ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలలో దూసుకెళ్తున్నారు. మేనిఫెస్టోలోని 90శాతం హామీలను అమలు చేసి రికార్డులు సృష్టిస్తున్నారు. ఇటీవల ఏకంగా 30లక్షల మంది పేదలకు ఇళ్లస్థలాలు అందించి పక్కా ఇళ్లు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ABPన్యూస్-సీ ఓటర్ సంస్థలు జాతీయ స్థాయిలో నిర్వహించిన సర్వేలో బెస్ట్ సీఎంల లిస్ట్ లో జగన్ కు టాప్-3 ప్లేస్ దక్కింది. ‘దేశ్ కా మూడ్’ పేరుతో నిర్వహించిన ఈ సర్వేలో ఒడిశా ముఖ్యమంతమ్రి నవీన్ పట్నాయక్ టాప్ ప్లేస్ దక్కించుకోగా.., ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రెండోస్థానంలో నిలిచారు. ఆ తర్వాతి స్థానంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ నిలిచారు. అత్యుత్తమ పాలనాసామర్ధ్యం, అన్నివర్గాల ప్రజలకు అండగా కార్యక్రమాల అమలు వంటి అంశాలపై ఈ సర్వే నిర్వహించారు.
దేశవ్యాప్తంగా 543 లోక్సభ స్థానాల్లో మూడు నెలల పాటు 30 వేల మందికి ప్రజలను పరిపాలన, సంక్షేమం, వ్యక్తిత్వం, ప్రజలతో మెలిగే తీరు, ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో సంతృప్తి స్థాయితో పాటు పలు అంశాలపై అడిగిన వివిధ ప్రశ్నల ఆధారంగా ఈ సర్వే నిర్వహించారు. సీఎం జగన్ విషయంలో మెజారిటీ శాతం ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసినట్లు సర్వేలో తేలింది. ముఖ్యంగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు సరిగ్గా అమలవుతున్నట్లు ప్రజలు తేల్చారు. అలాగే సంక్షేమ పథకాల తమకు అందుతున్నట్లు ఎక్కువ మంది అభిప్రాయాపడ్డారు. పాలనలో కూడా జగన్ సమర్ధవంతంగా దూసుకెళ్తున్నట్లు ఓటర్లు చెప్పినట్లు సర్వేలో వెల్లడైంది. ఫస్ట్ ప్లేస్ లో నిలిచిన ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పాలనపై 60శతాం మంది సంతృప్తి వ్యక్తం చేయగా.., కేజ్రీవాల్ క్రేజ్ కూడా దాదాపు అదేస్థాయిలో ఉంది.
బీజేపీ ముఖ్యమంత్రులెక్కడ..?
ఇక జాబితాలో బీజేపీ పాలిత ముఖ్యమంత్రులకు టాప్-5లో కూడా చోటు లభించలేదు. వైఎస్ జగన్ తర్వాత నాలుగో స్థానంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నిలవగా., మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేకు 5వ స్థానం దక్కింది. ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ 6వ స్థానంలో ఉండగా., బెంగాల్ సీఎం మమతా బెనర్జీ 7వ స్థానం సాధించారు. బీజేపీ పాలిత ముఖ్యమంత్రులైన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ 8వ స్థానం, గోవా సీఎం ప్రమోద్ సావంత్ 9వ స్థానంలో, గుజరాజ్ సీఎం విజయ్ రూపాని 10వస్థానంలో నిలిచారు.
ప్రధానిగా మోదీకే పట్టం
ఇక ప్రధానిగా నరేంద్ర మోదీకే ఈ సర్వేలో మెజారిటీ ప్రజల మద్దతు లభించింది. కేంద్ర ప్రభుత్వ పనితీరుపై 66శాతం మంది సంతృప్తిగా ఉన్నట్లు వెల్లడైంది. 30శాతం మంది మాత్రం సంతృప్తిగా లేమని సమాధానం ఇచ్చారు. ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే 58 మంది ఎన్డీఏకు మద్దతు పలికారు. 28శాతం యూపిఏ పక్షాన నిలుస్తామన్నారు. ప్రధాన మంత్రిగా మోదీకి 55శాతం ఓట్లు రాగా, రాహుల్ గాందీ 11 శాతం ఓట్లకే పరిమితమయ్యారు. ఈ లిస్టులలో కేజ్రీవాల్ కు 5శాతం, మమతా బెనర్జీ, మాయావతి, ప్రియాంకా గాంధీలకు 1శాతం చొప్పున మద్దతు పలికారు. వేరే నేతను ప్రధానిగా ఎంచుకుంటామని 12శాతం మంది అభిప్రాయపడ్డారు.