ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ వనరులపై దృష్టి పెట్టింది. సంక్షేమ పథకాల అమలులో భాగంగా నిధుల సమీకరణ ఎలా చేయాలన్నదానిపై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి మెరుగైన ఆదాయం వచ్చే అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. నవరత్నాల్లోని ప్రతీ హమీని నెరవేర్చాల్సిన భాద్యత మనపై ఉందని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలలో టెండర్ల ద్వారా దక్కించుకున్న బొగ్గు గనుల కార్యకలాపాలపై మరింత ఫోకస్ పెట్టాలన్నా సీఎం.., ఎర్ర చందనం విక్రయం విషయంలో కేంద్రంతో సంప్రదించి త్వరితగతిన అనుమతులు తీసుకురావలని సూచించారు. అలాగే సిలికా శాండ్ విషయంలో ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.
నవరత్నాలులో భాగంగా అమలు చేస్తున్న అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, వైఎస్ఆర్ చేయూత, కాపునేస్తం, నేతన్న నేస్తం లాంటి పథకాలకు నిధులు సకాలంలో సమరకూర్చుకొని లబ్ధిదారులకు అందించాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి అన్నారు.
బొగ్గు గనుల నిర్వహణ
ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APMDC) టెండర్ల ద్వారా దక్కించుకున్న జార్ఘండ్ బ్రహ్మదిహ కోల్మైన్, మధ్యప్రదేశ్లోని సులియారీ, చత్తీస్ఘడ్లోని మదన్పూర్ సౌత్ బొగ్గు గనుల నిర్వహణ, మైనింగ్ కార్యకలాపాలను నిర్ణీత గడువులోగా ప్రారంభించేందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రానికి అధిక ఆదాయం వచ్చే మైనింగ్ కార్యకలాపాలపై మరింత ఫోకస్ పెట్టాలని సీఎం అన్నారు. దీంతోపాటు సిలికా శాండ్ కు సంబంధించి ఏపిఐఐసీతో సమన్వయం చేసుకుని వెంటనే కార్యకలాపాలను వేగవంతం చేయాలన్నారు.
ఎర్రచందనం విక్రయం
రాష్ట్రంలో ఉన్న ఎర్రచందనం నిల్వలను విక్రయించేందుకు కేంద్రం నుంచి అనుమతులు వెంటనే తీసుకొచ్చేలా ప్రయత్నించాలని అటవీశాఖ ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. ఎక్కడా అవినీతికి తావులేకుండా పారదర్శకంగా ఈ చర్యలు తీసుకోవాలన్నారు. దీనిపై యుద్దప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
రాష్ట్రానికి ఆదాయం వచ్చే అంశాలపై అధికారులు మరింత ఫోకస్తో పనిచేయాలని, వీటిపై నిరంతరం సమీక్షలు నిర్వహించి ఎప్పటికప్పుడు అంచనాలు సిద్దం చేసుకోవాలన్నారు. ప్రజలపై భారం వేయకుండా ఆదాయవనరులను పెంచుకునేందుకు అవసరమైన ప్రణాళికలతో అధికారులు సిద్దంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో సీఎస్ ఆదిత్యానాథ్ దాస్ తో పాటు ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Andhra pradesh news, Ap cm ys jagan mohan reddy, AP News, Ap welfare schemes, Navaratnalu, Tadepalli, Telugu news, Ys jagan mohan reddy