త కొంతకాలంగా దేశంలో వంటనూనెల కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. ముఖ్యంరా ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం నేపథ్యంలో వంటనూనెల ధరలు (Cooking Oil Price) అమాంతం పెరిగాయి. దీంతో సామాన్యులు నూనెలు కొనలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇటు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోనూ వంట నూనెలు దొరకని పరిస్థితి ఏర్పడింది. బ్లాక్ మార్కెటింగ్ ఎక్కువ కావడంతో వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ స్పందించారు. కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, పియూష్ గోయల్ కు లేఖలు రాశారు. వంటనూనెలకు కొరత నేపథ్యంలో ఆవనూనెపై దిగుమతి సుంకం తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. రష్యా ఉక్రెయిన్ పరిస్థితుల దృష్ట్యా సన్ ఫ్లవర్ ఆయిల్కు కొరత ఏర్పడిందని.., ఈ నేపథ్యంలో ఆవనూనె దిగుమతులపై దిగుమతి సంకాన్ని తగ్గించాలని ఆయన కోరారు.
2021-22లో దేశంలో వంటనూనెల వినియోగం 240 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, ఇందులో 40శాతం మాత్రమే దేశీయంగా ఉత్పత్తి అయ్యిందని, మిగిలిన 60శాతం విదేశాలనుంచి దిగుమతి చేసుకోవాల్సి చేసుకోవాల్సి వచ్చిందని సీఎం జగన్ పేర్కొన్నారు. దిగుమతి చేసుకుంటున్న వంటనూనెల్లో 95 శాతం పామాయిల్ను ఇండోనేషియా, మలేషియాల నుంచి, 92 శాతం సన్ ఫ్లవర్ ఆయిల్ను ఉక్రెయిన్, రష్యాలనుంచి దిగుమతి చేసుకుంటున్నామని గుర్తుచేశారు. ఉక్రెయిన్, రష్యాల్లో పరిస్థితుల వల్ల ఒక్కసారిగా ప్రపంచంలో ఈ వంటనూనెలకు కొరత ఏర్పడిందని, ఈ ప్రభావం వినియోగదారులపై పడిందని వివరించారు.
దీనివల్ల సన్ఫ్లవర్తోపాటు, ఇతర వంటనూనెల ధరలు పెరిగాయన్న సీఎం.., రాష్ట్రంలో మూడింట రెండొంతులమంది సన్ ఫ్లవర్నే వాడుతారని, దీనితర్వాత పామాయిల్ను 28శాతం మంది, వేరుశెనగనూనెను 4.3 శాతం మంది వాడుతారన్నారు. మార్కెట్లో వంటనూనెల సరఫరాకు ఎలాంటి ఇబ్బందిలేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుందని జగన్ వెల్లడించారు.
విజిలెన్స్, పౌరసరఫరాలు, తూనికలుకొలతలు శాఖలు విస్తృతంగా తనిఖీలు చేపట్టాయని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలుకూడా తీసుకున్నాయని లేఖలో పేర్కొన్నారు. కొరతలేకుండా వంట నూనెలు సరఫరా చేయడానికి, రోజువారీగా ధరలు సమీక్షించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవడానికి టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. తయారీదారులు, దిగుమతిదారులు, రిఫైనరీ చేసేవారితో క్రమం తప్పకుండా సమావేశాలు కూడా నిర్వహిస్తున్నామని తెలిపిన సీఎం.., ఏపీ ఆయిల్ ఫెడ్ ద్వారా రైతు బజారల్లో సరసమైన ధరలకే విక్రయిస్తున్నామన్నారు.
ఇతర వంటనూనెల వినియోగంపై వినియోగదారుల్లో అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. ఆవాల నూనెకూడా సన్ ఫ్లవర్ లానే ఉంటుందని, కెనడాలో ఎక్కువగా ఉత్పత్తి అవుతోందన్న సీఎం.., ప్రస్తుతం ముడి ఆవనూనెపై 38.5శాతం, శుద్ధిచేసిన ఆవనూనెపై 45శాతం దిగుమతి సుంకం ఉందన్నారు. దిగుమతి చేసుకునేందుకు ఈ సుంకాలు ప్రతిబంధకంగా ఉన్నాయని, వినియోగదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కనీసం ఏడాదిపాటు ఆవనూనెపై దిగుమతి సుంకాలను తగ్గించాలన్నారు. సుంకం తగ్గించడం ద్వారా వినియోగదారుల ప్రయోజనాలను కాపాడుగలుగుతామని వివరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan