ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని గ్రామ, వార్డు సచివాలయ (Village, Ward Secretariates) ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లేర్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెండేళ్ల ప్రొబేషన్ పూర్తి చేసుకొని పరీక్షల్లో పాసైన వారందరికీ ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని కలెక్టర్లను ఆదేశించింది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై సీఎం జగన్ సంతకం చేశారు. ఒకటి రెండు రోజుల్లో దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశముంది. ఇకపై సచివాలయ ఉద్యోగులకు కొత్త పే స్కేల్ ప్రకారం జీతాలు రానున్నాయి. వీరందరికీ కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు పెరగనున్నాయి.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 15వేల పైగా ఉన్న గ్రామ సచివాలయాల్లో దాదాపు లక్షా 15వేల మందికి పైగా ఉద్యోగులను నియమించింది. 2019 అక్టోబర్ 2 నుంచి గ్రామ సచివాయ వ్యవస్థ అమల్లోకి వచ్చింది. ఉద్యోగాలకు ఎంపికన వారందరికీ రెండేళ్లపాటు ప్రొబేషన్ ఉంటుందని అప్పట్లోనే ప్రభుత్వం తెలిపింది. ఈ రెండేళ్లు నెలకు రూ.15వేల చొప్పున జీతాన్ని ఖరారు చేసింది. వీరిలో 2021 అక్టోబర్ 2 నాటికి 40వేల మంది, 2021 అక్టోబర్ 30నాటికి 30వేల మంది, 2021 నవంబర్ నెలాఖరుకు 50వేల మంది రెండేళ్ల ప్రొబేషన్ పీరియడ్ పూర్తయింది.
రెండేళ్ల తర్వా త పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి ప్రొబేషన్ ఖరారు చేసి శాశ్వత ఉద్యోగులుగా పరిగణిస్తామని తెలిపింది. అందుకు తగ్గట్లుగానే గత ఏడాది నవంబర్ లో పరీక్షలు నిర్వహించింది. ఐతే పరీక్షలు పూర్తైన వెంటనే ప్రొబేషన్ ఖరారు చేయాల్సి ఉండగా.. బడ్జెట్ కేటాయింపుల దృష్ట్యా ఆలస్యం చేసింది.
కొత్త బడ్జెట్ అమల్లోకి రావడంతో జూన్ నుంచి ఖరారు చేస్తామని అప్పట్లోనే ప్రకటిచింది. అందుకు తగ్గట్లుగానే డిపార్ట్ మెంటల్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారి వివరాలను సేకరించిన అధికారులు ప్రొబేషన్ ప్రక్రియపై ప్రతిపాదనలను సీఎంకు పంపగా ఆయన ఆమోదించారు. ఈ నెలాఖరులోగా ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. జూలై 1 నుంచి ఉద్యోగులంతా పే స్కేల్ లోకి వస్తారు.
కొత్త పీఆర్సీ ప్రకారం వారికి జీతాలు పెరుగుతాయి. జూలై నెలకు సంబంధించి ఆగస్టులో తీసుకునే జీతాలు పెరగనున్నాయి. ఒక్కొక్కరికి కనీసం రూ.20వే లుంచి రూ.30 వేల మధ్య జీతాలు వచ్చే అవకాశముందని ఉద్యోగులు అంచనా వేసుకుంటున్నారు. అలాగే వారికి పీఎఫ్, సీపీఎస్, హెల్త్ కార్డులు, కారుణ్య నియామకాలు ఇలా అదనపు సౌకర్యాలు కూడా కల్పించాల్సి ఉంటుంది. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉందని చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.