ఏపీలో చేపట్టిన సాగు నీటి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయాలని సీఎంవైయస్ జగన్ ఆదేశించారు . పోలవరం, ఉత్తరాంధ్రతో పాటు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న ప్రాజెక్టుల పనుల పురోగతిని అధికారులు సమావేశంలో వివరించారు. ఆ క్రమంలో నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ, అవుకు సొరంగం–2, పూల సుబ్బయ్య వెలిగొండ–హెడ్ రెగ్యులేటర్ పనులు, వంశధార–నాగావళి లింక్, బీఆర్ఆర్ వంశధార ప్రాజెక్టు స్టేజ్–2 రెండో దశ, పోలవరం ప్రాజెక్టు పనుల్లో జాప్యం లేకుండా కొనసాగించాలని ఆయన నిర్దేశించారు. భారీ వర్షాలతో పొటెత్తుతున్న వరదనీటిని ఒడిసి పట్టాలని కోరారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిపై సీఎం జగన్ క్యాంప్ కార్యాలయంలో సమీక్షించారు.
ఈ సమీక్షా సమావేశంలో చిత్రావతి బాలెన్సింగ్ రిజర్వాయర్లో 10 టీఎంసీలు, గండికోట రిజర్వాయర్లో ఈ ఏడాది కచ్చితంగా కనీసం 23 టీఎంసీల నీరు నిల్వ చేయాలని సీఎం వైయస్ జగన్ ఆదేశించారు. ఆ మేరకు వెంటనే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలు ఇవ్వాలన్న ఆయన, గత ప్రభుత్వం రైతులకు ఎకరాకు కేవలం రూ.6.75 లక్షల పరిహారం ఇస్తే, ఇప్పుడు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇస్తున్నామని ఆయన వెల్లడించారు. అందువల్ల రైతులకు అవగాహన కల్పించాలని, వారికి నచ్చచెప్పాలని కోరారు. ఆ రెండు ప్రాజెక్టుల్లో నీరు నిండితే వారికే ప్రయోజనం కలుగుతుందన్న విషయంపై రైతులకు వివరించాలని అన్నారు.

పోలవరం పనులు
ఈ ఏడాది నవంబరు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ పనులు వేగంగా జరుగుతున్నాయన్న అధికారులు, వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలనుకున్న అవుకు–2వ సొరంగం పనులు కూడా కొనసాగుతున్నాయని తెలిపారు. అయితే మధ్యలో సీపేజీ వల్ల సొరంగంలో మట్టి చేరిందని వారు పేర్కొనడంతో, నిపుణుల కమిటీ సలహా ప్రకారం అవసరమైన పనులు చేపట్టి పనులు పూర్తి చేయాలని సీఎం వైయస్ జగన్ నిర్దేశించారు.
ప్రకాశం జిల్లాలోని పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటరీ పనులకు సంబంధించి, ఈ ప్రాజెక్టులో మొదటి సొరంగం పనులు ఇప్పటికే పూర్తి కాగా, రెండో సొరంగం పనులను వచ్చే ఏడాది ఆగస్టు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు వివరించారు. ఈ సీజన్లో నల్లమల అడవుల్లో కొండలపై నుంచి నీరు పడుతుండడంతో పనుల్లో జాప్యం జరుగుతోందని వారు తెలిపారు.

(ఫైల్ ఫోటో)
ప్రాధాన్యతా క్రమంలో ఉత్తరాంధ్రలో చేపట్టిన సాగు నీటి ప్రాజెక్టుల పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయని సమావేశంలో అధికారులు వెల్లడించారు. ఇక ఈ ఏడాది డిసెంబరు నాటికి వంశధార–నాగావళి అనుసంధానం పూర్తయ్యేలా పనులు వేగంగా జరుగుతున్నాయని సమీక్షలో అధికారులు వెల్లడించారు. మొత్తం 33.5 కి.మీ కు గానూ ఇంకా 8.5 కి.మీ పనులు పూర్తి కావాల్సి ఉంది. ఆ పనులన్నీ ఈ ఏడాది డిసెంబరు చివరి నాటికి పూర్తి చేస్తామని వారు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి రెండో దశ పనులు వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కాగా, వంశధార, జంఝావతి ప్రాజెక్టుకు సంబంధించి అంతర్రాష్ట్ర జల వివాదాల పరిష్కారానికి, ఒడిషా సీఎంతో సమావేశానికి లేఖ రాయగా, ఇంకా సమాధానం రావాల్సి ఉందని సమీక్షా సమావేశంలో జల వనరుల శాఖ ఉన్నతాధికారులు చెప్పారు.

సీఎం జగన్
పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్, కాలువలకు సంబంధించి 71 శాతం పనులు పూర్తయ్యాయని అధికారులు వెల్లడించారు. వచ్చే ఏడాది డిసెంబరు నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలన్న లక్ష్యంలో ఏ మార్పు లేదని, ఆ దిశలోనే పనులు కొనసాగుతున్నాయని వారు తెలిపారు. ప్రాజెక్టు గేట్ల ఫ్యాబ్రికేషన్ ఇప్పటికే పూర్తయిందన్న అధికారులు, వచ్చే ఏడాది ఏప్రిల్ చివరి నాటికి మొత్తం 48 గేట్ల బిగిస్తామని చెప్పారు. కొంత మంది కార్మికులకు కోవిడ్ రావడం వల్ల స్పిల్ వే కాంక్రీట్ పనుల్లో కాస్త జాప్యం జరిగిందని వారు వివరించారు. సమీక్షా సమావేశంలో మంత్రి అనిల్కుమార్ యాదవ్, నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్దాస్, ఇంజనీర్ ఇన్ చీఫ్ సి.నారాయణరెడ్డితో పాటు, ఆ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.