M Bala Krishna, News18, Hyderabad
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ (CM YS Jagan) రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రారంభించిన 108 వాహనాలు ఇప్పుడు ఆగనున్నాయి. కష్టకాలంలో ప్రజల ప్రాణాలు రక్షించే 108 ఉద్యోగులు ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు. గడిచిన మూడు నెలలగా 108 ఉద్యోగులకు జీతాలు రాకపోవడం ఇంటి అద్దెలు, ప్రతి నెల ఉండే ఈఏస్ఐలు కట్టలేక నాలా తంటాలు పడుతున్నారు. ఏపీలో 3,400 (108) అంబులెన్స్ ఉద్యోగులు, 2,400 (104) సర్వీస్ ఉద్యోగులు ఉన్నారు. ప్రభుత్వం 108 వాహానాలను లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్ టెక్నాలజీతో కొత్త వాటిని అందించింది కానీ 24 గంటలు పని చేస్తోన్న ఉద్యోగులకు మాత్రం జీతాలు ఇవ్వడం లేదు ప్రభుత్వం.
కోవిడ్-19 మహమ్మారి సమయంలో ప్రాణాలను కాపాడేందుకు కష్టపడి పనిచేసిన ఈ ఉద్యోగులు గత మూడు నెలలుగా జీతాలు లేకుండా పని చేస్తున్నారు. ప్రతి ఏటా 40% బకాయిలు ఇస్తామని చెప్పి రెండేళ్లు గడుస్తున్నా ఈ హామీలను అమలు కాలేదని ఉద్యోగులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న 104 సర్వీసు ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించడానికి కన్సల్టింగ్ డాక్టర్, మొబైల్ లాబొరేటరీతో మొబైల్ యూనిట్ 24x7 పని చేస్తుంది. అయితే, నిధుల కొరత వారి పనిపై ప్రభావం చూపుతోంది.
"రెండు నెలలుగా అద్దె ఇంట్లో ఉంటున్నాను. నాకు జీతం రాలేదు, మా ఇంటి ఓనర్ నన్ను అద్దెకు అడుగుతాడు, అద్దె చెల్లించడానికి డబ్బు పంపమని ఉర్లో ఉన్న మా తల్లిదండ్రులను అడగాల్సి వచ్చింది. మేము పగలు రాత్రి పని చేస్తున్నాము, అత్యవసర సమయంలో ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికి పరుగెత్తుతున్నాము. కానీ మా సమస్యలను పట్ల ప్రభుత్వం స్పందించడం లేదని 104 సర్వీస్ ఉద్యోగి మాధవి న్యూస్ 18కి తెలిపారు.
ఏపీలో గత ఏడాది కాలంగా ఇదే పరిస్థితి నెలకొందని . ప్రభుత్వానికి ఉద్యోగ సంఘలు లేఖ రాసిన ప్రతిసారీ యాజమాన్యం లేదా రాష్ట్ర ప్రభుత్వం మా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నప్పటికి అవి హామిలకే పరిమితమవుతున్నాయి. "COVID-19, కారణంగా మొత్తం 28 మంది ఉద్యోగులు మరణించారు. కానీ ఇప్పటి వరకు మృతుల కుటుంబాలకు ఎలాంటి ఎక్స్ గ్రేషియా అందలేదు” అని ఒక ఉద్యోగి వాపోయారు.
ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఏపీ సర్కారు ఇప్పుడు వీరి సమస్యల పట్ల ఎలా స్పందిస్తారో చూడాలి. మరో వైపు మూడు నెలలగా జీతాలు లేక చాలా మది 108,104 ఉద్యోగులు నానా కష్టాలు పడుతున్నారు. ఐతే ఇటీవలే రెండు నెలలకు సంబంధించిన జీతాలు విడుదల చేశామని అరబిందో సంస్థ చెబుతున్నా.. ఉద్యోగులు మాత్రం తమకు అందలేదంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 108 ambulence, Andhra Pradesh