ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మంత్రివర్గం (AP Cabinet) అత్యవసరంగా భేటీ అయింది. అందుబాటులో ఉన్న మంత్రులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Redd) సమావేశమయ్యారు. ఓ వైపు అసెంబ్లీ జరుగుతుండగానే కేబినెట్ భేటీ జరుగుతుండటం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మూడు రాజధానులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. గతంలో ప్రవేశపెట్టిన పాలనా వికేంద్రీకరణ బిల్లులో కొన్ని మార్పులు చేసి ప్రవేశపెట్టవచ్చన్న టాక్ నడుస్తోంది. అలాగే విద్యుత్ ఒప్పందాలకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంటారని కూడా ప్రచారం జరుగుతోంది. అలాగే రాష్ట్రంలో వరద పరిస్థితులపై చర్చించి బాధితులకు సాయం అందించే అంశంపై చర్చిస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఎన్ని వార్తలు ప్రచారంలో ఉన్నా మూడు రాజధానుల అంశమే ప్రధాన అజెండాగా తెలుస్తోంది. రాజధాని బిల్లులపై హైకోర్టులో 57 పిటిషన్లు దాఖలు కావడం, వాటిపై విచారణ జరుగుతోంది. అలాగే రైతుల మహాపాదయాత్ర కూడా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రైతులకు ఇచ్చే పరిహారం పెంపు లాంటి అంశాలపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కేంద్రం రైతు చట్టాలను వెనక్కి తీసుకున్న నేపథ్యంలో ఈ బిల్లలను కూడా వెనక్కి తీసుకుంటారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల కేంద్ర మంత్రి అమిత్ షా కూడా అమరావతికి మద్దతు తెలిపి ఉద్యమంలో పాల్గొనాలని బీజేపీ నేతలకు సూచించి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.
సమావేశం ముగిసిన తర్వాత కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను అసెంబ్లీలో తెలిపే అవకాశముంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మూడు రాజధానుల నిర్ణయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తున్న నేపథ్యంలో పరిహారానికి సంబంధించిన నిర్ణయమే తీసుకుంటారని తెలుస్తోంది. మూడు రాజధానుల అమలుపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. రాజధాని వికేంద్రీకరణ బిల్లు వెనక్కి తీసుకోబోతున్నట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు ఉంటాయని 2019 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. శాసన రాజధానిగా అమరావతి, కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, న్యాయరాజధానిగా కర్నూలును నిర్ణయించినట్లు ప్రకటించారు. అప్పటి నుంచి రాజధానికి భూములిచ్చిన అమరావతి ప్రాంత రైతులు ఆందోళన చేస్తున్నారు. ఈ ఉద్యమం ఇప్పటికి 700 రోజులు దాటింది. ప్రస్తుతం రాజధాని రైతులు న్యాయస్థానం టూ దేవస్థానం పేరుతో అమరావతి నుంచి తిరుపతికి మహాపాదయాత్ర చేపట్టారు. ప్రస్తుతం పాదయాత్ర నెల్లూరు జిల్లాలో కొనసాగుతోంది. మరోవైపు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు వ్యతిరేకంగా హైకోర్టులో దాఖలైన 57 పిటిషన్లపై రోజువారీ విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP Assembly, AP cabinet, Ap capital, Ap cm ys jagan mohan reddy