CM Jagan’s meeting with PM Modi: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ బిజిబిజీగా సాగుతోంది. తొలి రోజు విరామం లేకుండా వరుస ప్రధానితో సాహా కేంద్రమంత్రులను కలిసి.. విన్నపాలు విన్నవించారు. మొదట ప్రధానితో సుమారు గంటకుపైగా చర్చించారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ప్రధానికి వినతి పత్రం కూడా అందించిన సీఎం.. పోలవరం ప్రాజెక్టు, కడప స్టీల్ ప్లాంట్, జాతీయ ఆహార భద్రతా చట్టం అర్హుల ఎంపికలో హేతుబద్ధత, తెలంగాణ డిస్కంల నుంచి రాష్ట్రానికి బకాయిలు తదితర అంశాలను ప్రధాన మంత్రికి ఆయన నివేదిక అందించారు. సుమారు గంటకుపైగా జరిగిన ఈ సమావేశంలో సీఎం నివేదించిన అంశాలపట్ల సానుకూలంగానే ఆయన స్పందించినట్టు సమాచారం. వైసీపీ వర్గాలు కేవలం రాష్ట్రానికి సంబంధించిన అంశాలు మాత్రమే ఇద్దరి మధ్య చర్చకు వచ్చాయని చెబుతున్నా.. రాజకీయ అంశాలపైనే చర్చ జరిగినట్టు ఢిల్లీ జాతీయ మీడియా టాక్. ముఖ్యంగా ఏపీలో రాజకీయ పరిస్థితులు.. పొత్తుల విషయంలో ఇతర పార్టీల స్టాండ్.. వీటితో పాటు జిల్లాల పునర్విభజన.. కేబినెట్ విస్తరణ తదితర అంశాలపైనా ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది.
ఇక వైసీపీ వర్గాలు చెబుతున్నదాని ప్రకారం.. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని సీఎం జగన్ ప్రధాని కోరారు. 2019, ఫిబ్రవరి 11న జరిగిన టెక్నికల్ అడ్వైజరీ కమిటీ పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను 55, 548.87 కోట్ల రూపాయలుగా నిర్ధారించింది. ఈ అంచనాలకు వెంటనే ఆమోదం తెలపాలని విజ్ఞప్తిచేసినట్టు సమాచారం. అలాగే ప్రాజెక్టును పూర్తిచేయడానికి ఇంకా 31,188 కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరాన్ని ప్రధాని ముందు ఉంచారు. నిర్మాణ పనులకోసం 8,590 కోట్లు, భూ సేకరణ పునరావాసంకోసం 22,598 కోట్లు ఖర్చవుతుందని వివరించినట్టు సమాచారం. ఇద్దరి మధ్య చాలా అంశాలు ప్రస్తావనకు వచ్చినా అధిక సమయం పోలవరం ప్రాజెక్టుపైనే చర్చ జరిగిందని.. దానిపై సానకూలంగా స్పందించిన ప్రధాని.. కేంద్ర జలశక్తి మంత్రిని కలిసి.. చర్చించమని చెప్పినట్టు తెలుస్తోంది.
జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్ధిదారుల గుర్తింపుకోసం అనుసరిస్తున్న విధానం లోపభూయిష్టంగా ఉందని ప్రధానికి చెప్పినట్టు సమాచారం. దీని కారణంగా ఏపీకి అన్యాయం జరుగుతోందని సీఎం చెప్పారని తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలో 1.45 కోట్ల కుటుంబాలకు రేషన్ అందిస్తుంటే, ఇందులో కేంద్రం నుంచి కేవలం 0.89 కోట్ల కుటుంబాలకు మాత్రమే అందుతోందని.. మిగిలిన 0.56 కోట్ల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా నిధులు ఖర్చుచేస్తూ రేషన్ ఇస్తోందని.. కానీ ఆర్థికంగా బాగున్న మహారాష్ట్ర, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాల్లోని 75శాతం, పట్టణ–నగర ప్రాంతాల్లోని 50శాతం ప్రజలకు రేషన్ను కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే, ఏపీలో మాత్రం 61 శాతం రూరల్, 41శాతం అర్బన్ ప్రజలకు మాత్రమే రేషన్ను ఇస్తున్న సంగతిని ప్రధానికి వివరించారు సీఎం జగన్..
అలాగే భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్టుకు సంబంధించి సైట్ క్లియరెన్స్ అప్రూవల్ గడువు ముగిసిందని.. తాజాగా క్లియరెన్స్ ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. ఈమేరకు పౌరవిమానయాన శాఖకు తగిన ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తిచేస్తున్నట్టు తెలిసింది. మరోవైపు రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం కడపలో సమగ్ర స్టీల్ప్లాంట్ ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని, స్టీల్ప్లాంట్ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ మెకాన్ ఇప్పటికీ తన నివేదికను ఇవ్వలేదని, రాయలసీమ, కడప జిల్లా ప్రజల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వమే స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు నడుంబిగించిందని, దీనికోసం వైయస్సార్ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్ను ఏర్పాటు చేసిందని.. ఈమేరకు కేంద్రం తోడ్పాటు అందించాలని విజ్ఞప్తిచేశారు.
మహమ్మారులు సోకినప్పుడు ప్రజారోగ్య వ్యవస్థ ఎంత కీలకమో ఇటీవల కోవిడ్ పరిస్థితుల్లో వెల్లడైందని గుర్తు చేశారు. ప్రజారోగ్య వ్యవస్థలో మౌలిక వసతులను గణనీయంగా పెంచడానికి ఏపీ ప్రభుత్వం భారీ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. రాష్ట్రంలో 11 బోధనాసుపత్రులు ఉన్నాయని.. కొత్తగా మరో మూడింటికి కేంద్రం అనుమతులు మంజూరుచేసిందని.. వీటి పనులు చురుగ్గా సాగుతున్నాయని ప్రధానికి విరించినట్టు సమాచారం. విభజన కారణంగా రాష్ట్రానికి భారీ నష్టం వాటిల్లిందని, రెవిన్యూ గ్యాప్ను భర్తీకోసం ఇచ్చిన నిధుల్లో తీవ్ర వ్యత్యాసం ఉందని, పెండింగ్ బిల్లుల బకాయిల రూపంలో, 10వ వేతన సంఘం సిఫార్సుల అమలులో భాగంగా ఇవ్వాల్సి బకాయిల రూపంలో తదితర కార్యక్రమాల వల్ల దాదాపు 32,625.25 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం తన సొంతంగా ఖర్చు చేసిందని వివరణ ఇచ్చారు. ఈ నిధులను రెవిన్యూ లోటు కింద భర్తీచేయాలిని ప్రధాని జగన్ కోరినట్టు సమాచారం.
రాష్ట్ర విభజన వల్ల 58.32శాతం జనాభా విభజిత ఆంధ్రప్రదేశ్కురాగా, కేవలం 46శాతం రెవిన్యూ మాత్రమే దక్కిందని. ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 9 శాతం జానాభా ఉన్న హైదరాబాద్ నగరంను కోల్పోవడం ద్వారా ఆ నగరం నుంచి అందే 38శాతం రెవిన్యూను కోల్పోయామని, తర్వాత వచ్చిన కోవిడ్.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గణనీయంగా దెబ్బతీసిందని.. దాదాపు 33,478 కోట్ల మేర ఆదాయం కోవిడ్ కారణంగా రాకుండాపోయిందని, కోవిడ్ నివారణా, చికిత్సలకోసం మరో 7,130 కోట్ల రూపాయలను అదనంగా ఖర్చు చేయాల్సిన అనివార్య పరిస్థితులు తలెత్తాయని, 15వ ఆర్థిక సంఘం కేటాయింపులు కూడా రాష్ట్రానికి తగ్గడం మరొక ప్రతికూల పరిణామని ఆయన ప్రధానికి విరించినట్టు తెలుస్తోంది.
ఇక ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ తర్వాత ముఖ్యమంత్రి వైయస్.జగన్ పలువురు కేంద్రమంత్రులను కలుసుకున్నారు. మొదటగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్తో సమావేశమయ్యారు. రెవిన్యూగ్యాప్ భర్తీకోసం ఇచ్చిన నిధుల్లో తీవ్ర వ్యత్యాసం ఉందని, పెండింగ్ బిల్లుల రూపంలో, 10వ వేతన సంఘం సిఫార్సుల అమలు... కార్యక్రమాలకు ఖర్చుచేసిన 32,625.25 కోట్లను భర్తీచేయాలని విజ్ఞప్తిచేశారు.
రాష్ట్రంలో గత ప్రభుత్వం హయాంలో అదనపు రుణాలకు అనుమతిచ్చి, ఇప్పుడు ఆ అదనపు రుణాలకు సరిపడా... రాష్ట్ర రుణపరిమితుల్లో కోత విధించడం సరికాదని, దీన్ని వెంటనే సవరించాలని సీఎం విజ్ఞప్తిచేశారు. పోలవరం ప్రాజెక్టుకు సకాలంలో నిధులు, సవరించిన అంచనాలకు ఆమోదం.. తదితర అంశాలపైనా కేంద్ర ఆర్థికశాఖమంత్రితో సీఎం చర్చించారు.
తర్వాత కేంద్ర జలశక్తిశాఖమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో సీఎం సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇరువురి మధ్య ప్రధాన చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్కు జీవనాడి లాంటి ఈ ప్రాజెక్టు పనులను సత్వరంగా పూర్తయ్యేలా తగిన సహాయ సహకారాలు అందించాలని సీఎంవిజ్ఞప్తిచేశారు.
టెక్నికల్ అడ్వైజరీ కమిటీ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నిరరించిన అంచనాలకు వెంటనే ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. కాంపొనెంట్ వారీగా కాకుండామొత్తం ప్రాజెక్టు పనులను పరిగణలోకి తీసుకుని బిల్లులు చెల్లించాలని కోరారు. వరదకారణంగా దెబ్బతిన్న ఎర్త్ కం రాక్ఫిల్ డ్యాం పునాదులకు సంబంధించి ఈ సమావేశంలోకూడా చర్చజరిగింది. దిగువ కాఫర్ డ్యాంకు సంబంధించి ఇప్పటికే డిజైన్లు ఖరారుచేసిన అంశాన్ని కేంద్రమంత్రి ప్రస్తావించారు.
ఎర్త్ కం రాక్ఫిల్ డ్యాంకు సంబంధించి డయాఫ్రం వాల్ ఎలా పటిష్టంచేయాలి? లేదా కొత్తగా నిర్మించాలా? అనే అంశాలపై వరుసగా నిపుణులతో చర్చలు జరుపుతున్నామని, ఇవికూడా వారం పదిరోజుల్లో ఖరారు అవుతాయని సీఎంకు తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ కారణంగా నిర్వాసితులైన కుటుంబాలకు ఎలాంటి ఆలస్యం లేకుండా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు బదిలీచేయాలని సీఎం విజ్ఞప్తిచేసినట్టు సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP News, Nirmala sitharaman, Pm modi