విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రయివేటుపరం చేయాలని తీసుకొచ్చిన ప్రతిపాదనపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం ఎమ్మెల్యే ఘంటా శ్రీనివాసరావు తన పదవికి కూడా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సమస్యపై పార్టీలన్నీ ఆయనొక్కడే రాజీనామా చేస్తే చాలదని.. అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమించాలని మాజీ ఎంపీ, కాంగ్రెస్ నాయకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తో పాటు తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పోరాడాలని ఆయన కోరారు. విబేధాలు పక్కనబెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటానికి సిద్ధపడాలని సూచించారు.
ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన ఆయన.. ఈ ఫ్యాక్టరీ వేలాది మంది కార్మికులకు ఉపాధినిస్తున్నదని, నష్టాల పేరిట దానిని అమ్మకానికి పెట్టడం దారుణమని అన్నారు. ఉక్కు కర్మాగారం మనుగడ సాధించాలంటే దాని పరిధిలో ఉన్న మైన్లను ఫ్యాక్టరీకి కేటాయించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం దీనిని ప్రయివేటుపరం చేస్తే దాని యజమానులు విశాఖ ఉక్కు కర్మగారానికి చెందిన భూములను రియల్ ఎస్టేట్ మాదిరిగా అమ్మకానికి పెడతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తద్వారా దీని మీద ప్రత్యక్షంగానే గాక పరోక్షంగా ఆధారపడి బతుకుతున్న వేలాది మంది కార్మికులు రోడ్డున పడతారని ఉండవల్లి అరుణ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.
టీడీపీ ఎమ్మెల్య ఘంటా శ్రీనివాసరావు రాజీనామా చేయడం శుభపరిణామమని.. అయితే అన్ని రాజకీయ పార్టీలు కలిసి విశాఖ ఉక్కును కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఏపీ సీఎం జగన్, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కొట్లాడాలని ఉండవల్లి కోరారు. వీరిరువురూ విబేధాలు పక్కనపెట్టి.. ఉక్కు కర్మాగారానికి వ్యతిరేకంగా సాగుతున్న పోరాటంలో పాల్గొనాలని సూచించారు. అన్ని పార్టీల నాయకులు కలిసి ప్రధాని మోడీని కలిసి.. ఈ చర్యలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP News, Chandrababu Naidu, TDP, Undavalli Arun Kumar, Visakhapatnam, Vizag, Vizag Steel Plant