గోదావరి వరదలు (Godavari Floods), పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) ఎత్తు అంశం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), తెలంగాణ (Telangana) మధ్య రాజకీయ వైరానికి దారితీస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ చేసిన కామెంట్స్ కు ఏపీ మంత్రులు బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana), అంబటి రాంబాబు (Ambati Rambabu), మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) కౌంటర్ ఇవ్వగా.. తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. పోలవరం అంశాన్ని వివాదం చేసే కుట్ర జరుగుతుందని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు గురించి టీఆర్ఎస్ నాయకులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని.. పోలవరాన్ని ప్రశ్నిస్తే... తెలంగాణ ఏర్పాటును ప్రశ్నించినట్లేనని.., రాష్ట్ర విభజన అంశాన్ని తిరగదోడినట్లేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన బిల్లు ప్రకారం పోలవరం నిర్మాణం చేయాల్సిన అవసరముందని సోము అన్నారు.
1960లో పోలవరం ముంపు మండలాలను ఖమ్మంలో కలిపారని.., విభజన తర్వాత భద్రాచలం ఆలయాన్ని,మరో రెండు మండలాలు తెలంగాణకు ఇచ్చారని సోము అన్నారు. దుమ్మగూడెం ప్రాజెక్టు ద్వారా నాగార్జున సాగర్ కు నీరు ఇవ్వాలని దివంగత సీఎం వైఎస్ పనులు చేపట్టారని.., దుమ్ముగూడెం వాళ్లకు ఇవ్వడం వల్ల రాయలసీమ తీవ్రంగా నష్టపోయిందన్నారు. రాష్ట్ర విభజన పై పూర్తిగా అధ్యయనం చేసిన ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని సోము వీర్రాజు స్పష్టం చేశారు. అప్పట్లో పోలవరం వద్దని వరంగల్ కు చెందిన ఓ టీడీపీ మహిళా నేత అన్నారు. ఇప్పుడు బీజేపీలో ఉన్న ఇద్దరు నేతలు ఆమె మాటలను కనీసం ఖండించలేదని సోము వీర్రాజు గుర్తుచేశారు.
రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు పోలవరం సోమవారం అని ఆర్భాటం చేశారన్నారు. పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తే.. విభజన చట్టాన్ని ఒప్పుకోనట్లేనని.. అప్పుడొక మాట... ఇప్పుడొక మాట అనేది కరెక్ట్ కాదని హితవు పలికారు. పోలవరం ముంపు ప్రాంతాల్లో కొన్ని గ్రామాల ప్రజలు తెలంగాణ కలుస్తామంటున్నారని., వారంతా భద్రాచలం మీద ఆధార పడటం వల్ల అటు చూస్తున్నారని అభిప్రాయపడ్డారు. విలీనం చేసిన మండలాల్లో సిపిఎం ఆందోళన చేయడం ఎంటని ప్రశ్నించిన సోము వీర్రాజు.. టీఆర్ఎస్ తో లాలూచీపడి రోడ్డెక్కారా అని ప్రశ్నించారు.
పోలవరం విషయంలో ఏపీ సీఎం జగన్ ప్రజలను మోసం చేస్తున్నారని సోము విమర్శించారు. గతంలో చంద్రబాబు కూడా ఇలానే ప్రకటించి దెబ్బతిన్నారని గుర్తుచేశారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఎపీ పర్యటన తరువాత 15 రోజులకొకసారి పోలవరంపై రివ్యూ చేస్తున్నారని.. లోయర్ కాఫర్ డ్యాం పాడైన విషయంపై అధ్యయనం జరుగుతోందని తెలిపారు. పోలవరంలో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని ప్రచారం చేసిన జగన్.. మూడేళ్లలో వాటిని ఎందుకు బయటపెట్టి చర్యలు తీసుకోలేదని సోము వీర్రాజు ప్రశ్నించారు. పోలవరం నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తి చేసి తీరుతుందన్న సోము.. ఏపీలో పరిణామాలను జాతీయ నాయకత్వానికి వివరిస్తామన్నారు. ఇక విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యలపై సోము వీర్రాజు స్పందించారు. భవిష్యత్తులో జరగబోయే అంశాలను ఇప్పుడే చెప్పేస్తామని వ్యాఖ్యానించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Polavaram, Somu veerraju