రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో (Government Office)నూ త్వరలో ఫేస్ రికగ్నిషన్ (Face Recognition) అటెండెన్సు వ్యవస్థను తీసుకుని రానున్నామని, అందులో మొదటగా విద్యాశాఖలో ఈ ప్రక్రియను మొదలు పెట్టామని విద్యా శాఖ మంత్రి (Education Minister) బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) పేర్కొన్నారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం నాడు ఉపాధ్యాయ సంఘాలతో ఆయన సమావేశమయ్యారు. పాఠశాలల్లో విద్యార్దులు (Students), ఉపాధ్యాయుల (Teachers) అటెండెన్సు నమోదు కోసం రూపొందించిన యాప్ వినియోగంలో ఉన్న అపోహలు, ఎదురవుతున్న ఇబ్బందులపై ఈ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించారు. సమావేశం అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ చీఫ్ సెక్రటరీ నుంచి ఆఫీస్ సబార్డినేట్ వరకు అందరూ కూడా ఫేస్ రికగ్నిషన్ యాప్ నే వినియోగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని, అందులో మొదటగా విద్యాశాఖలో ఈ వ్యవస్థను వినియోగంలోకి తెచ్చామన్నారు. అటెండెన్సు యాప్ విషయంలో ఉపాధ్యాయులు ఎంతమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ఉద్యోగుల పక్షపాత ప్రభుత్వం అని మంత్రి అన్నారు. విద్యార్థుల బాగోగులు, మంచి ప్రమాణాలతో విద్యను అందించడమే లక్ష్యంగా, పూర్తి సానుకూల ధృక్పథంతోనే విధాన పరమైన నిర్ణయాలు తీసుకుంటున్నామని, వాటిని అమలు చేయడంలో ఏమైనా ఇబ్బందులు, సమస్యలు ఎదురైతే వాటిని అధిగమించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని బొత్సా మరోసారి స్పష్టం చేశారు.
కాగా, విద్యాశాఖలో ఉపాధ్యాయుల అటెండెన్స్కు సంబంధించిన యాప్ విషయంలో కొంత సమాచార లోపం (కమ్యూనికేషన్ గ్యాప్ ) వచ్చిందని, దానిని సరిదిద్దే క్రమంలో ఆయా సంఘాలతో సమావేశం నిర్వహించి వారి సందేహాలను నివృత్తి చేసే చర్యలు చేపట్టామన్నారు. వారి అభ్యంతరాలను పరిగణనలోనికి తీసుకుని కొన్ని మార్పులు చేర్పులు చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. పాఠశాలకు ఆలస్యంగా వస్తే ఆ రోజును సెలవుగా పరిగణిస్తారన్న ప్రచారంపై స్పష్టతనిస్తూ , ఉద్యోగుల హాజరీ విషయంలో ఏళ్ల తరబడి ఉన్న నిబంధనలనే అమలు చేస్తున్నాము తప్పితే కొత్తగా ఏమీ చేర్చలేదన్నారు. మూడు సార్లకు మించి నాలుగోసారి ఆలస్యంగా వస్తే హాఫ్ డే లీవ్ కింద పరిగణించడం తప్ప కొత్త నిబంధనలేమీ పెట్టలేదన్నారు.
రాష్ట్రంలో 1.83 లక్షల మంది ఉపాధ్యాయులు ఉంటే, ఇంతవరకు దాదాపుగా లక్ష మంది యాప్ లో రిజిస్టర్ చేసుకున్నారని, మిగిలిన వారందరూ కూడా యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని దాని వినియోగించడాన్ని అలవాటు చేసుకోడానికి వీలుగా 15 రోజులను ట్రైనింగ్ పీరియడ్గా పరిగణించాలని నిర్ణయించినట్లు మంత్రి వివరించారు. అటెండెన్స్ నమోదు చేసే సమయంలో నెట్వర్క్ సమస్యలు ఎదురైనప్పటికీ, యాప్ ఏ విధంగా పనిచేస్తుందో అన్న విషయాన్ని కూడా అధికారులు ఉపాధ్యాయ సంఘాల నాయకులకు వివరించారు. ఈ 15 రోజుల ట్రైనింగ్ సమయంలో , ఏమైనా కొత్త సమస్యలు ఇబ్బందులు తలెత్తితే వాటిని కూడా పరిష్కరించి యాప్ ను పూర్తి స్థాయిలో వినియోగించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AP Politics, Botsa satyanarayana, EDUCATION, Teacher