ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. తూర్పుగోదావరి జిల్లా కొమరగిరిలో ఇళ్ల పట్టాల పంపిణీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారభించారు. ఓ వైపు క్రిస్మస్, మరోవైపు వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఇళ్ల స్థలాల పట్టాలకు అందించడం మహాభాగ్యం అని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఇంతకు మించి తాను ఇంకేం కోరుకుంటానని చెప్పారు. రాష్ట్రంలో కులమతాలకు సంబంధం లేకుండా లబ్ధిదారులను ఎంపిక చేశామన్నారు. రాష్ట్రంలో 30.75 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ కోసం 66,518 ఎకరాలు సేకరించామన్నారు. రాబోయే మూడు సంవత్సరాల్లో ఇళ్లు కాదు, ఊళ్లు ఏర్పడతాయని జగన్ అన్నారు. ప్రస్తుతం సేకరించిన ఇళ్ల స్థలాల్లో తొలిదశలో 15.10 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడతామన్నారు. ఆ తర్వాత రెండో దశలో ఇళ్లను నిర్మిస్తామన్నారు. 37.50 లక్షల ఇళ్ల నిర్మాణం కోసం రూ.54,940 కోట్లు ఖర్చవుతుందన్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం పండుగలా నిర్వహించనున్నారు.
లబ్ధిదారులకు ముఖ్యమంత్రి జగన్ మూడు ఆఫర్లు ఇచ్చారు.
ఆప్షన్ 1. ప్రభుత్వం ఇచ్చిన నమూనా ప్రకారం ఇల్లు కట్టుకోవడానికి నాణ్యమైన సామగ్రి ప్రభుత్వం సరఫరా చేస్తుంది. లేబర్ చార్జీలు లబ్ధిదారుల చేతికి ఇస్తుంది. మీరే దగ్గరుండి ఇల్లు కట్టుకోవాలనుకుంటే కట్టుకోవచ్చు.
ఆప్షన్ 2. నిర్మాణ సామగ్రి లబ్ధిదారులు స్వయంగా కొనుక్కోవచ్చు. ఇల్లు కట్టుకోవచ్చు. దీనికి ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుంది. బేస్మెంట్కి కొంత, పిల్లర్స్కి కొంత, స్లాబ్కి కొంత, ఇలా విడుతల వారీగా నిధులు మంజూరు చేస్తారు.
ఆప్షన్ 3. ప్రభుత్వమే ఇల్లు కట్టించి ఇవ్వడం.
యు.కొత్తపల్లి మండలం, కొమరగిరి గ్రామంలో నవరత్నాలు– పేదలందరికీ ఇళ్లు.. ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ, వైయస్ఆర్ జగనన్న కాలనీ శంకుస్థాపన పైలాన్ను ఆవిష్కరించిన సీఎం వైయస్ జగన్. #HousingForPoor🏠#YSRJaganannaIllaPattalu🏠 pic.twitter.com/IWJGrvW2mD
— YSR Congress Party (@YSRCParty) December 25, 2020
పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వనివ్వకుండా టీడీపీ అడ్డుపడిందని జగన్ ఆరోపించారు. కోర్టుల్లో కేసులు వేసి చాలాసార్లు అడ్డుకున్నారన్నారు. మొదట ఉగాది రోజు పంపిణీ చేద్దామని అనుకున్నా.. కోర్టుల కేసుల కారణంగా పలు మార్లు వాయిదా పడిందని చెప్పారు. ఇప్పటికీ న్యాపరమైన చిక్కుల వల్ల 3.7 లక్షల మందికి ఇళ్ల పట్టాలు అందించలేకపోతున్నామని, వారికి కూడా లీగల్ సమస్యలు తీరిన వెంటనే ఇళ్ల పట్టాలు అందజేస్తామన్నారు.
పసుపు పార్టీల ఎర్రముఖం
పేదలందరికీ ఇళ్ల పథకంలో అందరికీ ఇళ్లు ఇస్తుంటే పసుపు పార్టీల ముఖాలు ఎరుపు రంగుకి మారుతున్నాయని జగన్ ఎద్దేవా చేశారు. కుల సమీకరణాలు దెబ్బతింటాయనే కారణంతో అమరావతిలో 54వేల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారని మండిపడ్డారు. అన్ని కులాల వారు ఉంటేనే అది రాజధాని అవుతుందన్న జగన్, అలాంటి రాజధాని తెచ్చుకుంటామని స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, East Godavari Dist, Housing lands for poor, Navaratnalu