AP BJP Josh: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పట్టు కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా బీజేపీ (BJP) ఒక్క అడుగుకూడా ముందుకు వేయలేకపోతోంది. జనసేన (Janasena) తో పొత్తు ఉన్నా సాధించింది ఏమీ కనపడడం లేదు. దీంతో ఏపీ బీజేపీ నేతల్లో కాస్త నిరాశ కనిపిస్తోంది. దక్షిణాధిలో ఎక్కడా బీజేపీకి పూర్తి బలం కనిపించడం లేదు. కనీసం పొత్తులతోనైనా నిలవాలని చాలా రాష్ట్రాల్లో ప్రయత్నించింది. కానీ కుదరలేదు. ఇక్కడ ప్రాంతీయ పార్టీల హావాను తట్టుకోలేకపోతుంది. ఈ మధ్యకాలంలో తెలంగాణ (Telangana) లో కాస్త ఊపందుకున్నబీజేపీ…ఆంధ్రాలోనూ పుంజుకోవాలని ప్రయత్నిస్తున్నా పాజిబుల్ కావడం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఒట్ల రూపంలో కనిపించడం లేదు. జనసేన పొత్తుతో ఉప ఎన్నికల్లో అధికార వైసీపీ (YCP)కి ప్రధాన ప్రత్యర్థిగా పోటీ చేసినా కనీసం పోటీ ఇచ్చిన దాఖలాలు కనిపించడం లేదు. ఇలానే ఉంటే రాబోయే ఎన్నికల్లో బీజేపీ నేతలు ఆశలు వదులుకోకతప్పదు. ఇప్పటి నుంచే వచ్చే ఎన్నికలకు సమాయత్తం కావాల్సి ఉంటుంది. ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలపై పోరాడుతున్నా.. ప్రజల్లోకి మాత్రం వెల్లలేకపోతోంది. పార్టీ పూర్తిగా పటిష్టం కావాలి అంటే.. కేంద్రమంత్రులు రాష్ట్రంలో వీలైనంత ఎక్కువగా పర్యటించేలా ఏపీ బీజేపీ నాయకులు యాక్షన్ ప్లాన్రెడీ చేస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా జూలై 4న ప్రధాని నరేంద్రమోదీ (Prime Minster Narendra Modi) పర్యటన ఖరారైంది. ఇప్పటికే కేంద్ర మంత్రుల పర్యటన షెడ్యూల్లో ఉండగా… తాజాగా ప్రధాని ఎంట్రీ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో ఆశించిన స్థాయిలో బీజేపీకి ప్రజల నుంచి మద్ధతు లేదు. దీని వల్ల ప్రతీ ఎన్నికల్లోనూ ఆ పార్టీకి ఓటమే ఎదురవుతుంది. ఇకపై అలాంటి పరిస్థితి తలెత్తకుండా బీజేపీ జాతీయ నాయకులు సరికొత్త వ్యూహాలు రచిస్తున్నారు. కేంద్ర నాయకత్వం ఆదేశాలతో రాష్ట్ర పార్టీ నేతలు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల కేంద్ర మంత్రులు రాష్ట్రంలో పర్యటించారు.
విభజన చట్టంలోని హామీలు, బీజేపీ ఎనిమిదేళ్లలో రాష్ట్రానికి చేసిన నిధులు, నెరవేర్చిన హామీలను ప్రజలకు వివరిస్తున్నారు. రాష్ట్రం అమలు చేస్తున్న పథకాల్లో కేంద్రం వాటా ఎంత ఉంది, వాటి వల్ల ఎంతమందికి లబ్ధి చేకూరింది అనే అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇటీవల కేంద్ర మంత్రులు రాష్ట్రంలో పర్యటించిన సందర్భంలో ప్రజల్లో పార్టీకి ఉన్న ఆదరణ, క్షేత్రస్థాయిలో పరిస్థితిని చూసి…దాన్ని అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు సమాచారం.
ఇదీ చదవండి : ఉడుతా ఉడుతా ఊచ్.. ప్రమాదానికి కారణం అదా? ప్రభుత్వ వివరణపై లోకేష్ సెటైర్లు
కేంద్ర ప్రభుత్వ పనితీరుపై ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ కూడా జరుగుతుంది. ప్రజల నుంచి వచ్చే అభిప్రాయం, పార్టీ కార్యకర్తల సూచనలతో పార్టీలో కొన్ని సంస్థాగత మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జిల్లాల వారీగా ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. త్వరలో ఏపీలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామనే సంకేత్రాలను క్యాడర్కు ఇస్తున్నారు. ప్రధాని పర్యటనతో క్యాడర్లో కచ్చితంగా జోష్ పెరుగుతుందని భావిస్తోంది. ప్రజల్లో, పార్టీ కేడర్లో ఉత్సాహం నింపేలా.. రాష్ట్రంలో ఏం మాట్లాడాలి, ఏయే అంశాలు ప్రస్తావించాలో ప్రధాని దృష్టికి పార్టీ నాయకులు తీసుకెళ్లినట్లు సమాచారం. క్యాడర్లో కాస్త ఉత్సాహం నింపేలా ప్రధాని ప్రసంగాన్ని తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది.
అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, వైఫల్యాలను ఎండగట్టే అవకాశమూ ఉన్నట్లు సమాచారం. జూలై 4న ప్రధాని పర్యటన తర్వాత రాష్ట్రంలో బీజేపీ పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుందని రాష్ట్ర నాయకత్వం ఆశాభావం వ్యక్తం చేస్తుంది. అయితే ఇంతకుముందు కూడా ప్రధాని మోదీ రాష్ట్రంలో పర్యటించారు..అప్పుడు ఏ మార్పు రాలేదు.. ఇలా కొన్నేళ్లుగా మారని పరిస్థితి ఇప్పుడు ప్రధాని పర్యటనతో మారుతుందా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap bjp, AP News, Narendra modi