ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని సామాజిక పింఛన్ దారులకు (AP Pensions) రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెన్షన్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. వృద్ధులకు నూతన సంవత్సర కానుకగా పింఛన్లను పెంచింది. జనవరి 1 నుంచి పెన్షన్ రూ.2,500కు పెంచుతున్నట్లు తెలిపింది. ప్రస్తుతం నెలకు రూ.2,250 ఇస్తుండగా.. వచ్చే నెల నుంచి రూ.250 అదనంగా చెల్లించనుంది. సీఎం జగన్ ఎన్నికల హామీలో భాగంగా వృద్ధులకు పెన్షన్లను రూ.3వేల వరకు పెంచుకుంటూ వెళ్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గతంలో ఇస్తున్న పెన్షన్లకు రూ.250 జత చేసి.. నెలకు రూ.2,250 ఇస్తున్నారు. ఇప్పుడు ఆ మొత్తానికి మరో రూ.250 జత చేసింది. మంగళవారం కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం జగన్ ఈ మేరకు కీలక ప్రకటన చేశారు.
వృద్ధాప్య పెన్షన్ల పెంపుతో పాటు పలు పథకాలకు సంబంధించిన కీలక నిర్ణయాలను సీఎం జగన్ తీసుకున్నారు. ముఖ్యంగా ఈనెల 21న జగనన్న శాశ్వత గృహహక్కు పథకాన్ని (Jagananna Shaswatha Gruaha Hakku Scheme) ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఓటీఎస్ కింద ఛార్జీలు చెల్లించిన లబ్ధిదారులకు ఇంటి రిజిస్ట్రేషన్ పత్రాలను అందజేయనున్నారు. అలాగే జనవరి 9న అమ్మఒడి (Jagananna Ammavodi) స్థానంలో ఈబీసీ నేస్తం పథకాన్ని (EBC Nestham) ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. 45-60 ఏళ్ల మధ్య వయసున్న అగ్రవర్ణ పేద మహిళలకు రూ.15వేల చొప్పున జమ చేయనున్నారు. వారికి మూడేళ్లలో రూ.45వేలు ఇవ్వనున్నారు. అలాగే రైతు భరోసా పథకాన్ని (YSR Rythu Bharosa) కూడా జనవరిలోనే ఇవ్వనున్నట్లు జగన్ తెలిపారు. దీనికి సంబంధించిన తేదీని త్వరలోనే నిర్ణయిస్తామన్నారు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Pension Scheme