ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రజలకు పలు సంక్షేమ పథకాలు (AP Welfare Schemes) అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ మార్గాలపై దృష్టిపెట్టింది. ఈ మేరకు రాష్ట్రానికి ఆదాయాన్ని అర్జించే వివిధ శాఖలపై సీఎం జగన్ (AP CM YS Jagan) సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. అదనపు ఆదాయాలకోసం వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎస్ఓఆర్ ( రాష్ట్రాల సొంత ఆదాయం)ను పెంచుకోవడానికి ఆయా రాష్ట్రాల్లో ఎలాంటి పద్ధతులు, విధానాలు పాటిస్తున్నారో పరిశీలించాలన్నారు. తద్వారా రాష్ట్ర సొంత ఆదాయాలు పెరగడానికి తగిన ఆలోచనలు చేయాలన్నారు. వీటిని కార్యరూపంలోకి తీసుకురావడానికి తదేక దృష్టిపెట్టాలని సీఎం సూచించారు. ఈ అంశాలపై ఎప్పటికప్పుడు పురోగతిని సమీక్షించుకోవడానికి సంబంధిత శాఖలకు చెందిన అధికారులు క్రమం తప్పకుండా సమావేశం కావాలని ఆదేశించారు.
ప్రభుత్వానికి ఆదాయాన్ని తీసుకురావడంలో కలెక్టర్లు క్రియాశీలకంగా వ్యవహరించాని సీఎం జగన్ అన్నారు. పారదర్శక విధానాలను పాటిస్తూ ముందుకు సాగాలని.., రాబడులను పెంచుకునే క్రమంలో అధికారులు తమ విచక్షణాధికారాలను వాడేటప్పుడు కచ్చితమైన ఎస్ఓపీలను పాటించాలని స్పష్టం చేశారు. పెండింగ్లో ఉన్న వ్యాట్ కేసులను పరిష్కరించడంద్వారా బకాయిలను రాబట్టుకోవడంపై దృష్టిసారించాలని తెలిపారు.
ఇక గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వీలైనంత త్వరగా వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. 51 గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇప్పటికే అందుతున్న రిజిస్ట్రేషన్ సేవలను సమీక్షించి.. తగిన మార్పులు, చేర్పులు చేయాలన్న సీఎం.., సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వెలుగుచూసిన అవినీతి ఘటనలు, లోపాలు తిరిగి గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రవేశించకూడదని స్పష్టం చేశారు. ఆ మేరకు పటిష్టమైన ఎస్ఓపీలను అమలు చేయాలన్నారు.
ఉచితంగా రిజిస్ట్రేషన్లు వల్ల భారీగా పేదలకు భారీగా లబ్ధి చేకూరిందని అధికారులు సీఎంకు వివరించారు. ఓటీఎస్ పథకం ద్వారా, ఉచిత రిజిస్ట్రేషన్ల రూపేణా పేదలకు ఇప్పటివరకూ రూ.400.55 కోట్ల లబ్ధి చేకూరిందన్నారు. టిడ్కో ఇళ్ల ఉచిత రిజిస్ట్రేషన్ల రూపేణా పేదలకు మరో రూ.1230 కోట్ల మేర లబ్ధి చేకూరినట్లు సీఎంకు వివరించారు. గతంలో ఎన్నడూకూడా ఉచిత రిజిస్ట్రేషన్ల రూపంలో పేదలకు ఇంతటి ప్రయోజనం జరగలేదని అధికారులు అభిప్రాయపడ్డారు.
సమావేశానికి డిప్యూటీ సీఎం (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్, డిప్యూటీ సీఎం (ఎక్సైజ్) కె.నారాయణ స్వామి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Ap government