(రఘు - కరెస్పాండెంట్ - న్యూస్18తెలుగు)
దేశవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యం కలిగిన పార్లమెంట్ నియోజకవర్గాల్లో నరసారావుపేట ఒకటి. ఇదివరకు ఇక్కడి నుంచీ పోటీ చేసిన కాసు బ్రహ్మానందరెడ్డి కేంద్ర హోం మంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా, అఖిలభారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈ నియోజకవర్గానికి ఎంతో గుర్తింపు తెచ్చారు. ఆ తర్వాత ఇక్కడి నుంచీ పోటీచేసిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కొణిజేటి రోశయ్య ముఖ్య మంత్రులుగా సేవలందించారు. ఇలాంటి నియోజవర్గం నుంచి 2019 ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు కూడా రాజకీయంగా, సామాజిక వర్గ పరంగా, ఆర్థికంగా అత్యంత బలవంతులు కావడంతో ఏపీ రాజకీయాల దృష్టి ఒక్కసారిగా నరసారావుపేట వైపు మళ్ళింది.
నరసారావుపేట పార్లమెంటు బరిలో నిలిచిన మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు రాజకీయంగా ఉద్దండులు కావడంతో నరసారావుపేట పార్లమెంటు ఎన్నికలపై ఆసక్తి రేపుతోంది. అధికార తెలుగు దేశం పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపీ రాయపాటి సాంబశివరావు మళ్లీ టికెట్ తెచ్చుకొని బరిలో నిలవగా, ప్రతిపక్ష వైసీపీ నుంచి విజ్ఞాన్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ లావు రత్తయ్య కొడుకు లావు శ్రీకృష్ణదేవరాయలు బరిలో దిగారు. కేంద్రంలో అధికార బీజేపీ నుంచీ ఓటమెరుగని ధీరుడిగా పేరుగాంచిన కన్నా లక్ష్మీ నారాయణ బరిలో ఉన్నారు. ఈ పరిణామాల్ని గమనిస్తే నరసారావుపేట పార్లమెంటు బరిలో త్రిముఖ పోరు తప్పేలా లేదు.
గుంటూరు జిల్లాలోని 3 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఒకటైన నరసారావుపేట పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు... వ్యక్తిగతంగా కూడా బలమైన వారు కావడంతో ఇక్కడి పోరు రసవత్తరంగా మారింది. టీడీపీ అభ్యర్థి రాయపాటి సాంబశివరావు దశాబ్దాల తరబడి తన రాజకీయ జీవితంలో తలపండిన నేతగా గుర్తింపు పొందారు.
ఆర్థికంగా, సామాజికంగా కూడా బలమైన నేత కావడం ఆయనకు కలిసొచ్చే అంశం. దీనికితోడు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 2014 ఎలక్షన్లో గెలవడం, నియోజకవర్గంలో ఆయన సొంత సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఎక్కువగా ఉండటం ఆయనకు ప్లస్ పాయింట్స్. పార్లమెంట్ పరిధిలో ఎక్కువ మందితో పరిచయాలు ఉండటం, ఆయనకు గెలుపు అవకాశాలను ఎక్కువ చేస్తున్నాయి. ఐతే పోలవరం కాంట్రాక్ట్ విషయంలో రాయపాటికి చెందిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ అవినీతి బాగోతం ఆయన రాజకీయ జీవితంపై మాయని మచ్చలా మారిందని చెప్పొచ్చు.
ప్రతిపక్ష వైసీపీ నుంచి బరిలో నిలిచిన లావు శ్రీకృష్ణదేవరాయలు... యువకుడు, విద్యావంతుడు కావడం, నియోజక వర్గంలో ప్రధాన సామాజిక వర్గాల్లో ఒకటైన కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడు కావడం ఆయనకు కలిసొచ్చే అంశాలు. రాష్ట్రవ్యాప్తంగా పేరున్న విజ్ఞాన్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ లావు రత్తయ్య కొడుకు కావడం ఆయన ప్రధాన బలం. లావు రత్తయ్యకు టీడీపీతో పాటూ ఆయన సొంత సామాజిక వర్గ నేతలతో వ్యక్తిగత పరిచయాలున్నాయి.
సార్వత్రిక ఎన్నికలకు ఎంతో ముందుగానే అభ్యర్థిత్వం ఖరారవ్వడంతో నియోజకవర్గం మొత్తం రెండుసార్లు చుట్టిరావడం శ్రీక్రిష్ణ దేవరాయలుకు కలిసొచ్చే అంశం.దానికి తోడు అధికార పార్టీపై వ్యతిరేకత, గతంలో గెలిచిన రాయపాటి... నియోజవర్గానికి అందుబాటులో ఉండక పోవడం, ప్రతిపక్ష వైసీపీకి అనుకూల పవనాలు, శ్రీకృష్ణదేవరాయలుకి ఉన్న ఆర్థిక, అంగబలం... ఆయన విజయావకాశాల్ని మెరుగుపరుస్తున్నాయి.
ఇక జాతీయ పార్టీ అయిన బీజేపీ తరపున కాపు సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బరిలో నిలవడంతో నరసారావుపేట పార్లమెంటు రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. కన్నా ప్రభావం రాష్ట్రంలో కాపు సామాజిక వర్గంపై ఎంతో కొంత ప్రభావం చూపిస్తుంది. కన్నా రాజకీయపరంగా, సామాజిక వర్గం పరంగా, ఆర్థికపరంగా అత్యంత బలవంతుడు కావడం ఆయనకు కలిసొచ్చే అంశం.
ఇక్కడ జనసేన ప్రభావం నామ మాత్రంగా ఉండడంతో కాపు సామాజిక వర్గం ఓట్లపై కన్నా ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఐతే విభజన హామీలను నెరవేర్చడంలో విఫలమైన బీజేపీ పట్ల ఆంధ్ర ప్రజల్లో ఉన్న ద్వేషం కన్నాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
కాంగ్రెస్, జనసేన పార్టీలు నరసారావుపేట నియోజకవర్గంలో పెద్దగా ప్రభావం చూపట్లేదు. అభ్యర్థులు కూడా బలమైన వారు కాదు. రాజకీయ చైతన్యం కలిగిన నరసారావుపేట ఓటర్లు... పార్లమెంట్ అభ్యర్థుల్లో ఎవరిని గెలిపిస్తారన్నది ప్రస్తుతానికి ఆసక్తికర సస్పెన్స్.
ఇవి కూడా చదవండి :
PUBG : ఇండియాలో పబ్జీ ఎర్రర్ ఫిక్సైంది... ఇక ఎంతసేపైనా ఆడుకోవచ్చు...
టీడీపీకి మరో ఎదురు దెబ్బ... వైసీపీలోకి మాజీ మంత్రి ?
తెలంగాణలో పోటీకి టీడీపీ దూరం... రాహుల్తో డీల్ కుదిరిందా ?
డబ్బు కోసమే వైఎస్ వివేకానందరెడ్డిని చంపారా... బీరువాలో రూ.1.20 కోట్లు ఏమయ్యాయి?