తమ జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తున్న గ్రామ, వార్డు వాలంటీర్లకు సీఎం జగన్ మోహన్ రెడ్డి లేఖ రాశారు. వాలంటీర్లు అంటే సేవ చేసే వారని, వారికి రోజుకు ఇన్ని గంటలు, వారానికి ఇన్ని రోజులు పనిచేయాలనే నిబంధనలేవీ లేవని, ఖాళీగా ఉన్నప్పుడు వారానికి మూడు రోజులు సేవ చేస్తున్నారని జగన్ స్పష్టం చేశారు.
తమకు కూడా వేతనాలు పెంచాలంటూ గ్రామ, వార్డు వాలంటీర్లు ఇటీవల రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. గొడ్డు చాకిరీ చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల రేషన్ డెలివరీ చేసే వాహనదారులు రెండు రోజులుల ఆందోళన చేయడంతో ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి వేతనాలు పెంచింది. ఈ క్రమంలో గ్రామ వాలంటీర్లు రోడ్డెక్కి ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వం తరఫు నుంచి అన్ని సంక్షేమ పథకాలను తాము ఇంటింటికీ చేరవేస్తూ జగన్ సర్కారుకు ఎంతో మంచి పేరు తీసుకురావడానికి అహర్నిశలు పనిచేస్తున్నామంటూ ప్రకటించారు. తమకు కూడా వేతనాలు పెంచాలని, అలాగే, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. గ్రామ, వార్డు వాలంటీర్లకు సుతిమెత్తను హెచ్చరించారు. వాలంటీర్లు అంటే స్వచ్ఛందంగా సేవ చేసే వారని, అందుకే వారికి గౌరవ వేతనం అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 2.6 లక్షల మంది గ్రామ వాలంటీర్లను నియమించినప్పుడు కానీ, గ్రామ వాలంటీర్ల సేవలు ప్రారంభించినప్పుడు కానీ తాను ఇది కేవలం స్వచ్ఛంద సేవ మాత్రమేననే విషయాన్ని స్పష్టం చేశానని ఆ లేఖలో జగన్ చెప్పారు.
జగన్ లేఖలో ముఖ్యమైన అంశాలు
‘వాలంటీర్ అంటే స్వచ్ఛందంగా సేవ అందించడం. ఇది ఉద్యోగం కాదు. వాలంటీర్లు గ్రామ, వార్డు సచివాలయాల్లో వారానికి మూడు రోజులు, అది కూడా వారికి వీలున్న సమయంలో మేం అందుబాటులో ఉన్నాం అని సూచిస్తూ మీరు అటెండెన్స్లో ఇస్తున్నారు. అలాగే, రోజుకు ఇన్ని గంటలు, వారానికి ఇన్ని రోజులు పనిచేయాలన్న నిబంధనలు కూడా ఏమీ లేవు. పని ఉన్నప్పుడు సేవాభావంతో వచ్చి పనిచేస్తున్నారు. నెలలో పని ఉన్న ఆ కొద్ది రోజులు మీ సేవలు అందిస్తున్నారు. పేదవారి ఆశీస్సులు, దీవెనలు అందుకుంటూ జీవిస్తున్న కార్యక్రమం ఇది. మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు, ప్రజలతో మీ ఇంటరాక్షన్ పెంచేందుకు ఒక మంచి వ్యవస్థను లంచాలు లేని వ్యవస్థను తయారు చేసేందుకు, మన వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చేందుకు మీరంతా సహాయ సహకారాలు అందించాలని కూడా నేను గతంలోనే స్పష్టం చేశాను. సేవాభావం, ప్రతిఫలాపేక్ష లేకుండా సేవ చేశారు కాబట్టే మిమ్మల్ని జనం ఆత్మీయులుగా చూసుకుంటున్నారు. మీరు వాలంటీర్లుగా కాకుండా జీతం తీసుకుని పనిచేస్తుంటే మీకు ఇంత గౌరవం ఇస్తారా? ఒక్కసారి ఆలోచించండి. వాలంటీర్ పేరుతో మీరు చేస్తున్నది స్వచ్ఛంద సేవ అవుతుందా?’ అని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆ లేఖలో ప్రశ్నించారు.
వాలంటీర్లు (ఫైల్ ఫొటో)
వాలంటీర్లను సమాజం గౌరవిస్తోందని అత్యుత్తమ సేవలు అందిస్తున్న వారికి నియోజకవర్గం వారీగా ఎంపిక చేసి మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్ సమక్షంలో శాలువా కప్పి అవార్డులు ఇస్తున్నారని, అలాంటి గౌరవం దక్కనివ్వకుండా చేసేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారన్న జగన్ ఆ ట్రాప్లో పడొద్దని వాలంటీర్లకు సూచించారు. ఇలాంటి ప్రలోభాలకు గురి కాకుండా రెచ్చగొట్టే వారికి దూరంగా ఉంటూ కర్తవ్యాన్ని నిర్వహించాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.