ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) గృహనిర్మాణశాఖపై సీఎం జగన్ (AP CM YS Jagan) సమీక్ష నిర్వరించారు. నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో అధికారులకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. గృహనిర్మాణ పనులు వేగవంతంగా ముందుకు సాగాలని.., నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత నివ్వాలని సీఎం స్పష్టం చేశారు. చేసిన పనులకు నిధులుకూడా సక్రమంగా విడుదల చేస్తున్నామన్న సీఎం.., బిల్లులు వేగంగా జమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. విశాఖలో ఇచ్చిన ఇళ్ల నిర్మాణపనులు కూడా వేగంగా జరగాలని సీఎం సూచించగా.. అక్కడ 1.24 లక్షల ఇళ్ల నిర్మాణ పనులకు అన్నిరకాలుగా సిద్ధంచేస్తున్నామని అధికారులు తెలిపారు. అక్టోబరు చివరినాటికి ఇళ్ల నిర్మాణం ప్రారంభమవుతుందని వివరించారు. వీటి నిర్మాణం వేగంగా సాగేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
ఆప్షన్ మూడు కింద ఎంపిక చేసుకున్న ఇళ్ల నిర్మాణాలూ కూడా వేగంగా సాగుతున్నాయని అధికారులు సీఎం జగన్ కు వివరించారు. ఇళ్ల నిర్మాణంతోపాటు... కాలనీల్లో సమాంతరంగా మౌలిక సదుపాయాల కల్పనా పనులపైన దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు. డ్రైనేజీ, నీళ్లు, కరెంటు వంటి మౌలిక సదుపాయాల కల్పన జరగాలన్నారు. కాలనీల్లో పనుల ప్రగతి సమీక్షించడానికి, సందేహాల నివృత్తికి వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యాన్ని అక్కడనుంచే ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు. ఇందుకోసం ప్రత్యేకించి ఒక పోన్ నంబర్ను కూడా అందుబాటులో ఉంచాలన్న జగన్ ఆదేశించారు.
ఇక టిడ్కో ఇళ్ల నిర్మాణంపైనా సీఎం జగన్ చర్చించారు. 15-20 రోజుల్లో మొత్తం 1.4 లక్షల ఇళ్లు సర్వం సిద్ధం అవుతున్నాయని అధికారులు తెలిపారు. పూర్తి మౌలిక సదుపాయాలతో లబ్ధిదారులకు ఇళ్లు అందించాలని.., రిజిస్ట్రేషన్ల ప్రక్రియనూ వేగవంతం చేయాలని సీఎం చెప్పారు. టిడ్కో ఇళ్ల నిర్వహణపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టాలన్న సీఎం.., వీటి నిర్వహణ బాగుండేలా మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
అలాగే 90 రోజుల్లో ఇంటిపట్టా కార్యక్రమాన్ని సీఎం సమీక్షించారు. వచ్చిన దరఖాస్తులను పరిష్కరించి 2 లక్షల 03 వేల 920 మందిని అర్హులుగా తేల్చినట్లు అధికారులు వివరించారు. వీరిలో ఇప్పటికే లక్షమందికి పట్టాలు అందించామన్న అధికారులు.., మిగతావారికీ అందించడానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. పట్టా ఇవ్వడమే కాకుండా.., లబ్ధిదారుని స్థలం ఎక్కడ ఉందో కూడా చూపించాలని సీఎం అన్నారు. ఈ సమావేశానికి ఎపీఎస్హెచ్సీఎల్ ఛైర్మన్ డి దొరబాబు, సీఎస్ సమీర్ శర్మ, గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్షి, ఇంధనశాఖ స్పెషల్ సీఎస్ కె విజయానంద్, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్, ఏపీఎస్హెచ్సీఎల్ ఎండీ ఎన్ భరత్ గుప్తా, సీసీఎల్ఎ కార్యదర్శి అహ్మద్ బాబు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Housing lands for poor