ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan) చేపట్టిన తొలి అధికారిక విదేశీ పర్యటనపై మీడియాలో అనూహ్య కథనాలు వస్తున్నాయి. ఏపీకి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా దావోస్(స్విట్జర్లాండ్) వేదికగా జరుగుతోన్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) (World Economic Forum) సదస్సులో సీఎం బృందం కీలకంగా వ్యవహరించనుంది. దాదాపు 10రోజుల విదేశీ పర్యటనకు వెళ్లిన జగన్ ఈనెల 22 నుంచి 26 వరకు దావోస్ (Davos) సదస్సులో పాల్గొంటారు.
కాగా, ప్రత్యేక విమానంలో సీఎం జగన్ దావోస్ వెళ్లిన మార్గంపై, విమానం మధ్యలో దారిమళ్లిన వైనంపై ‘ఆంధ్రజ్యోతి’ ఓ సంచలన కథనం రాసింది. అధికారికంగా వెల్లడైన సమాచారం, మీడియా కథనం రెండిటినీ ఇక్కడ ఇస్తున్నాం..
ఏం జరిగిందంటే: వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో పాల్గొనేందుకు విజయవాడ నుంచి శుక్రవారం ఉదయం బయలుదేరి వెళ్లిన సీఎం వైఎస్ జగన్ రాత్రి పొద్దుపోయాక దావోస్ చేరుకున్నారు. ఈ నెల 22 నుంచి 26వ తేదీ వరకు అక్కడ డబ్ల్యూఈఎఫ్ సదస్సు జరగనున్న విషయం తెలిసిందే. పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలో ఉన్న అవకాశాల గురించి ఈ సదస్సులో విస్తృతంగా చర్చిస్తారు. ఇందుకోసం పలువురు ఉన్నతాధికారులతో కలిసి సీఎం జగన్ దావోస్ వెళ్లారు. కాగా, ఉదయం గన్నవరం విమానాశ్రయంలో సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, ఇతర ఉన్నతాధికారులు సీఎంకు వీడ్కోలు పలికారు.
ఏపీకి ఎంతో కీలకం: దావోస్ డబ్ల్యూఈఎఫ్ సదస్సును కీలకంగా భావిస్తోన్నది ఏపీ సర్కారు. అక్కడ పారిశ్రామికవేత్తలు, ఆర్థికవేత్తలతో సీఎం జగన్ భేటీ కానున్నారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి వివరించనున్నారు. పారిశ్రామికీకరణ 4.0 దిశగా అడుగులపై దావోస్ వేదికగా కీలక చర్చలు జరగనున్నాయి. విశాఖ, కాకినాడ, కృష్ణపట్నంతో పాటు రాష్ట్రంలో నిర్మిస్తున్న పోర్టులు, కొత్తగా చేపట్టిన మూడు ఎయిర్పోర్టుల అభివృద్ధి ద్వారా నాలుగో పారిశ్రామికీకరణకు ఏ రకంగా దోహదపడుతుందో ఈ సదస్సులో వివరించనున్నారు. అటు.. బెంగళూరు-హైదరాబాద్, చెన్నై- బెంగుళూరు, విశాఖపట్నం- చెన్నై కారిడార్లలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను కూడా ఈ సదస్సు ద్వారా వివిధ పారిశ్రామిక సంస్థలు, వ్యాపారవేత్తల ముందు ఉంచనున్నారు. ఇదిలా ఉంటే
విమానం దారి మళ్లిందంటూ: సీఎం జగన్ అధికారిక విదేశీ పర్యటన గుట్టుగా సాగుతోందని, ప్రభుత్వ యంత్రాంగం చెప్పినట్లు కాకుండా మరోలా జరుగుతోందని, ముందస్తు షెడ్యూలులో మార్పులతో డీవియేషన్లతో విమాన ప్రయాణం సాగిందని ఆంధ్రజ్యోతి ఒక కథనం రాసింది. ఏపీ నుంచి దావోస్ వెళ్లే బృందంలో సీఎం జగన్ సతీమణి భారతి రెడ్డి కూడా ఉన్నారని తొలుత వెల్లడికాలేదని, అయితే శుక్రవారం స్పెషల్ ఫ్లైట్లో ఎక్కిన తర్వాతే సీఎం సతీసమేతంగా వెళుతున్నట్లు అర్థమైందని, ఆ విమానం కూడా అనూహ్యంగా దారి మళ్లిందని కథనంలో రాశారు.
లండన్లో ల్యాండింగ్? : శుక్రవారం సాయంత్రానికి జగన్ స్విట్జర్లాండ్లోని దావోస్ చేరుకుంటారని అధికారిక సమాచారం ఇచ్చినా, ఆ విమానం రాత్రి 10.30 గంటల సమయంలో లండన్లో ల్యాండ్ అయ్యిందని కథనంలో రాశారు. భారత్ నుంచి దావోస్ వెళ్లేందుకు లండన్ దాకా వెళ్లాల్సిన అవసరమే లేకున్నా, లండన్ కంటే చాలా ముందే దావోస్ ఉన్నా, సీఎం ప్రయాణించే విమానం లండన్లో దిగిందని, దావోస్ బయలుదేరిన విమానం లండన్ లో ఎందుకు ల్యాండైందో తెలియడంలేదని ఆంధ్రజ్యోతి కథనంలో రాశారు. శుక్రవారం సీఎం వెళ్లిన ప్రత్యేక విమానంలో జగన్, ఆయన సతీమణితోపాటు ఏవియేషన్ సలహాదారు భరత్ రెడ్డి మాత్రమే వెళ్లినట్లు పేర్కొన్నారు. సీఎం జగన్ ను వ్యక్తిగతంగా, వైసీపీని ప్రభుత్వపరంగా డీఫేమ్ చేయడానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్, టీవీ 5, ఆంధ్రజ్యోతిలు దుష్టచతుష్టయంలా వ్యవహరిస్తున్నాయని సీఎం స్వయంగా ఆరోపించిన సంగతి తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, Ys bharathi, Ys jagan