Somu on kanna: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) బీజేపీ (BJP) పార్టీని వీడుతూ.. కన్నా లక్ష్మీనారాయణ (Kanna Lakshimi Narayanha) పెద్ద తుఫానే లేపారు. రాష్ట్ర బీజేపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju) .. ఎంపీ జీవీఎల్ (GVL) ఇద్దరిపైనా తీవ్ర ఆరోపణలు చేశారు.. ఆ వ్యాఖ్యలపై వెంటనే జీవీఎల్ స్పందించారు. తాజాగా కన్నా వ్యాఖ్యలపై స్పందించారు సోము వీర్రాజు. బాపట్ల జిల్లా చీరాలలో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన.. కన్నా లక్ష్మీనారాయణ తనపై చాలా కాలం నుంచి ఆరోపణలు చేస్తున్నారని గుర్తుచేశారు. అయితే గతంలో తాను ఎప్పుడూ వీటిపై స్పందించలేదన్నారు. ఇప్పుడూ కూడా స్పందించాల్సిన అవసరం లేదన్నారు. తాను సాధారణ కార్యకర్తగా బీజేపీలో చేరానని.. అధిష్టానం నమ్మకం సాధించడంతోనే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి స్థాయికి చేరానని పేర్కొన్నారు.
ఎవరైనా తనపై విమర్శలు చేస్తే స్పందించాల్సిన అవసరం తనకు లేదన్నారు. ఎందుకంటే తానేంటో బీజేపీ అధిష్టానానికి తెలుసు అన్నారు. అలాగే జనసేనతో పొత్తుపై స్పందిస్తూ.. బీజేపీతోనే తాము పొత్తులో వున్నామని పవన్ కల్యాణ్ విజయవాడ పర్యటనలో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి 60 శాతం వరకు నిధులు కేంద్రమే కేటాయిస్తోందని.. ఆ నిధులను కూడా జగన్ ప్రభుత్వం తమవేనని చెప్పడంపై సోము వీర్రాజు మండిపడ్డారు.
ఇప్పుడు ఈ వివాదంపై మరో చర్చ కూడా జరుగుతోంది. ఏపీ బీజేపీలో చాలామందే నేతలు ఉన్నారు. సాధారణంగా పార్టీ రెండుగా చీలందని.. ఒక వర్గం టీడీపీ అనుకూల వర్గం అయితే.. మరో వర్గం వైసీపీ అనుకూల వర్గం అనే ప్రచారం ఉంది. అయితే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిపైనా..? ఎంపీపైనా కన్నా ఘాటు వ్యాఖ్యలు చేస్తే.. ఇతర నేతలు ఎవరూ స్పందించలేదు. దీంతో ఇలాంటి ఆరోపణలు చేసినా ఇతర నేతలు ఎందుకు స్పందించడం లేదనే అనుమానాలు పుట్టుకొస్తున్నాయి.
ఇదీ చదవండి : లోకేష్ డీఎన్ఏ చెక్ చేసుకోవాలి.. పాదయత్రపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
అంటే ఏపీ బీజేపీలో ఉన్న నేతలంతా సోము వీర్రాజు తీరుపై గుర్రుగానే ఉన్నారా.. ఒకవేళ అనుకూలంగా ఉంటే.. ఎందుకు ఎవరూ విమర్శలపై స్పందించడం లేదని కేడర్ లోనూ అనుమానాలు పెరుగుతున్నాయి. టీడీపీ అనుకూల వర్గానికి చెందిన నేతలు ఎవరూ మాట్లాడడం లేదంటే అర్థం చేసుకోవచ్చు.. వైసీపీకి అనుకూలంగా ఉన్నారనే ముద్ర ఉన్న నేతలు సైతం.. కన్నా పార్టీ వీడడంపైన కానీ.. సోము వీర్రాజుపై చేసిన విమర్శలపైన కానీ స్పందించడం లేదు. ఇదే సమయంలో జీవీఎల్ వ్యాఖ్యలు మరో కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చింది.. ఆ ఇద్దరి పేర్లు అంటూ జీవీఎల్ చేసిన వ్యాఖ్యలకు.. వారిద్దరూ కాదు.. మహానాభావులు అంటూ ట్విట్టర్ వేదికగానే కౌంటర్ ఇచ్చారు. దీంతో మరో వివాదం తెరపైకి వచ్చింది. పార్టీకి చెందిన కీలక నేతలు ఇలా ఎవరి దారి వారిది అనేలా ఉండడంతో... కేడర్ మరింత గందరగోళానికి గురవుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap bjp, AP News, Kanna Lakshmi Narayana, Somu veerraju