ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఆర్ధిక పరిస్థితి, అప్పులపై జరుగుతున్న ప్రచారంపై ప్రభుత్వం స్పందించింది. ఏపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం జరుగుతోందని సీఎం జగన్ (AP CM YS Jagan) స్పెషల్ సెక్రటరీ దువ్వూరి కృష్ణ అన్నారు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థపై వాస్తవాలను వక్రీకరించి, ప్రజల్లో అపోహలను సృష్టించడానికి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అవగాహన లేకుండే చేసే ప్రచారం వల్ల కొన్ని రకాల సమస్యలు వస్తున్నాయన్నారు. రాష్ట్రం దివాలా తీస్తోందంటూ ప్రచారం చేసి పరపతి లేకుండా చేయాలని, అప్పులు పుట్టనివ్వకుండా చేసి తద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగనీయకుండా అడ్డు వేయాలన్నది దీనివెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని విమర్శించారు. అంతేకాదు రెవెన్యూ లోటు, గత ప్రభుత్వంలో అప్పులు, విద్యుత్ బకాయిలు, ఇతర అంశాలపై దువ్వూరి కృష్ణ లెక్కలన్నీ బయటపెట్టారు.
రెవిన్యూ లోటుపై వక్రీకరణలా..?
2017–18 మొదటి మూడు త్రైమాసికాలకు రెవిన్యూ లోటు 5,484%గా ఉందని.. రాష్ట్రం రెవిన్యూ లోటు, బడ్జెట్ అంచనాలకు మించి, మొదటి మూడు త్రైమాసికాల్లోనే, డిసెంబరు నాటికే 918%కి చేరుకుందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. 2016-17లో మొదటి మూడు త్రైమాసికాలకు 422 శాతం, 2017-18 మొదటి మూడు త్రైమాసికాలకు 5,484 శాతం, 2018-19 మొదటి మూడు త్రైమాసికాలను 359 శాతం ఉందన్నారు. అప్పట్లో కొవిడ్ పరిస్థితులు లేకపోయినా రెవెన్యూ లోటు పెరిగింది.. కానీ ఇప్పుడు కొవిడ్ రావడం, లాక్ డౌన్ పరిస్థితులు, ఆర్ధిక వ్యవస్థ స్తంభించడం వల్ల రెవెన్యూ లోటు పెరిగిందన్నారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం కూడా అతీతం కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెవిన్యూ లోటు బడ్జెట్ అంచనాలు, రూ.6,09,219కోట్లు కాగా, వాస్తవానికి రెవిన్యూ లోటు రూ.11,40,526 కోట్లుగా ఉందన్నారు.
కోవిడ్ లాంటి కష్టకాలం అప్పుడు ఉందా..?
ఇక కేంద్రం పన్నుల్లో రాష్ట్రానికి వచ్చే వాటాను గమనిస్తే 2018–19లో రూ.32,781 కోట్లుగా ఉంది. సాధారణంగా కోవిడ్లాంటి విపత్తు లేని సందర్భాల్లో ఏటా 10-15 శాతం పెరుగుతుంది. కానీ, 2019–20లో అది రూ. 28,012 కోట్లకు పడిపోయిందని.., 2020–21 నాటికి రూ.24,460 కోట్లకు పడిపోయిందన్నారు. 2022-23 నాటికి కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా అంచనా రూ.33,050 కోట్లు చూపిస్తున్నారు. అంటే 2018–19లో వచ్చిన పన్నుల వాటానే 2022–23లో కూడా చూపిస్తున్నారని.., దీని వల్ల నాలుగేళ్లపాటు వృద్ధిని కోల్పోయామని ఇక్కడ స్పష్టమవుతోందన్నారు.
బాబు హయాంలో అప్పులు 17%.. ఇప్పుడు 14శాతమే..
రాష్ట్రం విభజించే నాటికి రాష్ట్రానికి అప్పులు రూ. 97,213 కోట్లు కాగా.., పబ్లిక్ అకౌంట్ తో కలుపుకుని రూ.1,20,556 కోట్లుగా ఉందని.. టీడీపీ పాలన ఐదేళ్లలో రూ,2,68,225 కోట్లకు అప్పులు చేరాయని.. అంటే ఐదేళ్లలో సగటున ప్రతి ఏడాదికి 17శాతం మేర అప్పులు పెరిగాయన్నారు. అలాగే బకాయిలు రూ.39వేల కోట్లు ఉన్నాయన్నారు. అంతేకాదు 2019 ఎన్నికలకు ఒకరోజు ముందు కూడా రూ.5వేల కోట్ల అప్పులు తెచ్చారన్నారు.
గత ప్రభుత్వం చేసిన అప్పులు, కార్పొరేషన్ల రూపేణా ప్రభుత్వ గ్యారెంటీతో చేసిన అప్పులు, అలాగే విద్యుత్ రంగంలో చేసిన అప్పులు ఇవన్నీ కలుపుకుంటే.. రూ.4 నుంచి రూ.4.2లక్షల కోట్ల వరకూ ఉంటుందని దువ్వూరి కృష్ణ వెల్లడించారు. రీపేమెంట్ను పక్కనపెడితే సర్వీసు ఖర్చులే రూ.30వేల నుంచి రూ.32వేల కోట్ల వరకూ ఉంటాయన్నారు. చంద్రబాబు చేసిన అప్పుల భారాన్ని ఇప్పుడు జగన్ ప్రభుత్వం భరిస్తోందన్నారు. రూ.1880 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు, రూ.686 కోట్ల ఆరోగ్య శ్రీ బకాయిలు, రైతుల సున్నావడ్డీ రుణాలకు సంబంధించిన బకాయిలు రూ.1100 కోట్లు, ఉపాధిహామీకి సంబంధించిన బకాయిలు రూ.1500 కోట్లును ఈ ప్రభుత్వం చెల్లించినట్లు కృష్ణ వెల్లడించారు. సీఎం జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం రెండున్నరేళంలలో ఏకంగా రూ.1.27 లక్షల కోట్లను బీటీ పద్ధతిలో అవినీతి లేకుండా ప్రజలకే ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
ఎఫ్ఆర్బీఎం పరిమితులు పాటించడం లేదా..?
2014-15లో జీఎస్డీపీలో 3% పరిమితి ఉంటే.. 3.95%, 2015-16లో జీఎస్డీపీలో 3% పరిమితి ఉంటే.. .3.65%, 2016-17లో జీఎస్డీపీలో 3% పరిమితి ఉంటే.. .4.52%, 2017-18లో జీఎస్డీపీలో 3% పరిమితి ఉంటే.. 4.12%, 2018-19లో జీఎస్డీపీలో 3% పరిమితి ఉంటే.. .4.07% అప్పులు చేశారని దువ్వూరి కృష్ణ తెలిపారు. ఇప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ.. రూ.16,418 కోట్లు ఈ ప్రభుత్వం సమయంలో రుణపరిమితిని కత్తిరిస్తామని చెప్తోందని.. ఇన్ని సమస్యల మధ్య ఇదొక సమస్యగా తయారయ్యిందని కృష్ణ అన్నారు.
అదే ఈప్రభుత్వ హయాంలో చూస్తే
రాష్ట్ర ప్రభుత్వ అప్పులు మార్చి 31, 2019 నాటికి పబ్లిక్ అకౌంట్ తో కలుపుకుని రాష్ట్రం రూ.2,68,115 కోట్లు ఉండగా.. ఆర్థిక శాఖ ఇచ్చిన వివరాలు ప్రకారం మార్చి 31, 2022 నాటికి రాష్ట్రం అప్పు 4,08,172 కోట్లుగా ఉంటుందన్నారు. గడచిన మూడేళ్లలో అప్పులు పెరుగుదల 2019–22 మధ్య వృద్ధి (సీఏజీఆర్)14.88% మాత్రమేనని స్పష్టం చేశారు.
విద్యుత్ సంస్థల అప్పులు
విభజన సమయానికి రూ.33,587 కోట్లు అయితే, 2014–19 నాటి టీడీపీ ప్రభుత్వం పాలన పూర్తయ్యే నాటికి రూ.70,254 కోట్లు అయిపోయిందన్నారు. మిగులు విద్యుత్ ఉన్నా అప్పు పెరిగిందన్నారు. ఇవికాకుండా విద్యుత్ ఉత్పత్తిచేసిన సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలు రాష్ట్రం విభజన నాటికి రూ. 2,893 కోట్లు అయితే, ఐదేళ్ల టీడీపీ పాలన పూర్తయ్యే నాటికి రూ.21,540 కోట్లకు చేరుకున్నాయన్నారు. మొత్తం దాదాపు రూ.93వేలకోట్ల అప్పులకు చేరినట్లు వివరించారు.
ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్న అప్పులన్నీ ప్రజల జీవ ప్రమాణాలను మెరుగుపరచడానికేనని.. ప్రతి ఒక్క రూపాయిని విద్య, వైద్యం, వ్యవసాయం, ఇతర సంక్షేమ కార్యక్రమాలపై ఖర్చు చేస్తున్నామని దువ్వూరి కృష్ణ స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలు దృష్టలో పెట్టుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.