ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ (AP CM YS Jagan).. ఇటీవల పాలనతో పాటు పార్టీపై దృష్టిపెట్టిన సంగతి తెలిసిందే. ప్లీనరీ తర్వాత పార్టీ బలోపేతం, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి అంశాలపై ఫోకస్ చేసిన జగన్ అందుకు తగ్గట్లుగానే పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో-ఆర్డినేట్లతో కీలక భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలకు కీలక సూచనలిచ్చారు. సంక్షేమ క్యాలెండర్ ప్రకటించి నెలనెలా పథకాల అందించే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. అందుకే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో నిర్వహిస్తే 175కి 175 సీట్లలో గెలుస్తామని జగన్ ధీమా వ్యక్తం చేశారు.
ప్రతి ఎమ్మెల్యే నేతలు, కార్యకర్తలను సమన్వయం చేసుకొని గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించేలా చూడాలని రీజనల్ కో-ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులను జగన్ ఆధేశించారు. అలాగే వచ్చే నెల 4వ తేదీ నుంచి ప్రతి నియోజకవర్గంలో పార్టీకి చెందిన 50 మంది క్రియాశీలక కార్యకర్తలతో భేటీ అవుతానని తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. పార్టీని మరింత బలోపేతం చేసే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు.
పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షించాల్సిన బాధ్యతలు రీజనల్ కో ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులదేనని సీఎం జగన్ స్పష్టం చేశారు. అందుకే వారికి బాధ్యతలిచ్చినట్లు చెప్పారు. ముఖ్యంగా రీజనల్ కో-ఆర్డినేటర్లు నెలకు కనీసం 10 రోజులైనా వారికి కేటాయించిన ప్రాంతాలకు వెళ్లాలని.. జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, శాసనసభ్యులు, నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలతో సమన్వయం చేసుకుంటూ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించాలన్నారు.
గడప గడపకు కార్యక్రమాన్ని మరింత ఉధృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న సీఎం.. ప్రతి నియోజకవర్గంలో నెలకు కచ్చితంగా ఆరు సచివాలయాల్లో కార్యక్రమం జరగాలన్నారు. ప్రతి సచివాలయం పరిధి ఉన్న గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో వెంటనే చేపట్టాల్సిన పనులు కోసం రూ.20 లక్షలు ఇస్తామని జగన్ వెల్లడించారు. ఆ నిధులను సక్రమంగా వినియోగించాల్సిన బాధ్యత రీజనల్ కో-ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులదేనని స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే ఇటీవల పార్టీ కార్యక్రమాలపై దృష్టిపెట్టిన సీఎం జగన్.. ఎమ్మెల్యేలకు టార్గెట్ విధించిన సంగతి తెలిసిందే. ఇతర ఎమ్మెల్యేలంటే వెనుకబడినా, ప్రజల్లో తిరగకపోయినా వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. పనిచేసేవారికే పార్టీ ప్రాధాన్యత ఇస్తుందన్న జగన్.. ఆ తర్వాత తనను తిట్టుకొని ప్రయోజనం లేదని కుండబద్దలు కొట్టేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP Politics, Ysrcp