ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (AP Assembly-2022) ఖరారు కావడంతో క్యాబినెట్ సమావేశమైంది. అసెంబ్లీ బీఏసీ సమావేశం అనంతరం మంత్రి మండలి సమావేశం ప్రారంభమైంది. ముందుగా దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి (Mekapati Goutham Reddy) కి మంత్రులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్భర్ల నిర్మాణానికి పరిపాలనాపరమైన అనుమతులకు మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.1234 కోట్ల రూపాయిలతో మూడు ఫిషింగ్ హార్భర్ల నిర్మాణం చేపట్టనుంది. అలాగే రామాయపట్నం, భావనపాడు, మచిలీపట్నం పోర్టుల నిర్మాణానికి రూ.8741కోట్ల రుణ సమీకరణ ప్రభుత్వం గ్యారంటీకి కేబినెట్ ఆమోదం తెలిపింది.
బెంగుళూరు-కడప, విశాఖపట్నం-కడప మధ్య వారానికి మూడు విమానసర్వీసులు నడిపేలా ఇండిగో సంస్థతో ఒప్పందానికి మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సర్వీసులు మొదలైన తర్వాత ఏడాదికి రూ.15 కోట్ల మేర రాష్ట్ర ప్రభుత్వం ఇండిగో సంస్థకు చెల్లించనుంది. స్టేట్ వక్ఫ్ ట్రిబ్యునల్లో 8 రెగ్యులర్, 4 అవుట్ సోర్సింగ్ పోస్టులకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. కర్నూలుకు చెందిన ఇండియన్ డెఫ్ టెన్నిస్ కెప్టెన్, 2017 డెఫ్ ఒలింపిక్స్లో కాంస్య పతక విజేత షేక్ జాఫ్రిన్కు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలన్న నిర్ణయానికి ఆమోదం తెలిపింది. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లో గోదాముల నిర్మాణానికి స్టాంప్ డ్యూటీ మినహాయింపు బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక తూనికలు, కొలతలశాఖలో నిబంధనలు అమలు కోసం మెరుగైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
డిప్యూటీ కంట్రోలర్ పోస్టును జాయింట్ కంట్రోలర్ పోస్టుకు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు –2 కింద చెరువులకు నీళ్లు అందించడం కోసం బైపాస్ కాలువ నిర్మాణం.. రూ.214.85 కోట్ల ఖర్చు. ప్రతిపాదనలకు ఓకే చెప్పింది. అలాగే పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం పడతదిక గ్రామం వద్ద ఉప్పుటేరుపై 1.4 కిలోమీటర్ల మేర రెగ్యులేటర్– బ్రిడ్జి నిర్మాణానికి పరిపాలనా పరమైన అనుమతులకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం మల్లపర్రు వద్ద రెగ్యులేటర్-బ్రిడ్జి-లాకుల నిర్మాణానికి పరిపాలనా పరమైన అనుమతులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న డిగ్రీ కాలేజీలో 24 టీచింగ్ పోస్టులు, 10 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఆర్చరీ క్రీడాకారిణి, అర్జున అవార్డు గ్రహీత జ్యోతి సురేఖ వెన్నంకు డిప్యూటీ కలెక్టర్ నియామకానికి సంబంధించిన ప్రతిపాదనలకు ఓకే చెప్పింది. టీటీడీ ప్రత్యేక ఆహ్వానితులపై అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బిల్లు, ఆర్మ్డు రిజర్వ్ పోర్స్లో 17 ఆఫీసర్ లెవల్ ( 7 ఏఏస్పీ,10 డిఎస్పీ) కొత్త పోస్టులకు ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ శాసనసభలో ప్రవేశపెట్టనున్న బిల్లుకు, 165 మొబైల్ వెటర్నరీ క్లినిక్ల ఆపరేషన్ అండ్ మెయింటైనెన్స్ (ఓఅండ్ఎం) కోసం రూ.75.24 కోట్లు మంజూరుకు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా చింతలదేవి వద్ద నేషనల్ కామధేను బ్రీడింగ్ సెంటర్ (ఎన్కేబీసీ) ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP Assembly, AP cabinet