ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు (Welfare Schemes) నేరుగా ప్రజల వద్దకు చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం (AP Government) వాలంటీర్ వ్యవస్థను (Volunteers) అందుబాటులోకి తీసుకొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు నాలుగు లక్షల మంది వాలంటీర్లు విధులు నిర్వర్తిస్తన్నారు. గురువారం స్పందన కార్యక్రమంపై సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. పనితీరు మెరుగుపరుచుకోని వాలంటీర్లను తొలగిస్తామని స్పష్టం చేశారు. కలెక్టర్లు వారానికి కనీసం రెండు గ్రామ, వార్డు సచివాలయాలు తనిఖీ చేయాలన్న జగన్.. జేసీలు కనీసం 4 గ్రామ, వార్డు సచివాలయాలు తనిఖీ చేయాలని ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లు, ఐటిడీఏ పీఓలు, సబ్కలెక్టర్లు కూడా కనీసం 4 గ్రామ, వార్డు సచివాలయాలు తనిఖీ చేయాలని స్పష్టం చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో తనిఖీలు బాగా మెరుగుపడ్డాయన్నారు.
తనిఖీలకు వెళ్లినప్పుడు రిజిస్టర్ పరిశీలన తప్పనిసరని సీఎం జగన్ స్పష్టం చేశారు. తనిఖీలకు వెళ్లినప్పుడు గతంలో వ్యక్తంచేసిన సమస్యలను పరిష్కరించామా? వాటిని సరిచేశామా.? లేదా.? చూడాలన్నారు. రిజిస్టర్లో పేర్కొన్న అంశాలను సచివాలయాల విభాగాధిపతికి పంపించాలన్నారు. అలాగే ఏదైనా పరిష్కరించాల్సిన కొత్త అంశాన్ని గుర్తిస్తే.. వాటిని కూడా రిజిస్టర్లో నమోదు చేయాలని సూచించారు.
గ్రామ, వార్డు సచివాలయాలను తనిఖీ చేసినప్పుడు గుర్తించిన అంశాలు, సమస్యలను పరిష్కరిస్తున్నారా? లేదా? వాటిపై దృష్టిపెడుతున్నారా? లేదా? అన్నదానిపై ప్రత్యేక దృష్టిపెట్టాలని జగన్ ఆదేశించారు. దీనికి సంబంధించిన ప్రోటోకాల్ను తయారుచేయాలని.., ఆ ప్రోటోకాల్ను పాటిస్తున్నారా.? లేదా.? కచ్చితంగా చూడాలన్నారు. దాదాపు 80 శాతం సచివాలయాల ఉద్యోగులు మంచి పనితీరు కనపరుస్తున్నారని తనిఖీల ద్వారా వెల్లడైందన్నారు. మిగిలిన 20 శాతం మందికి కూడా వారు పనితీరును మెరుగుపరిచేలా మనం వారికి తోడ్పాటును అందించాలన్నారు. పనితీరును చూపించేలా సిబ్బందికి తగిన చేయూతను, తోడ్పాటును అందించే బాధ్యత కలెక్టర్లు తీసుకోవాలన్నారు.
అలాంటి వాలంటీర్లపై వేటు..
వాలంటీర్ల సేవలపైనా కూడా దృష్టిపెట్టాలని.., వారు మెరుగైన సేవలు అందించేలా వారికి కౌన్సెలింగ్ చేయాలి అధికారులకు సీఎం జగన్ స్పష్టం చేశారు. వారు అప్గ్రేడ్ అయ్యేలా చూసి.. అందుకు చేయూతనిచ్చి.. తీర్చిదిద్దాలన్నారు. అప్పటికీ కూడా సేవలను అందించడంలో వారు ప్రమాణాలను అందుకునే రీతిలో లేకపోతే వారిని తొలగించి కొత్తవారిని నియమించాలని ఆదేశించారు. ఖాళీగా ఉన్న వాలంటీర్ పోస్టులను కూడా భర్తీచేయాలని సూచించారు.
వినతుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
సచివాలయాలకు అందుతున్న విజ్ఞాపనలు, వినతుల పరిష్కారంపైకూడా దృష్టిపెట్టాలని సీఎం జగన్ అదికారులకు సూచించారు. ముఖ్యంగా సచివాలయాల్లో తిరస్కరణకు గురైన లబ్దిదారులపై కూడా దృష్టి సారించాలన్నారు. గ్రీవెన్స్ రిడ్రెసల్ యంత్రాంగం సమర్థవంతంగా ఉండాలని.., సిటిజన్ అవుట్రీచ్ కార్యక్రమం అక్టోబరు 29, 30 తేదీల్లో చేపట్టాలన్నారు. సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు.. బృందాలుగా ఏర్పడి వారి పరిధిలోని ప్రతి కుటుంబాన్ని కలవాలన్నారు. గతంలో జరిగిన అవుట్రీచ్ కార్యక్రమంలో కొన్నిచోట్ల కేవలం వాలంటీర్లు మాత్రమే కలిసినట్టు నా దృష్టికి వచ్చిందని., అలా జరగడానికి వీలులేదని స్పష్టం చేశారు. కచ్చితంగా సచివాలయాల ఉద్యోగులు, వాలంటీర్ల బృందాలుగా ఏర్పడి... కుటుంబాలను కచ్చితంగా కలవాలని స్పష్టం చేశారు. ప్రతినెలలో తొలి బుధవారం గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో కచ్చితంగా సమావేశాలు జరగాలని జగన్ ఆదేశించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Gram volunteer, Village secretariat, Ward Volunteers