ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణ కోసం ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయగా... ఈ కేసును ఎన్ఐఏ(కేంద్ర దర్యాప్తు సంస్థ)కు అప్పగించింది కేంద్ర హోంశాఖ. హైకోర్టు సైతం ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కేసు విచారణ కోసం ఎన్ఐఏ అధికారులు రంగంలోకి దిగి నిందితుడు శ్రీనివాసరావును ఆరు రోజుల పాటు విచారించారు. అయితే ఈ కేసును మొదటగా విచారించిన సిట్ పోలీసులు తమకు సహకరించడం లేదని...తాము కోరిన ఆధారాలు ఇవ్వడం లేదని విజయవాడ ఎన్ఐఏ కోర్టులో ఎన్ఐఏ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు.
అయితే అసలు ఈ కేసును ఎన్ఐఏకు అప్పగించడం సరికాదని కొద్దిరోజులుగా వాదిస్తున్న ఏపీ ప్రభుత్వం... దీనిపై తమ నిరసనను తెలుపుతూ వచ్చింది. అయితే తాజాగా ఈ అంశంపై హైకోర్టుకు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి రేపు హైకోర్టులో పిటిషన్ వేయాలని భావిస్తోంది. హైకోర్టుకు సంక్రాంతి సెలవులు ఉండటంతో రేపు ఫైలింగ్కు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును ఎన్ఐఏకు అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని ఏపీ ప్రభుత్వం కోరబోతున్నట్టు తెలుస్తోంది. కేసును ఎన్ఐఏకు ఇవ్వడం చట్ట విరుద్ధమని ఏపీ ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో... కేసు తేలేవరకు ఎన్ఐఏకు రికార్డులు ఇవ్వొద్దని నిర్ణయించినట్టు సమాచారం. మొత్తానికి జగన్పై దాడి కేసు వ్యవహారంలో ఏపీ పోలీసులు సహకరించకపోవడంతో కోర్టు ఆదేశాల ద్వారా విచారణలో ముందుకు సాగుతున్న ఎన్ఐఏ... ఇక ముందు ఏ రకంగా దర్యాప్తును కొనసాగిస్తుందో చూడాలి.
VIDEO: రెండు రాష్ట్రాల ఎంపీలు ఒక్కటైతే ప్రత్యేకహోదాకు మరింత సపోర్టు : వైఎస్ జగన్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, High Court, NIA, Tdp, Ys jagan