ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో భూముల రీ సర్వే ప్రక్రియ వేగంగా సాగుతోంది. అత్యాధునిక సాంకేతిక ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీసర్వే ప్రాజెక్టు మంచి ఫలితాలను ఇస్తోంది. రీసర్వే ప్రక్రియకు తోడ్పడే విధంగా ఆంధ్ర ఏరీసో సర్వే శిక్షణా సంస్థ వివిధ అంశాలపై మూడెంచల శిక్షణను అందిస్తోంది. సాంప్రదాయక సర్వే అంశాలపై ౩౦ రోజులు, ఆధునిక సాంకేతిక విధానాలపై మరో ౩౦ రోజులు, క్షేత్ర స్థాయిలో ప్రత్యక్ష సర్వే అంశాలపై ఇంకో నెలరోజులు ఇలా మూడు నెలల పాటు పూర్తి స్ధాయి శిక్షణలను అందించి రీసర్వే ప్రాజెక్టుకు అవసరమైన మానవ వనరులను సిద్దం చేస్తున్నారు. దశల వారిగా భూసర్వే జరుగుతున్న నేపధ్యంలో శిక్షణలను సైతం అదే క్రమంలో చేపడుతున్నారు.
రీ సర్వే కోసం ప్రభుత్వం అందుబాటులో ఉన్న అత్యుత్తమ సాంకేతికతతో పాటు డ్రోనులు, కార్స్ నెట్ వర్క్ ఉపయోగిస్తుంది. ఈ క్రమంలో సీఎం జగన్ (AP CM YS Jagan) ఆదేశాలమేరకు ప్రతీ రెవిన్యూ గ్రామానికి ఒకరు వంతున 10,185 మంది గ్రామ సర్వేయర్లను నియమించారు. కేవలం సర్వే శాఖకు సంబంధించిన సిబ్బందికే కాక, రెవిన్యూ శాఖలో అసిస్టెంట్ కలెక్టర్ స్థాయినుండి గ్రామ రెవిన్యూ అధికారి స్థాయి వరకు వివిధ స్దాయిలలో శిక్షణా చేపడుతున్నారు. పురపాలక, నగర పాలక సంస్ధలలో సైతం ఆస్తుల సర్వే కొరకు వార్డ్ ప్లానింగ్ కార్యదర్శులకు శిక్షణ ఇచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది.
భారత సర్వే సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం ఫలితంగా వారి హైదరాబాద్ కేంద్రంలో జాతీయ స్ధాయి శిక్షణలు అందించటం ప్రత్యేకత కాగా, శిక్షణ పొందిన అభ్యర్దుల ప్రతిభను అంచనా వేస్తూ వారికి పరీక్షలు సైతం నిర్వహిస్తున్నారు. వీరందరికీ శిక్షణ అందించే క్రమంలో ఇటిఎస్, డిజిపిఎస్, జిఎన్ఎస్ ఎస్ నెట్ వర్క్ రోవర్స్, కార్స్, డ్రోన్స్ సాంకేతికత అంశాలపై సుశిక్షితులుగా తీర్చిదిద్దుతున్నారు. మరోవైపు ఆటో క్యాడ్, ఎఆర్సి జిఐఎస్, క్యూజిఐఎస్ లలో సైతం నూతన సిబ్బందికి శిక్షణ అందిస్తున్నారు. ప్రతి కాలండర్ సంవత్సరంలో సుమారు 1500 మందికి వివిధ సర్వే అంశాలలో అంద్రప్రదేశ్ సర్వే శిక్షణా సంస్థ ద్వారా శిక్షణ పొందుతున్నారు. నూతన రాష్ట్రం ఏర్పడిన తరువాత సర్వే శిక్షణా సంస్థ తాత్కాలికంగా తూర్పు గోదావరి జిల్లాలోని సామర్లకోట పట్టణంలో ఏర్పాటుకాగా, పూర్తి స్థాయిలో అత్యాధునిక హంగులతో శాశ్వత శిక్షణా సంస్థను ఏర్పాటు చేసేందుకు సీఎం జగన్ నిర్ణయించినట్లు సర్వే సెటిల్మెంట్, ల్యాండ్ రికార్డ్స్ కమీషనర్ సిద్దార్ధ జైన్ తెలిపారు.
చిత్తూరు జిల్లా తిరుపతి పట్టణంలో 41.19 ఎకరాల భూమిని కేటాయించగా, త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయన్నారు. భూముల రీసర్వే నేపధ్యంలో శిక్షణ అంశాలకు సంబంధించి పలు మార్పులకు సైతం సిద్దార్ధ జైన్ శ్రీకారం చుట్టారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి నిర్వహించే పరీక్షలలో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ ఓఎంఆర్ జవాబు పత్రాలు, జబ్లింగ్ సీటింగ్ విధానం అమలు చేస్తున్నారు.
రీసర్వేలో భాగముగా ఏర్పాటైన మొబైల్ మేజిస్ట్రేట్ వ్యవస్థ కోసం నల్సార్ విశ్వ విద్యాలయంలో డిప్యూటీ కలెక్టర్లు, తహసిల్దార్లు, డిప్యూటీ తహసిల్దార్లు, రెవిన్యూ ఇన్స్పెక్టర్ తదితర అధికారులకు న్యాయ విద్యకు సంబంధించి అంశాలలో ప్రత్యేక శిక్షణలు అందించే ఏర్పాటు చేశారు.
మరోవైపు ఎపిపిఎస్సి ద్వారా నియామకమైన డిప్యూటీ తహసిల్దార్ లకు ఆధునిక సర్వే పద్ధతులలో శిక్షణ ఇప్పించడంతో పాటు, డిపార్టుమెంటు పరిక్షలలో సిలబస్ ను ఎప్పటికప్పుడు పునర్ వ్యవస్ధీకరిస్తూ నూతన అంశాలను జత చేస్తున్నారు. డ్రోన్ పైలట్ సర్వేలో 94మంది శిక్షణ పూర్తి చేసుకోగా, అయా జిల్లాలలో డ్రోన్ పైలట్, కో పైలట్ రూపంలో వీరి సేవలు వినియోగిస్తున్నారు. మండల స్దాయిలో ఒక మాస్టర్ ట్రైనర్ అందు బాటులో ఉండేలా 679 మంది గ్రామ సర్వయర్లకు క్యూజిఐఎస్ సాప్ట్ వేర్ ను ఉపయోగించి ఎల్ పిఎం, గ్రామపటం తయారీలో శిక్షణ పూర్తిచేసారు. రీసర్వే ప్రాజెక్టులో ప్రధానమైన గ్రౌండ్ ట్రూతింగ్, గ్రౌండ్ వాలిడేషన్ లో ప్రతి మండలానికి ఒక ట్రైనర్ అందుబాటులో ఉండేలా 679 మంది గ్రామ సర్వయర్ల శిక్షణ పూర్తి చేసారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap government