రాజధాని అమరావతి విషయంలో గందరగోళం కొనసాగుతున్న సమయంలోనే సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తోంది. ఏపీలో అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలనే ఆలోచనలో ఉన్న సీఎం జగన్... ఈ దిశగా త్వరలోనే ఓ కార్యాచరణను రూపొందిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రస్తుతం అమరావతిలో ఉన్న ఏపీ హైకోర్టును రాయలసీమ ప్రధాన నగరమైన కర్నూలులో ఏర్పాటు చేసే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్టు ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ అంశంపై ఢిల్లీ పర్యటనలో హోంమంత్రి, బీజేపీ చీఫ్ అమిత్ షాతో సీఎం జగన్ చర్చలు కూడా జరిపారని సమాచారం.
అమరావతిని కేవలం పరిపాలనాపరమైన రాజధానిగా ఉంచి... మిగతా కీలకమైన విభాగాలను ఇతర జిల్లాలకు తరలించాలనే యోచనలో సీఎం జగన్ ఉన్నారని కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఏపీలో హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేసి... హైకోర్టు బెంచ్ను విశాఖలో ఏర్పాటు చేసే యోచనలో సీఎం జగన్ ఉన్నారని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు కేంద్ర న్యాయశాఖ మంత్రితో సీఎం జగన్ చర్చలు జరిపే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల్లోచర్చ జరుగుతోంది. గతంలో ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా ఉన్న కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ ఉండటం కూడా సీఎం జగన్ ఈ రకమైన నిర్ణయం తీసుకోవడానికి ఓ కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amaravati, Ap cm ys jagan mohan reddy, AP High Court, Kurnool, Rayalaseema, Visakhapatnam