Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అప్పుడప్పుడూ కాక రేపుతున్నాయి. ఇదివరకు గుళ్లు, ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం, రథాలు తగలబెట్టిన అంశంపై పెద్ద దుమారమే రేగింది. ఆ తర్వాత సైలెంటైన బీజేపీ... మళ్లీ ఇప్పుడు వాయిస్ పెంచింది. రోజుకో ప్రకటనతో... వైసీపీ నేతలకు టెన్షన్ తెప్పిస్తోంది. అఫ్కోర్స్ వైసీపీ నేతలు కూడా కౌంటర్ ఇస్తున్నారనుకోండి. ఐతే... అధికారంలోకి వచ్చిన రెండేళ్లకే ఇలా ఎందుకు జరుగుతోంది... ఇప్పట్లో ఎన్నికలు లేవు కదా... అనే డౌట్ చాలా మందికి ఉంది. కొందరైతే... త్వరలోనే వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేయడానికి బీజేపీ వ్యూహాలు రచిస్తోందనీ... అందులో భాగంగానే ఇవన్నీ చేస్తోందని భావిస్తున్నారు. అసలు విషయం అది కాదనీ... మరొకటి ఉందనే ప్రచారం ఢిల్లీ వర్గాల నుంచి వస్తోంది.
అక్కడే తేడా కొట్టిందా?
జాతీయ పార్టీ అయిన బీజేపీ వ్యూహాలు బలంగా ఉంటాయి. ఏ పార్టీనైనా తమలో కలుపుకోవడం లేదా... మిత్రపక్షంగా చేసుకోవడం ఆ పార్టీ నైజం. అలా కలవని పార్టీలకు చుక్కలు చూపిస్తారనే భావన ప్రజల్లో ఉంది. బీహార్లో జేడీయూ (JDU) చాలా ఏళ్లపాటూ... బీజేపీకి శత్రువుగా ఉండేది. తర్వాత మిత్రపక్షం అయిపోయింది. ఈమధ్య కేంద్ర కేబినెట్లోనూ చేరిపోయింది. ఇక సౌత్పై ఫోకస్ పెట్టిన కమలదళం... వైసీపీని ఆకర్షించేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. కేబినెట్ పోస్టులు ఆఫర్ ఇచ్చినట్లు తెలిసింది. వైసీపీని తమతో కలుపుకోవడానికి బీజేపీ ఎంతగానో ప్రయత్నిస్తే... ఆ పార్టీ మాత్రం చివరిక్షణంలో... ఆఫర్ తిరస్కరించినట్లు తెలిసింది.
ఇది కూడా చదవండి: Horoscope 10-8-2021: రాశి ఫలాలు. ఆర్థిక ఫలాలు, సవాళ్లు
నిజానికి 2014, 2019 ఎన్నికలకు ముందే వైసీపీతో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ సిద్ధపడితే... ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... తిరస్కరించారని సమాచారం. తాజాగా జులై 7న జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా... మరోసారి వైసీపీ నేతలతో చర్చలు జరిపి... కేబినెట్ పోస్టుల ఆఫర్ ఇచ్చారని సమాచారం. "ఓ కేబినెట్ పోస్టు, ఓ స్వతంత్ర ఇన్ఛార్జి, ఓ సహాయ మంత్రి పదవి ఆఫర్ ఇచ్చారు. కానీ వైసీపీ 2 కేబినెట్ బెర్తులు కావాలని కోరింది. అందుకు బీజేపీ పెద్దలు సిద్ధంగా లేరు. అదే సమయంలో... వైఎస్ జగన్ కూడా... కేంద్రంతో కలిసే విషయంలో వెనక్కి వెళ్లారు. కనీసం కేబినెట్ పోస్టులు ఎవరెవరికి ఇవ్వాలో పేర్లు కూడా చెప్పలేదు." అని బీజేపీ వర్గాలు తెలిపారు.
బీజేపీ, వైసీపీ మధ్య ఇలాంటి డీల్ ఏదైనా కుదిరేలా చర్చలు జరిగాయా అని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిని... ఇండియన్ ఎక్స్ప్రెస్ అడిగితే... "కొన్ని చర్చలు జరిగాయి. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారే దీనిపై కామెంట్ చెయ్యాలి. ఆయనే ఏం జరిగిందో చెప్పాలి" అని అన్నట్లు తెలిసింది.
చివరకు వైఎస్ జగన్... బీజేపీతో కలవకూడదనీ... ఎప్పటిలాగే... కేంద్రంలో ఫ్రెండ్లీగా ఉంటూ... అంశాలవారీగా మద్దతివ్వడం మేలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. 2014 నుంచి వైసీపీ... బీజేపీకి దూరంగానే ఉంటోంది. అంశాల వారీగా మాత్రమే మద్దతిస్తోంది. తాజా పరిస్థితులను చూస్తే భవిష్యత్తులో ఆ పార్టీని కేంద్రంలో కలుపుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. 2024 లోక్సభ ఎన్నికల నాటికి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్... బీజేపీ వ్యతిరేక శక్తులను ఒక తాటిపైకి తెచ్చే అవకాశాలు ఉంటే... అదే సమయంలో వైసీపీని తమవైపు తిప్పుకోవడం ద్వారా బీజేపీ తన బలాన్ని పెంచుకోవాలని చూస్తోందని సమాచారం. ఇదే సమయంలో... వైసీపీని... బీజేపీ వ్యతిరేక కూటమిలోకి తేవడానికి ప్రశాంత్ కిషోర్ చేస్తున్న ప్రయత్నాలు బీజేపీకి ఇబ్బందిగా మారినట్లు టాక్. 2019 అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చేలా ప్రశాంత్ కిషోర్ టీమ్ పనిచేసింది. అందువల్ల బీజేపీకి వ్యతిరేకంగా ఆయన వైసీపీని తనవైపు తిప్పుకునే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు.
2019 ఎన్నికల్లో లోక్సభలో ఏపీకి 25 పార్లమెంటరీ స్థానాలు ఉండగా.. వాటిలో 22 వైసీపీ గెలుచుకుంది. అలాగే... ఏపీ అసెంబ్లీలో 175 స్థానాలకు... 151 వైసీపీ గెలుచుకుంది. నెక్ట్స్ 2024 ఎన్నికల్లో కూడా వైసీపీకి ప్రశాంత్ కిషోర్ టీమ్ పనిచేస్తుందనే టాక్ ఉంది. ఈమధ్య ఢిల్లీ వెళ్లొచ్చిన మమతా బెనర్జీ... తనకు వైసీపీ, బీజేడీతో సత్సంబంధాలు ఉన్నాయని చెప్పినట్లు సమాచారం. మరి బీజేపీతో వైసీపీ చేతులు కలుపుతుందా అన్న ప్రశ్నకు విజయ్ సాయి రెడ్డి "ఇది రాజకీయ నిర్ణయం. ఇది ముఖ్యమంత్రిగారే తీసుకుంటారు" అని చెప్పినట్లు తెలిసింది.
ఇది కూడా చదవండి: World Lion Day 2021: నేడు సింహాల దినోత్సవం... ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?
2024 ఎన్నికల నాటికి వైసీపీతో ముందస్తు ఒప్పందం చేసుకునేలా కమలనాథులు పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆ పార్టీకి కేంద్రంలో శివసేన, శిరోమణి అకాళీ దళ్ దూరమయ్యాయి. అందువల్ల దక్షిణం నుంచి ప్రాంతీయ పార్టీల మద్దతు ఉంటే మంచిదని ఢిల్లీ పాలక వర్గం భావిస్తున్నట్లు తెలిసింది.
కుదరని సమీకరణాలు:
"వైసీపీకి బీసీలు ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీల నుంచి సపోర్ట్ ఉంది. ఇప్పుడు మా పార్టీ బీజేపీతో కలిస్తే... ఈ సపోర్ట్ ఉండకపోవచ్చు" అని వైసీపీ ఎంపీ తెలిపారు. ఐతే ఏపీ సీఎంకి కొన్ని ఆప్షన్లు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే సంవత్సరం జరుగుతాయి. అలాగే రాష్ట్రపతి ఎన్నికలూ ముందున్నాయి. ఇవి రాజకీయ గాలి ఎటు వీస్తుందో బయటపెడతాయి. తదనుగుణంగా వైసీపీ భవిష్యత్ నిర్ణయాలు తీసుకునేందుకు వీలుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP News, AP Politics, Breaking news, Telugu news, Telugu varthalu