ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో విద్యుత్ సంక్షోభం ( AP Power Crisis) నడుస్తోంది. విద్యుత్ కొరత కారణంగా పలు జిల్లాల్లో గంటల కొద్దీ విద్యుత్ కోతలు కొనసాగుతున్నాయి. అప్రకటిత విద్యుత్ కోతలో ప్రజలు తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారు. వేసవిలో విద్యుత్ కోతల విధించడంతో ప్రభుత్వంపై ప్రజలు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే మరో సమస్య ఏపీ ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతోంది. ఈసారి విద్యుత్ తో కాకపోయినా అంతకంటే కీలకమైన నీటి విషయంలో సమస్య మంచెత్తే ప్రమాదముంది. తెలంగాణ (Telangana) తో ఎప్పుడూ ఉండే నీటి వివాదమే మండు వేసవిలో ఏపీ ప్రభుత్వానికి తలనొప్పిగా మారబోతోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి జల విద్యుత్ ఉత్పత్తికి తెలంగాణ ప్రభుత్వం నీటిని విడుదల చేస్తోంది. నీటి విడుదలకు కృష్ణా రివర్ బోర్డు అంగీకరించకున్నా టీఎస్ ప్రభుత్వం మాత్రం ముందుకెళ్తోంది.
విద్యుత్ ఉత్పత్తి కోసం తెలంగాణ రోజుకు 3వేల నుంచి 7వేల క్యూసెక్కుల వరకు నీటిని వినియోగిస్తోంది. దీనిపై కృష్ణా రివర్ బోర్డు వద్ద ఏపీ ప్రభుత్వం అభ్యంతరం తెలిపినా స్పందన లేదు. నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 543 అడుగుల మేర నీటిమట్టం ఉంది. ఇన్ ఫ్లో 5,192 క్యూసెక్కులుండగా.. ఔట్ ఫ్లో 17,501 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 194 టీఎంసీల నీటి నిల్వ ఉండగా.. 131.66 టీఎంసీలకు చేరితే డెడ్ స్టోరీజీగా పరిగణిస్తారు. అంటే రెండు రాష్ట్రాలు కలిపి వేసవికి తాగు, సాగునీరు, విద్యుత్ ఉత్పత్తి అవసరాలకు కేవలం 62.34 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది.
ఇలాంటి పరిస్థితుల్లో రోజుకు సగటున 5వేల క్యూసెక్కుల నీటిని తెలంగాణ ప్రభుత్వం దిగువనున్న పులిచింతలకు విడుదల చేస్తోంది. అక్కడి నుంచి ప్రకాశం బ్యారేజీకి వస్తున్నాయి. ఇప్పటికే రెండు చోట్ల దాదాపు పూర్తిస్థాయి నీటిమట్టం ఉండటంతో అదనంగా వచ్చిన నీటిని సముద్రంలోకి విడుదల చేయక తప్పని పరిస్థితి.
మే నెలలో వేసవి తీవ్రత అధికంగా ఉండనుంది. దీంతో తాగునీటి అవసరాలు కూడా అదేస్థాయిలో ఉంటాయి. జూన్ రెండో వారం నుంచి సాగునీటి అవసరాలు కూడా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ నెలలోనే నీటిని వృథాచేస్తే మేలో తీవ్ర నీటి ఎద్దడి తప్పదని ఏపీ అధికారులంటున్నారు. ఏపీలో గుంటూరు, ప్రకాశం జిల్లాలు పూర్తిగా కృష్ణా జలాలపైనే ఆధారపడి ఉన్నాయి. ఈ రెండు జిల్లాల తాగునీటి అవసరాలకు దాదాపు 20 టీఎంసీల నీరు అవసరమవుతుంది. అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా సాగర్ జలాల నుంచే హైదరాబాద్ (Hyderabad) కు తాగునీటిని అందించాల్సి ఉంటుంది.
రెండు రాష్ట్రాలకు కలిపి 62 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉండటం, ఉన్ననీటిని విద్యుత్ ఉత్పత్తికి వినియోగిస్తుండటంతో నీటి ఎద్దడి తప్పదని పలువురు హెచ్చరిస్తున్నారు. గత రెండేళ్లుగా వేసవి సమయంలో తెలంగాణ, ఏపీ మధ్య ఇలాంటి వివాదమే నడుస్తోంది. కేఆర్ఎంబీ నిబంధనలను పట్టించుకోకుండా తెలంగాణ విద్యుదుత్పత్తి చేపట్టడంతో కృష్ణాజలాలు వృథాగా సముద్రంలోకి పోయాయి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉండటంతో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Krishna River, Telangana, Water Crisis