ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో భూవివాదాలు తావుండకూడదని సీఎం జగన్ (AP CM YS Jaan) స్పష్టం చేశారు. మంగళవారం భూముల రీసర్వే-జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష కార్యక్రమంలో సమీక్ష నిర్వహించిన సీఎం.. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భూముల సమగ్ర రీ సర్వే ముగిసిన తర్వాత కూడా ట్రైబ్యునళ్లు కొనసాగుతాయని.. భూ వివాదాల పరిష్కారానికి అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రతి మండలంలూ ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని.. ఇవి శాశ్వత ప్రాతిపదికన పనిచేసేలా ఉండాలని ఆదేశించారు. అలాగే భూముల సర్వే సమయంలో తలెత్తే వివాదాల పరిష్కారానికి సరైన వ్యవస్థ ఉండాలని చెప్పారు. వివాదాల పరిష్కరించేందుకు అత్యుత్తమ విధానం తీసుకురావాలన్నారు. శాశ్వత ప్రాతిపదికన ట్రైబ్యునల్స్ ఏర్పాటు చేయడం వల్ల న్యాయపరంగా దక్కే హక్కులను త్వరగా పొందే వీలుంటుందని.. వివాదాల కారణంగా తరాలు తరబడి హక్కులు పొందలేని పరిస్థితి రాకూడదని స్పష్టం చేశారు.
సర్వే సమయంలో ప్రభుత్వంతో వ్యక్తిగతంగా ఉన్న వివాదాలను అంశాల వారీగా గుర్తించి సర్వే నెంబర్ల లిస్టులో పొందుపర్చాలని సీఎం సూచించారు. దీని వల్ల భూమి కొనుగోలు చేసేవారికి న్యాయపరంగా క్లియర్ గా ఉందా లేదా అనేది తెలుస్తోందన్నారు. అదే సమయంలో వివాదాలను పరిష్కరించే ప్రక్రియ కూడా జరగాలన్నారు. వివాదాలను పరిష్కరించే సమయంలో క్వాలిటీతో కూడిన ప్రక్రియ ఉండాలని.. సర్వే సందర్భంగా వచ్చే అప్పీళ్లను థర్డ్ పార్టీ ద్వారా పర్యవేక్షణ జరపాలన్నారు. దీనివల్ల అసలైన హక్కుదారులకు ఎలాంటి నష్టం జరగదని.. తప్పులు చేసే సిబ్బందిపైనా చర్యలు తీసుకునే అకాశముంటుందన్నారు. అప్పీళ్లపై థర్డ్ పార్టీ పర్యవేక్షణ ఉండటం వల్ల ఎలాంటి అవినీతి, వివక్షకు తావులేకుండా ఉంటుందన్నారు సీఎం.
ఎవరైనా ఒక వ్యక్తి తమ భూమిలో సర్వేకావాలని దరఖాస్తు చేసుకుంటే.. కచ్చితంగా సర్వే చేయాలన్న సీఎం.., నిర్ణీత సమయంలోగా సర్వే చేయకుంటే.. సిబ్బందిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం ఎస్ఓపీ రూపొందించాలని చెప్పారు. ఇక సర్వేలో వినియోగిస్తున్న ఏరియల్ ఫ్లయింగ్, డ్రోన్ ఫ్లయింగ్ లక్ష్యాలను పెంచాలని సూచించారు. ప్రస్తుతం నెలకు వెయ్యి గ్రామాల చొప్పున సర్వే చేస్తున్నట్లు అధికారులు చెప్పగా.. దీనిని మరింత పెంచాలని.. పట్టణాలు, నగరాల్లో కూడా సర్వే ప్రక్రియ వేగవంతం కావాలన్నారు సీఎం జగన్.
వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి సమగ్ర సర్వేను పూర్తి చేస్తామని అధికారులు చెప్పగా.. ఈ ప్రక్రియ సమర్ధవంతంగా సాగడానికి ప్రముఖ లీగల్ సంస్థల భాగస్వామ్యం కూడా తీసుకోవాలన్నారు. సర్వే పూర్తయ్యే నాటికి గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సదుపాయం రావాలని.., రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో మంచి ఎస్ఓపీలు పాటించాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. నమూనా డాక్యుమెంట్ పత్రాలను పౌరులకు అందుబాటులో ఉంచాలని.., వాటి ఆధారంతో సులభంగా రిజిస్ట్రేషన్ జరిగేలా చూడాలని చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.