ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మరో పోర్టు నిర్మాణం కానుంది. ప్రకాశం జిల్లా (Prakasham District) ఉలపాడు మండలంలో రామాయపట్నం పోర్టు పనులను సీఎం జగన్ బుధవారం ప్రారంభించనున్నారు. జాతీయరహదారికి 4.5 కిలోమీటర్ల నిర్మిస్తున్న పోర్టు తొలిదశ పనులను 36 నెలల్లో పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రూ. 3736.14 కోట్లతో పోర్టు తొలిదశ పనులు చేపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఏపీ మారిటైం బోర్డు కింద రామాయపట్నం పోర్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రాజెక్టును నిర్మిస్తోంది. తొలిదశలో మొత్తం నాలుగు బెర్తుల నిర్మాణం చేపట్టనున్నారు. ఏడాదికి 25 మిలియన్ టన్నుల ఎగుమతి లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. కార్గో, బొగ్గు, కంటైనర్ల కోసం నాలుగు బెర్తుల నిర్మాణం చేపట్టనున్నారు. రెండోదశలో 138.54 మిలియన్ టన్నులకు విస్తరణ, మొత్తంగా 15 బెర్తులు నిర్మిస్తారు.
ఏపీలోని ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కర్నూలు సహా రాయలసీమలోని పలు జిల్లాలు, తెలంగాణలోని నల్గొండ, మహబూబ్నగర్,రంగారెడ్డి, హైదరాబాద్ ప్రాంతాలకు సంబంధించి పారిశ్రామిక, వాణిజ, రవాణా సేవల్లో రామాయపట్నం పోర్టు కీలకం కానుంది.
తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన పలుప్రాంతాలకు వాణిజ్య, వ్యాపార, రవాణా సేవలు ఈ పోర్టు ద్వారా మరింత సులభతరం కానున్నాయి. బొగ్గు, ఇనుపఖనిజం, గ్రానైట్, ఆహార ధాన్యాలు, బియ్యం సహా ఇతర ధాన్యాలు, సిమెంటు, ఫెర్టిలైజర్స్, పొగాకు, మిర్చి, ఆక్వా ఉత్పత్తులు, కంటైనర్లు తదితర రవాణాలో ఈ పోర్టు కీలకం కానుంది.
రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న వ్యవసాయం, పరిశ్రమలు మరియు సేవారంగానికి ఊతమివ్వడంతో పాటు ఫుడ్ప్రాసింగ్, సాఫ్ట్వేర్ ఎగుమతులు, ఎలక్ట్రానిక్స్, విద్యుత్, టెక్స్టైల్, టూరిజం రంగాలకు మరింత తోడ్పాటునందించనున్నట్లు ఏపీ ప్రభుత్వం పేర్కొంది. అలాగే ఔషధాలు, రసాయనాలు, ప్లాస్టిక్, ఖనిజాలు, చేతి వృత్తులు, టెక్స్టైల్స్, లెదర్ తదితర ఎగుమతుల్లో కీలక పాత్ర పోషిచనుంది. ఇక ఇదే పోర్టుతోపాటు మచిలీపట్నం, భావనపాడు పోర్టుల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపడుతోంది. ప్రతి కోస్తా జిల్లాలకూ ఒక ఫిషింగ్ హార్బర్ ఉండేలా మొత్తం 9 హార్బర్లను ఏపీ ప్రభుత్వం నిర్మిస్తోంది.
రూ.3500 కోట్లతో 9 షిఫింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టిన ప్రభుత్వం.., ఫేజ్-1లో భాగంగా 4 హార్బర్ల నిర్మాణం పూర్తి చేయనుంది. జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడల్లో తొలిదశలో ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. రెండో దశ కింద మొత్తం 5 చోట్ల ఫిషింగ్ హార్బర్లు నిర్మించనుంది. బుడగట్ల పాలెం, పూడిమడక, బియ్యపు తిప్ప, వాడరేవు, కొత్తపట్నం షిఫింగ్ హార్బర్ల ను రెండో దశలో నిర్మించనున్నారు. వీటిద్వారా 4.5 లక్షల టన్నుల అదనపు మత్స్య ఉత్పత్తలు సేకరణకు వీలవుతుందని.., విస్తృతంగా ఉపాధి అవకాశాలు కలగడంతో ఆర్ధిక వ్యవస్థ బలోపేతమవుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Prakasham dist