ఏసీబీ, దిశ, ఎస్ఈబీలు కార్యకలాపాల సహా సోషల్ మీడియా (Social Media) లో వేధింపులకు చెక్ పెట్టేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ (CM YS Jagan) అధికారులను ఆదేశించారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో హోం శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. అవినీతి చోటుచేసుకుంటున్న విభాగాలను క్లీన్ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. దిశ తరహాలో అవినీతిపై ఫిర్యాదులకు ఏసీబీకి యాప్ రూపొందించాలని.., నెలరోజుల్లోగా అందుబాటులోకి తీసుకురావాలన్నారు. నేర నిర్ధారణకు ఫోరెన్సిక్ విభాగం బలోపేతం చేయాలన్న సీఎం.., మండల స్థాయి వరకూ ఏసీబీ స్టేషన్లను విస్తరించాలన్నారు. ఇతర విభాగాల్లో అవినీతి ఫిర్యాదులపైనా ఏసీబీ పర్యవేక్షణ ఉండాలని సీఎం ఆదేశించారు. డ్రగ్స్ వ్యవహారాలకు రాష్ట్రంలో చోటు ఉండకూడదన్న సీఎం.. వాటి మూలాల్లోకి వెళ్లి కూకటి వేళ్లతో పెకలించేయాలని స్పష్టం చేశారు. అలాగే విద్యాసంస్థలపై ప్రత్యేక నిఘా అవసరమన్న జగన్.., చీకటి ప్రపంచంలో వ్యవహారాలను సమూలంగా నిర్మూలించాలని.. ప్రతినెలా ఈ అంశాల్లో ప్రగతిపై నివేదికలివ్వాలన్నారు. ఎస్ఈబీకి ప్రత్యేక కాల్ సెంటర్ నంబర్ ఏర్పాటు చేయాలన్నారు.
అవినీతి నిరోధానికి ఏసీబీలో 14400 నంబర్ పెట్టామనన్నఈ నంబర్ను మరింత విస్తృతంగా ప్రచారంలోకి తీసుకురావాలని.., ఏసీబీ విధులేంటి, ఎలా పనిచేస్తుందన్నది విస్తృతంగా తెలియాలన్నారు. ఆడియో, వీడియో రికార్డింగ్ సాక్ష్యాలున్నా వాటిని ఏసీబీ నెంబరుకు చేరవేసే ఏర్పాటు ఉండాలన్నారు.
ఏసీబీ యాప్ ద్వారా ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చని.., తమ వద్దనున్న ఆడియో, వీడియో సహా పత్రాలను నేరుగా అప్ లోడ్ చేయొచ్చని జగన్ తెలిపారు. అలాగే వీటిని నిర్ధారించడానికి అధునాతన ఫోరెన్సిక్ వ్యవస్థలు కూడా ఉండాలన్నారు. చట్టాలను కూడా పరిశీలించి, మార్పులు, చేర్పులు ఉంటే చేసి సమర్థవంతంగా అమలు చేయాలని జగన్ ఆదేశించారు. సీబీకి ఫిర్యాదు చేయాల్సిన నంబర్ను ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా బాగా కనిపించేలా హోర్డింగ్స్ పెట్టాలని.., యాప్ ద్వారా ఎలా ఫిర్యాదు చేయొచ్చు.. అన్నదానిపై తగిన సూచనలు కూడా ఈ హోర్డింగ్లో ఉండాలన్నారు.
ఇక మద్యం అక్రమ రవాణా, అక్రమ మద్యం తయారీని ఉక్కుపాదంతో అణిచివేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఎస్ఈబీకి నిర్దేశించిన కార్యకలాపాలు కూడా అత్యంత కీలకమన్న సీఎం.. ఎస్ఈబీకోసం కూడా ఒక కాల్సెంటర్ నంబర్ను పెట్టాలన్నారు. కాలేజీ స్ధాయి వరకు ఇన్ఫార్మర్ వ్యవస్ధను ఏర్పాటు చేసుకోవాలని.., ఏ సమాచారం వచ్చినా సరే... వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న మహిళా పోలీసుకు కూడా దిశ, ఎస్ఈబీ, ఏసీబీ ఈ మూడింటి కార్యకలాపాలపైనా అవగాహన కల్పించాలని సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో హోంమంత్రి తానేటి వనిత, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ కె వి రాజేంద్రనాథ్రెడ్డి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Ap government