాజికవర్గం నుంచి కాస్తో కూస్తో ఓట్లు వస్తాయని లెక్కలేస్తున్నారట. అయితే ఇది అనుకున్నంత తేలిక కాదన్నది ఒక ప్రశ్న. గత ఎన్నికల్లో లెఫ్ట్, బీఎస్పీలతో పొత్తు పెట్టుకున్న జనసేన.. బద్వేల్ స్థానాన్ని బీఎస్పీకి కేటాయించింది. అప్పుడు బీఎస్పీ అభ్యర్థికి కేవలం1321 ఓట్లే పడ్డాయి. ఈ పరిస్థితుల్లో పోటీ చేయని జనసేన బీజేపీకి మద్దతిచ్చినా భారీగా ఓట్లు వస్తాయా? అనేది ఒక అనుమానం.
ఇదీ చదవండి: టీడీపీ కన్నా జనసేన బెటర్ అంటున్న తెలుగు తమ్ముళ్లు.. ఇప్పటి నుంచే పక్క చూపు
బద్వేల్ టీడీపీ కేడర్ బీజేపీకి మద్దతు ఇస్తుందా..?
టీడీపీ పోటీలో లేకపోవడంతో.. వైసీపీ సర్కార్ వ్యతిరేక ఓటర్లంతా తమకే వేస్తారనేది బీజేపీ మరో అంచనా. ఏ మొగుడూ లేకుంటే అక్క మొగుడే దిక్కు అనే రీతిలో టీడీపీ ఓటర్లు బీజేపీవైపే మొగ్గు చూపుతున్నారని లెక్కలేస్తున్నారట మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి. బద్వేలు పరిధిలో ఉన్న గోపవరం మండలం ఎంపీపీ, జడ్పీటీసీలను కైవశం చేసుకుంది టీడీపీ. ఈ క్రమంలో టీడీపీ బరిలో ఉంటే పోటీ కాస్త టైట్గా ఉండొచ్చనే భావించారు. ఇప్పుడు ఆ మండలానికి చెందిన ఓటర్లు.. టీడీపీ సానుభూతిపరులు బీజేపీకి ఓటేస్తారన్నది కమలనాథుల లెక్క. స్థానికంగా ఉన్న టీడీపీ నేతలతో మాట్లాడే పనిలో బీజేపీ కడప జిల్లా ముఖ్యులు బిజీగా ఉన్నారట. మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఎంపీ సీఎం రమేష్ వంటి వారికి కడప జిల్లా టీడీపీ నేతలతోనూ.. బద్వేలు నియోజకవర్గ, మండలస్థాయి నాయకులతో సత్సంబంధాలు ఉండటంతో ఆ పార్టీ కేడర్ను దువ్వే ప్రయత్నం చేస్తున్నారట.
ఇదీ చదవండి: భారీ వర్షాలతో రైతన్నలకు తప్పని కష్టాలు.. ఉద్యానం చుట్టూ.. తెగుళ్ల ముసురు..
కాంగ్రెస్ ఆశలు టీడీపీ పైనే..
ఇటు కాంగ్రెస్ నేతలు కూడా టీడీపీ ఓట్లపైనే ఆశలు పెట్టుకున్నాయి. టీడీపీతో పొత్తు పెట్టుకునేది లేదని పదే పదే బీజేపీ నేతలు చెబుతుండడంతో.. టీడీపీ ఓట్లు తమకే పడతాయని.. ఆ దిశగా స్థానిక నేతలను కోరే ప్రయత్నాలు చేస్తున్నారు. అవసరమైతే టీడీపీ అధిష్టానం పెద్దలతో ఒకమాట చెప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP Congress, AP News, AP Politics, Bjp, Ycp