AP Pensions Eligibility: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వైఎస్ఆర్ పెన్షన్ కానుక (YSR Pensions Scheme) లబ్ధిదారులకు ప్రభుత్వం (AP Government) షాకులమీద షాకులిస్తోంది. ఇప్పటికే పెన్షన్లను తనిఖీ చేస్తున్న ప్రభుత్వం.. రూల్స్ కి విరుద్ధంగా లబ్ధిదారులకు ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. మూడు నెలలుగా పెన్షన్లపై లోతుగా దృష్టిసారించిన ప్రభుత్వం.. అర్హుల్లో ఏమాత్రం తేడా ఉన్న ఆర్ధికసాయాన్ని కట్ చేస్తోంది. ఆగస్టులో ఒక రేషన్ కార్డుకు ఒకే పింఛన్ అంటూ ప్రకటించిన ప్రభుత్వం వారికి నోటీసులిచ్చింది. ఆ తర్వాత ఆధార్ కార్డులో వయసు తేడా ఉందంటూ మళ్లీ నోటీసులిచ్చింది. ఈసారి ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా లేరంటూ లబ్ధిదారులకు వాలంటీర్లు (Grama Volunteers) నేరుగా వెళ్లి తాఖీదులు ఇస్తున్నారు. ఈనెల 8,9వ తేదీల్లో నోటీసులందుకున్నవారి జాబితాను క్షేత్రస్థాయికి పంపి లబ్ధిదారుల నుంచి వారి అర్హతలకు సంబంధించిన పత్రాలను సేకరిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల పింఛన్లు, కళాకారులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, డయాలసిస్ రోగులకు పెన్షన్ల కింద నెలనెల ఆర్ధికసాయం అందిస్తోంది. ఈ పెన్షన్ల జాబితాలో ఉన్నవేలాది మంది లబ్ధిదారులకు నోటీసులందుతున్నాయి. దీనిపై అధికారులు ఈ నెల 8, 9న వాలంటీర్లను లబ్ధిదారుల వద్దకు పంపి.. వారి అర్హతలకు సంబంధించిన ధృవపత్రాలు సేకరించారు. 2019 డిసెంబర్ 13న ప్రభుత్వం జారీ చేసిన 174 ఉత్తర్వుల్లో పింఛను నిబంధనలకు అనుగుణంగా లేనట్లు గుర్తించి నోటీసులు జారీ చేస్తున్నారు.
పింఛను నెంబర్ నమోదు చేసి లబ్ధిదారుని వ్యక్తిగత/కుటుంబ వివరాలు పరిశీలిస్తున్నారు. దారిద్ర్యరేఖకు ఎగువగా ఉన్న కుటుంబం.. అర్హతల్లో పేర్కొన్న పరమితికంటే భూమి ఎక్కువగా ఉండి అన్నా.. అధిక విద్యుత్తు వినియోగం, బియ్యం కార్డు లేకపోవడాన్ని గుర్తించి నోటీసులు జారీ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వం నుంచి నోటీసులు అందుకున్న లబ్ధిదారుల ఏడు రోజుల్లో రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని.. సదరు వివరణ పత్రాన్ని మండల కార్యాలయానికి అందించాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. తాము పింఛన్ పొందేందుకు ఎందుకు అర్హులో వివరణలో పొందుపర్చాలని అధికారులు పేర్కొన్నారు. వారం రోజుల్లోగా అర్హతలు నిరూపించుకోకపోతే శాశ్వతంగా పెన్షన్ రద్దు చేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు.
ప్రభుత్వం అందిస్తున్న నోటీసులపై లబ్ధిదారులతో పాటు ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. నిన్నటి వరకు ఉన్న అర్హతలు ఈ రోజు ఏమైపోయాయని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు పెన్షన్లు పెంచుతామని మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిన సీఎం జగన్.. అధికారంలోకి వచ్చా పెన్షన్ల పెంపును పక్కనబెట్టి ఏకంగా పెన్షన్లనే ఎత్తేస్తున్నారని ఆరోపిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో వృద్ధులు, వికలాంగులకు పెన్షన్లు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ఏనెల పింఛన్ ఆ నెల తీసుకోవాలని.. తర్వాతి నెలలో రెండు నెలలుకు సంబంధించిన పింఛన్ ఇచ్చేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసిందిన సంగతి తెలిసిందే. తాజాగా అర్హులకు కూడా నోటీసులందించి పెన్షన్లు తొలగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై వస్తున్న విమర్శలను ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుందో వేచి చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.