ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండో విడత అమ్మఒడి పథకాన్ని ప్రాంభించారు. నెల్లూరు నగరంలోని వేణుగోపాల స్వామి కాలేజీ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో రెండో విడత నిధుల జమ ప్రక్రియను ప్రారంభించారు. పేద పిల్లల చదువుకు అమ్మఒడి పథకం శ్రీరామ రక్షగా ఉందని ఆయన అన్నారు. పేద పిల్లల చదువును వాళ్ల మేనమామ చూసుకుంటాడన్న నమ్మకం కలిగించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 44లక్షల 48వేల మంది తల్లుల ఖాతాలో రూ.6,673 కోట్లు జమ చేస్తున్నామని.. దీని ద్వారా 84లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతోందన్నారు. గత ప్రభుత్వంలో సర్కారీ బడులను ఓ పద్ధతి ప్రకారం మూసివేసిందని.. అప్పట్లో కనీసం టాయిలెట్లు కూడా లేని పరిస్థితి నెలకొందన్నారు. వచ్చే మూడేళ్లలో రాష్ట్రంలో ప్రతి పిల్లవాడు బడికెళ్లేలా చర్యలు తీసుకుంటామని జగన్ స్పష్టం చేశారు.
నాడు-నేడు ద్వారా పాఠశాలల అభివృద్ధి
నాడు-నేడు కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 45వేల పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నామని సీఎం జగన్ తెలిపార. తొలి విడతలో 15వేల బడుల్లో అభివృద్ధి పనులు పూర్తి చేశామన్నారు. పాఠశాలల్లో టాయిలెట్లు నిర్మించి వాటి నిర్వహణ కోసం రూ.1000 రూపాయలు టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ కి బదిలీ చేస్తున్నామని.., స్కూళ్లలో టాయిలెట్ల నిర్వహణ సరిగా లేకపోతే గ్రామ సచివాలాయానికి లేదా నేరుగా సీఎంఓకే ఫోన్ చేయవచ్చని జగన్ తెలిపారు. అధికారంలోకి వచ్చిన 19 నెలల్లోనే విద్యపై రూ.24,600 కోట్లు ఖర్చు చేసినట్లు సీఎం జగన్ వెల్లడించారు.
నెల్లూరులో 'జగనన్న అమ్మ ఒడి' రెండో ఏడాది చెల్లింపులను ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ ప్రారంభించారు. బటన్ నొక్కి 44,48,865 మంది తల్లుల ఖాతాల్లోకి రూ.15వేలు చొప్పున రూ.6,673 కోట్లు జమచేశారు. ఈ ఏడాది 'జగనన్న అమ్మఒడి' ద్వారా 84 లక్షలమంది పిల్లలు లబ్దిపొందనున్నారు pic.twitter.com/OQ3lv1v3US
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) January 11, 2021
అమ్మఒడికి బదులు ల్యాప్ టాప్
ఇక అమ్మఒడి లబ్ధిదారులకు సీఎం జగన్ మరో బంపర్ ఆఫర్ ప్రకటించారు. వచ్చే ఏడాది నుంచి పథకంలో స్వల్ప మార్పులు చేస్తున్నట్లు తెలిపారు. 9వ తరగతి నుంచి 12వ తరగతి చదువుకునే.., విద్యార్థులు తల్లులు అమ్మఒడి కింద డబ్బులు వద్దంటే ఆ స్థానంలో వారికి ల్యాప్ టాప్ లు అందజేస్తామన్నారు. అమ్మఒడి పథకం ద్వారా ఇచ్చే సొమ్ము విద్యార్థులకు మరింత ఉపయోగపడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సీఎం జగన్ అన్నారు. ఇందుకోసం HP, DELL, Lenevo, Acer లాంటి ప్రముఖ సంస్థలతో చర్చలు జరిపామని.. రూ.25వేల నుంచి రూ.27వేలు విలువ చేసే కంప్యూటర్ ను రూ.18,500కే అందిస్తామన్నారు. రివర్స్ టెండరింగ్ ద్వారా ఈ ధర ఇంకా తగ్గుతుందన్నారు. ఈ ల్యాప్ ట్యాప్ లో 4GB ర్యామ్, 500GB స్టోరేజ్, ఇంటెల్ ప్రాసెసర్, Windows-10 ఆపరేటింగగ్ సిస్టమ్ తో పాటు ఇతర అధునాతన ఫీచర్లు ఉంటాయన్నారు. ప్రతి ల్యాప్ టాప్ పై మూడేళ్ల వారెంటీ ఉంటుందని.. ఏదైనా సమస్య వస్తే గ్రామ సచివాలయాల ద్వారా 7 రోజుల్లోనే రీప్లేస్ లేదా రిపేర్ చేసేలా చర్యలు తీసుకుంటామని సీఎం జగన్ వివరించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు ఆదిమూలపు సురేష్, మేకపాటి గౌతమ్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Anil kumar yadav, Ap cm ys jagan mohan reddy, Ap minister suresh, Ap welfare schemes, Mekapati Goutham Reddy