ఏపీలో మూడు రాజధానుల వ్యవహారంపై దుమారం కొనసాగుతోంది. సీఎం జగన్ ప్రకటన, జీఎన్ రావు కమిటీ నివేదికను నిరసిస్తూ అమరావతిలో రైతుల ఆందోళనలు జరుగుతున్నాయి. 12 రోజులుగా ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. ఇక టీడీపీ, జనసేన, బీజేపీ సైతం సీఎం జగన్కు వ్యతిరేకంగా పలు కార్యక్రమాలు నిర్వహించాయి. అమరావతి నుంచి రాజధానిని తరలిస్తే ఊరుకోబోమంటూ హెచ్చరిస్తున్నాయి. ఐతే రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా టాలీవుడ్ స్పందించడం లేదంటూ ఏపీ కాంగ్రెస్ మండిపడుతోంది.
ప్రజల టికెట్లతో వందల కోట్లు సంపాదించుకున్న సినీ పెద్దలు.. అదే ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఎందుకు స్పందించరని ప్రశ్నిస్తోంది. మూడు రాజధానులపై ఏపీలో ఆందోళనలు జరుగుతున్నాయి.. కానీ సినీ పరిశ్రమ మాత్రం మౌనంగా ఉందంటూ విమర్శలు గుప్పిస్తోంది. మూడు రాజధానులపై సినీ ప్రముఖులు స్పందించాలని ఏపీ కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. సినీ ప్రముఖుల మౌన రాష్ట్ర శ్రేయస్సుకు మంచిది కాదని..హీరోలపై అభిమాన సంఘాలు ఒత్తిడి తీసుకురావాలని సూచించింది. ఈ నెల 10 లోపు సినీ ప్రముఖులు స్పందించకుంటే సంక్రాంతికి సినిమాలను ఆడనివ్వబోమని హెచ్చరించింది. సంక్రాంతికి మూడు రోజుల పాటు థియేటర్ల బంద్కు పిలునిస్తామని స్పష్టం చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amaravati, AP Congress