కొవిడ్ చికిత్స (Covid Treatment) లో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో పీఎస్ఏ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లను సీఎం జగన్ (AP CM YS Jagan) ప్రారంభించనున్నారు. థర్డ్ వేవ్ను ఎదుర్కోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రభుత్వం.., 104 ప్రభుత్వాసుపత్రుల్లో 133 ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయబోతోంది. వీటికి అదనంగా మరో 11 ప్లాంట్లను నిర్మిస్తోంది. సామాజిక ఆస్పత్రులనుంచి బోధనాసుపత్రుల వరకూ మెడికల్ ఆక్సిజన్ తయారీలో కీలక పురోగతి సాధించింది. కరోనా సెకండ్ వేవ్లో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరతను దృష్టిలో ఉంచుకున్న సీఎం జగన్.., మెడికల్ ఆక్సిజన్ విషయంలో స్వావలంబన సాధించే దిశగా పలు కీలక చర్యలను తీసుకున్నారు. యాభై పడకలు దాటిన ప్రభుత్వాసుపత్రుల్లో సొంతంగా మెడికల్ ఆక్సిజన్ తయారీ యూనిట్లను నెలకొల్పడంపై ప్రత్యేక దృష్టిపెట్టారు.
ఫలితంగా రాష్ట్రంలోని అన్నిజిల్లాల్లోని వివిధ ఆస్పత్రుల్లో 133 పీఎస్ఏ మెడికల్ ఆక్సిజన్ తయారీ ప్లాంట్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిని సోమవారం సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఒమైక్రాన్ ప్రభావంతో కేసులు వేగంగా విస్తరిస్తోందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్న నేపథ్యంలో ఈ ప్లాంట్లు కోవిడ్ మహమ్మారిన బారినపడ్డ వారికి చికిత్స అందించడంలో కీలక పాత్ర పోషించనున్నాయి. గడచిన రెండేళ్లుగా మెడికల్ ఆక్సిజన్ డిమాండ్ విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలకు శ్రీకారం చుట్టింది.
రాష్ట్రప్రభుత్వం ఆస్పత్రుల ఆవరణలోనే ఈ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. ప్రెజర్ స్వింగ్ అబ్జార్షన్ పద్ధతిలో తయారైన ఆక్సిజన్, పైపులైన్ల ద్వారా నేరుగా రోగికి చేరుతుంది. అలాగే సిలిండర్లను కూడా ఈ ఆక్సిజన్తో నింపవచ్చు. వివిధ సామర్థ్యాలతో ఈ పీఎస్ఏ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. 1000 ఎల్పీఎం ( లీటర్ పర్ మినిట్), 500 ఎల్పీఎం సామర్థ్యంతో వీటిని ఏర్పాటు చేశారు.
పరిస్థితిని బట్టి, ఆస్పత్రి సామర్థ్యాన్ని అనుసరించి ఒకటి కన్నా ఎక్కువ ప్లాంట్లు కూడా నెలకొల్పారు. శ్రీకాకుళంలో 12 చోట్ల, విజయనగరంలో 2 చోట్ల, విశాఖపట్నలలో 12 చోట్ల, తూర్పుగోదావరిలో 13 చోట్ల, పశ్చిమగోదావరిలో 7 చోట్ల, కృష్ణాలో 12 చోట్ల, గుంటూరులో 7 చోట్ల, ప్రకాశంలో 5 చోట్ల, నెల్లూరులో 7 చోట్ల, చిత్తూరులో 21 చోట్ల, కడపలో 8 చోట్ల, అనంతపురంలో 9 చోట్ల, కర్నూలులో 9 చోట్ల.. మొత్తంగా 124 ప్రాంతాల్లో 133 ప్లాంట్లను ఏర్పాటు చేశారు. అదనంగా మరో 11 ప్లాంట్ల పనులు జరుగుతున్నాయి. మొత్తంగా 144 ప్లాంట్లు రాష్ట్రంలో ఉన్నాయి. వీటిమొత్తం సామర్థ్యం దాదాపుగా 1.2 లక్షల ఎల్పీఎం పైమాటే. అంటే ఒక నిమిషలలో 1.2 లక్షల లీటర్లకు పైగా ఈప్లాంట్లనుంచి తయారు అవుతుంది.
అలాగే కోవిడ్ థర్డ్ వేవ్ను ఎదుర్కొనే చర్యల్లో భాగంగా 18,268 ఆక్సిజన్ పైపులైన్లను రూ.40.07 కోట్లతో ఏర్పాటు చేశారు. ఇప్పుడున్న పైపులైన్లను మరింత బలోపేతం చేయడానికి 6,151 ఆక్సిజన్ లైన్లు వేయడంతోపాటు మరో రూ.50 కోట్లు ఖర్చుచేశారు. లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ నిల్వకోసం 399 కిలో లీటర్ల సామర్థ్యంతో ట్యాంకర్లను 35 ఆస్పత్రుల్లో రూ.15 కోట్లతో ఏర్పాటు చేశారు. మరో 39 ఆస్పత్రుల్లో 390 కిలోలీటర్ల సామర్థ్యంతో రూ. 16.3 కోట్లు ఖర్చు చేసి ట్యాంకర్లను ఏర్పాటు చేశారు. దీంతోపాటు లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ నిల్వ, రవాణాకోసం 20 కిలో లీటర్ల సామర్థ్యం ఉన్న 25 క్రయోజనిక్ ఐఎస్ఓ ట్యాంకర్లను రూ. 15.25 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది.
20 వీఆర్ఎల్ ల్యాబ్స్ను రూ. 6.22 కోట్లతో ఏర్పాటుచేసి టెస్టింగ్ సామర్థ్యాన్ని గణనీయంగా రాష్ట్ర ప్రభుత్వం మెరుగుపరిచింది. మరో రూ.21.93 కోట్లతో కీలకమైన సివిల్వర్క్స్ను పూర్తిచేసింది. 26,746 డి టైప్ ఆక్సిజన్ సిలెండర్లను కొనుగోలు చేసింది. ఈసీఆర్పీ –2 కింద 64.05 కోట్లతో పీడియాట్రిక్ కేర్ ఆక్సిజన్ సపోర్ట్ఉన్న బెడ్స్ను 183 సీహెచ్సీల్లో ఏర్పాటు చేశారు. 230 కిలోలీటర్ల సామర్థ్యం ఉన్న ట్యాంకులను 23 ఆస్పత్రుల్లో రూ.8.05 కోట్లతో ఏర్పాటు చేయనున్నారు. వీటికోసం రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా రూ.426కోట్లను ఖర్చు చేసింది. వీటితో పాటు క్లినికల్ మేనేజ్ మెంట్ చర్యల్లో భాగంగా మెడికల్ పరికరాలు, కోవిడ్ కిట్లు, ల్యాబ్ ఎక్విప్మెంట్కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.297.36 కోట్లు ఖర్చు చేసింది.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Corona treatment, Oxygen