సాధారణంగా పోలీసులు ఎవరైనా నేరం చేస్తే ఆ నేరానికి సంబందించిన సెక్షన్లు, లేదా ఎదుటివారికి ఇబ్బంది కలిగిస్తే దానికి సంబంధించిన కేసులు నమోదు చేస్తారు. ఆంధ్రప్రదేశ్ లో పోలీసులు మాత్రం విద్యార్థులపై ఓ వింత కేసు నమోదు చేశారు. ధర్నా చేసిన వారిపై అత్యాచారం కేసు పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే.., తాడేపల్లిలోని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు వెళ్లిన విద్యార్థులపై తాడేపల్లి పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు. సీఎం ఇంటిని ముట్టడించడానికి వెళ్లిన ఐదుగురు విద్యార్థులపై అత్యాచారయత్నం కేసులు నమోదయ్యాయి. తాము అరెస్ట్ చేసిన విద్యార్థులను పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. వారిపై నమోదు చేసిన కేసుపై న్యాయమూర్తి అగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో విద్యార్థుల సమస్యలకు నిరసనగా తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగమైన తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ (టీఎన్ఎస్ఎఫ్) ఆధ్వర్యంలో సీఎం నివాసం ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్తగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఐతే పోలీసుల కళ్లుగప్పిన ఐదుగురు విద్యార్థి నేతలు సీఎం ఇంటికి అర కిలోమీటర్ దూరం వరకు వెళ్లగలిగారు. వారిని తెలుగు తల్లి విగ్రహం సమీపంలోనే పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆ ఐదుగురిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు శనివారం వారిని మంగళగిరి కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.
ఈ సందర్భంగా పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టు చూసిన న్యాయమూర్తి ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. రిమాండ్ రిపోర్టులో అత్యాచారయత్నం అనే పదం వాడటంపై జడ్జి మండిపడ్డారు. అత్యాచారయత్నం కేసు ఎలా అవుతుందంటూ నిలదీయడంతో ఉలిక్కిపడిన పోలీసులు.. పాత ఎఫ్ఐఆర్ కాపీలను కంప్యూటర్లో ఎడిట్ చేసే సమయంలో కొన్ని పదాలను మార్చకపోవడంతోనే ఈ సమస్య తలెత్తినట్టు భావిస్తున్నారు. వెంటనే తేరుకున్న పోలీసులు ఆ ఐదుగురు విద్యార్థులను తిరిగి తాడేపల్లి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. రిమాండ్ రిపోర్టులో మార్పులు చేసి దానికి సంబంధించిన సెక్షన్లను పేర్కొంటూ జడ్జికి సమర్పించినట్లు తెలుస్తోంది.
Published by:Purna Chandra
First published:January 24, 2021, 07:53 IST