ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అసెంబ్లీ (AP Assembly) లో రచ్చ కొనసాగుతోంది. పెగాసస్ (Pegasus) పై ప్రభుత్వం సభా సంఘం వేయడం, కల్తీ మద్యం వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యేలు సభలో ఆందోళన కొనసాగిస్తున్నారు. మంగళవారం సభ ప్రారంభమైన వెంటనే టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగడంతో వారిని సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. టీడీపీ ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్, వెలగపూడి రామకృష్ణ, బెందాళం అశోక్, రామరాజు ఈ సెషన్ పూర్తయ్యేవరకు సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నందుకే వారిపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు స్పీకర్ చెప్పారు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి సభలో టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. గవర్నర్ ప్రసంగానికి కూడా అడ్డుతగిలే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత జంగారెడ్డిగూడెం మరణాలపై చర్చకు పట్టుబట్టడమే కాకుండా అధికార పార్టీనే కల్తీమద్యాన్ని ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. ఇక పెగాసస్ విషయంలో చంద్రబాబుపై ఆరోపణలు రావడం.. దీనిపై సభా సంఘాన్ని ఏర్పాటు చేయడానికి నిరసనగా ఆందోళనకు దిగారు.
ఇదిలా ఉంటే అసెంబ్లీ బయట కూడా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళన కొనసాగిస్తున్నారు. మంగళవారం మండలి సమావేశాలకు ముందు టీడీపీ సభ్యులు ఛైర్మన్ కు లేఖ రాశారు. “మన రాష్ట్రంలో ఇటీవల కల్తీ సారా, జే బ్రాండ్ల కారణంగా మరణాలు విపరీతంగా సంభవిస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోనే వారం రోజుల్లో 28 మందికి పైగా సారా తాగేవాళ్లు మృతి చెందారు. ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలోనూ జే బ్రాండ్ ప్రమాదకర మద్యం తాగిన వారు చికిత్స పొందుతున్నారు. గత కొన్ని నెలలుగా పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి.” అని పేర్కొన్నారు.
మద్యనిషేధం హామీతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వమే మద్యం వ్యాపారం ఆరంభించడం, ఈ ఏడాది ఏకంగా సుమారు రూ.24,000 వేల కోట్ల రూపాయలు మద్యంపై ఆదాయం రాబడుతోందని టీడీపీ ఆరోపించింది. పిచ్చిమద్యం అత్యధిక ధరలకి అమ్ముతుండడంతో నిరుపేదలు సారాకి అలవాటు పడి ప్రాణాలు తీసుకుంటున్నారని.., వేల కుటుంబాలలో చీకట్లు నింపుతోన్న కల్తీసారా, జే బ్రాండ్ ప్రమాదకర మద్యం మరణాలపై చర్చ జరగాలని 4 రోజులపాటు సభలో మా సభ్యులమంతా కలిసి నిలబడే పోరాడిన సంగతి మీకు తెలిసేఉంటుందన్నారు. . ప్రభుత్వం సహజ మరణాలంటూ చర్చ నుంచి తప్పించుకోవాలని చూస్తోంది. సారాసురుల ధనదాహానికి సామాన్యులు బలైపోతుంటే, మహిళల పుస్తెలు తెగుతుంటే మానవత్వం లేకుండా స్వయంగా ముఖ్యమంత్రే అవి సాధారణ మరణాలంటూ సూత్రీకరించడంతో ప్రభుత్వంపై ప్రజల్లో అనుమానాలు బలపడుతున్నాయి. దీనిపై చర్చకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP Assembly, TDP