ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో వరద పరిస్థితులు (AP Floods), సహాయక చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత సమావేశంలో ఇచ్చిన ఆదేశాల అమలు పరిస్థితిని సీఎం అడిగి తెలుసుకున్నారు. అంశాల వారీగా నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల కలెక్టర్లతో చర్చించారు. నిత్యవసరాల పంపిణీ, వరదబాధిత కుటుంబాలకు అదనంగా రూ.2వేల పంపిణీ, సహాయ శిబిరాలు, విద్యుత్తు–తాగునీటి సరఫరా పునరుద్ధరణ, వైద్య–ఆరోగ్య శిబిరాలు, దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు పరిహారం, గల్లైంతన వ్యక్తుల ఆచూకీ, పశుదాణా పంపిణీ తదితర అంశాలపై ప్రధానంగా చర్చించారు. 95,949 వరద బాధిత కుటుంబాలకు నిత్యావసరాలు అందించే కార్యక్రమం శరవేగంగా చేశామని.., మొత్తం నాలుగు జిల్లాల్లో 19,832 మందికి మినహా అందరికీ నిత్యావసరాలు అందాయన్నారు. వరద బాధిత కుటుంబాలకు రూ.2వేల చొప్పున అదనపు సహాయం దాదాపుగా అందించినట్లు తెలిపారు.
వరదల వల్ల దాదాపు 95 వేల కుటుంబాలు వరదలకు ప్రభావితం అయ్యాయి, ప్రభుత్వం ఇస్తున్న సహాయం పూర్తిగా వారికి అందాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. సహాయం అందించడంలో ఎక్కడా తప్పులు జరగడానికి వీల్లేదని స్పష్టం చేశారు. తాగునీటి విషయంలో... అధికారులు శరవేగంగా చర్యలు తీసుకోవాలని.., అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయినందున.. తాగునీటి కొరత రాకుండా చూడాలన్నారు. రానున్న రోజుల్లో కూడా ఇబ్బంది రాకుండా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సూచించారు. తాగునీరు, కరెంటుకు సంబంధించి ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకూడదని సీఎం అన్నారు. 104 కాల్ సెంటర్కు వచ్చిన వినతులపై వెంటనే రెస్పాండ్ కావాలని ఆదేశించిన సీఎం.., శానిటేషన్మీద బాగా శ్రద్ధ పెట్టాలని స్పష్టం చేశారు. చనిపోయిన పశువులకు వెంటనే పరిహారం అందించాలని.. ఉన్న పశువులకు వ్యాక్సినేషన్ వేయాలన్నారు.
వారికి కొత్త ఇళ్లు
వరదల వల్ల పూర్తిగా దెబ్బతిన్న, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు సంబంధించి పరిహారాన్ని వేగంగా అందించాలని సీఎం జగన్ ఆదేశించారు. వచ్చే 3-4 రోజుల్లో ఇళ్లకు సంబంధించి పరిహారం వారికి అందాలన్నారు. పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు సంబంధించి కొత్త ఇళ్లను మంజూరు చేయాలన్నారు. వారికి రూ.95వేల చొప్పున పరిహారంతోపాటు కొత్త ఇంటికి రూ.1.8లక్షలు మంజూరుచేయాలని సూచించారు.
పంట నష్టపరిహారానికి సంబంధించి కూడా ఎన్యుమరేషన్ చురుగ్గా సాగాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. రోడ్ల పునరుద్ధరణకు సంబంధించి కలెక్టర్లు వెంటనే నివేదికలు ఇవ్వాలని సూచించారు. నెలరోజుల్లోగా శాశ్వత పనులు మంజూరు కావాలని సూచించారు. చెరువులు, గట్లకు సంబంధించి పునరుద్ధరణ పనులు వెంటనే మొదలుకావాలని జగన్ అన్నారు. రాష్ట్రంలో అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులపై నివేదికలు ఇవ్వాలన్న సీఎం జగన్.., 13 జిల్లాల్లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టుల భద్రతపై దృష్టిపెట్టాలని ఆదేశించారు. డ్యాంల భద్రతపై గత ప్రభుత్వాల్లో ఇచ్చిన నివేదికలు బయటకు తీయాలన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు లాంటి ఘటనలు భవిష్యత్తులో జరక్కూడదని సీఎం స్పష్టం చేశారు.
26 నుంచి వర్షాలు-అప్రమత్తత
ఈనెల 26 నుంచి వర్షాలు ఉన్నాయన్న సమాచారం నేపథ్యంలో జాగ్రత్తలు కూడా తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. 27, 28, 29 తేదీల్లో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారని.. నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.