కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వివాదాస్పదమవుతున్న జగనన్న శాశ్వత గృహ హక్కు పథకం (Jagananna Saswatha Gruha hakku Scheme) అంశంపై సీఎం వైఎస్ జగన్ (AP CM YS Jagan) దృష్టి సారించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఓటీఎస్ పథకం, గృహనిర్మాణంపై ఆయన మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటీఎస్ పథకం పురోగతిపై అధికారులు సీఎంకు వివరాలు అందించారు. 22-ఎ తొలగింపునకు ఇప్పటికే ఉత్తర్వులు జారీచేశామన్న అధికారులు.., ఓటీఎస్ వినియోగించుకున్నవారికి స్టాంపు డ్యూటీ, ట్రాన్స్ ఫర్ డ్యూటీ, యూజర్ ఫీజులను రద్దుచేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు. . గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ పనులు చేస్తున్నామని... ఓటీఎస్ వినియోగించుకున్నవారికి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, ఫీల్డ్స్కెచ్, లోన్ క్లియరెన్స్ సర్టిఫికెట్లు ఇస్తున్నామన్న అధికారులు సీఎంకు తెలిపారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. ఓటీఎస్పై అవగాహన కల్పించాలన్న సీఎం.. ప్రజలకు ఏ రకంగా మంచి జరుగుతుందో చెబుతూ, వారికి వివరించాలని సూచించారు. ఓటీఎస్ అనేది పూర్తి స్వచ్ఛందమని.. క్లియర్ టైటిల్తో రిజిస్ట్రేషన్ జరుగుతుందని తెలిపారు. పేదలపై రూ.10వేల కోట్ల రూపాయల భారాన్ని పేదలపై తొలగిస్తున్నామని.. వారి రుణాలు మాఫీచేస్తున్నాం, రిజిస్ట్రేషన్ కూడా ఉచితంగా చేస్తున్నామని పేర్కొన్నారు. దీని ద్వారా వారికి ఇంటిపై సంపూర్ణ హక్కులు వస్తాయి, వీటిపై ప్రజలకు అవగాహన తీసుకురావాలన్నారు.
ఈ పథకం అమలు కాకుండా చాలామంది చాలారకాలుగా సమస్యలు సృష్టించే ప్రయత్నంచేస్తున్నారన్న సీఎం.. గతంలో వడ్డీ మాఫీ చేయాలన్న ప్రతిపాదలనూ గత ప్రభుత్వం పరిశీలించలేదని విమర్శించారు. సుమారు 43వేలమంది గత ప్రభుత్వ హయాంలో అసలు, వడ్డీకూడా కట్టారని.. ఇవాళ మాట్లాడుతున్నవారు... అప్పుడు ఎందుకు కట్టించున్నారు? అని జగన్ ప్రశ్నించారు. గతంలో అసలు, వడ్డీ కడితే బి–ఫారం పట్టా మాత్రమే ఇచ్చేవారని.. ఇప్పుడు ఓటీఎస్ పథకంద్వారా అన్నిరకాలుగా సంపూర్ణహక్కులు ఇస్తున్నామన్నారు జగన్. ఈ పథకం కింద లబ్ధిదారులు తమ అవసరాలకు ఇంటిని తనఖా పెట్టుకోవచ్చు, అమ్ముకునే హక్కుకూడా ఉంటుందని పేర్కొన్నారు. పేదలకు మంచి అవకాశాన్ని కల్పిస్తున్నామన్న సీఎం.. ఆ అవకాశాలను వాడుకోవాలా? లేదా? అన్నది వారి ఇష్టమని స్పష్టం చేశారు.
డిసెంబర్ 21 నుంచే ఓటీఎస్ పథకం కింద రిజిస్ట్రేషన్ పత్రాలు ఇవ్వడం ప్రారంభమవుతుందని.. గత ప్రభుత్వ హయాంలో రుణాలు చెల్లించిన 43 వేల మందికి కూడా రిజిస్ట్రేషన్ చేసి వారికీ సంపూర్ణ హక్కులు కల్పిస్తామని జగన్ తెలిపారు. భవిష్యత్తులో కూడా గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ పనులు జరుగుతాయన్నారాయన.
గృహనిర్మాణంపై సమీక్ష
ఇక అందరికీ ఇళ్లు కింద రాష్ట్రంలో గృహనిర్మాణంపై సీఎంకు అధికారులు వివరాలందించారు. గృహనిర్మాణంపై ఉన్న అడ్డంకులు తొలగిపోయాయని.. కోర్టు కేసులు పరిష్కారం అయ్యాయని సీఎం జగన్ గుర్తుచేశారు. వర్షాలు కూడా ఆగిపోయినందున ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్నారు. గృహ నిర్మాణంలో నాణ్యత బాగుండాలి, దీనిపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్న సీఎం.., సొంతంగా ఇళ్లు కట్టుకునేవారికి నిర్మాణంలో మంచి సలహాలు ఇచ్చేలా చూడాలని సూచించారు.
ఇంటి నిర్మాణ ఖర్చులను తగ్గించేలా అన్ని రకాల విధానాలూ అవలంభించాలని సీఎం జగన్ అన్నారు. లేబర్ క్యాంపు, సిమెంటు గోదాములు వంటివి లే అవుట్లలో ఏర్పాటు చేసేలా ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Housing lands for poor