AP Budget: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఆర్థిక పరిస్థితిని రాష్ట్రంలో చిన్నపిల్లాడిని అడిగినా చెప్పేస్తాడు.. అప్పులు తప్ప ఆస్తులు లేవు.. ఆదాయం 10 రూపాయలు ఉంటే.. వ్యయం 100 రూపాయలు అవుతోంది.. పోనీ కేంద్రంతో సన్నిహిత్యంగానే ఉంటున్నాం.. వారి సాయం తీసుకుందామంటే.. కేంద్రం అస్సలు కనికరించడం లేదు. పోనీ అప్పులు తెచ్చుకుందామని ప్రయత్నిస్తే.. కొత్త అప్పులు పుట్టని పరిస్థితి.. కేవలం ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. అన్ని రాష్ట్రాలు అప్పులతోనే బండి లాగించేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది అన్నది బహిరంగ రహస్యం. ఇప్పటికే ఎక్కువ అప్పులు చేసి రికార్డుల్లోకి ఎక్కుతున్నాం అన్న భావనను ప్రభుత్వమే ప్రజలకు కలిగిస్తోందని అనుమానాలు లేకపోలేదు. ఎందుకంటే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (Buggana Rajendranath)తో సహా ఇతర మంత్రులు ఆదే చేస్తున్నారు. గత ప్రభుత్వం తీరుకారణంగానే అప్పులు చేయాల్సి వస్తోందని ఒప్పుకుంటున్నారు. దానికి మాత్రం ఒక లిమిట్ ఉండడం లేదు.. విపక్షంలో ఉన్నప్పుడు అప్పటి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ప్రభుత్వం అప్పులు చేస్తోంది.. తామొస్తే లెక్కలు సరి చేస్తామని చెప్పిన వైసీపీ నేతలు.. ఇప్పుడు రెట్టింపు అప్పులు చేస్తూ.. తాము చేసే అప్పులకు ఒక లెక్క ఉంది అని కొత్త అర్థం చెబుతున్నారు.
పాత అప్పుల గోల ఎలా ఉన్నా, ప్రస్తుత పరిస్థితి కేంద్రం అదనంగా ఒక్క పైసా రాల్చదు.. దీనికి తోడు అప్పులు మాత్రం అస్సలు పుట్టవు అని తేలిపోయింది. ప్రణాళిక వ్యయం కన్నా ప్రణాళికేతర వ్యయమే ఎక్కువగా ఉంటుందని అని లెక్కలు చెబుతున్నాయి. అస్సలు బడ్జెట్ అనుమతి అన్నది లేకుండా ఇటీవల కాలంలో దాదాపు లక్ష కోట్లకు లెక్కలే లేకుండాపోయాయి అని కాగ్ గగ్గోలు పెడుతోంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) వీటిని పరిగణనలోకి తీసుకోవడం లేదు అని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ దశలో ఈ నెల 11న ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ఏం చెప్పనుంది అన్నదే ఆసక్తికరం.
సరిగ్గా ఆదాయమే లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అనుకునే అవకాశం లేదు. ఎందుకంటే.. పన్నలు వసూళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణతో బాగానే పోటీ పడుతోంది. ఇక మద్యం ద్వారా వచ్చే అదాయం రోజు రోజుకూ రెట్టింపు అవుతోంది. తెలంగాణతో సహా ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే.. కేంద్రం నుంచి కూడా నిధులు అడపాదడపా వస్తున్నాయి. రావాల్సిన బాకాయిలు మాట ఎలా ఉన్నా.. అప్పుడప్పుడు కేంద్రం అవసరాల కోసం అని నిధులు ఇస్తూనే ఉంది. కానీ ఆ నిధులన్నీ సంక్షేమం పేరిట ఖర్చయిపోతున్నాయి. ఇక కేంద్ర ప్రాయోజిత పథకాల పేరిట కూడా నిధులు వస్తున్నాయి. అయినా అప్పులు తప్పడం లేదు.
ఇదీ చదవండి : వైసీపీకి నాగబాబు సలహా.. ఇదే ఫైనల్ అనుకోండి అన్న మెగా బ్రదర్
గడిచిన రెండున్నరేళ్లలో లక్ష కోట్ల రూపాయలకు పైగా సంక్షేమానికే నిధులు వెచ్చించాం అని ప్రభుత్వం చెబుతోంది. ఆర్థికంగా వెనుకబాటులో ఉన్న రాష్ట్రం తమదని ఏపీ ప్రభుత్వ పెద్దలు వెళ్లి కేంద్రానికి చెప్పినా ఫలితం లేదు. తీవ్ర తుఫానులు, వరదలు వచ్చినప్పుడే తక్షణ సాయం కింద ఓ వెయ్యి కోట్లు ఇవ్వమంటేనే మోదీ పరివారం చుక్కలు చూపిస్తోంది. దీంతో బడ్జెట్ లో వివిధ రంగాలకు కేటాయింపులు ఎలా..? నిధులు ఎక్కడ నుంచి సర్ధుబాటు చేయాలి.. అసలు నిధులే లేని సమయంలో ఇంకా సర్దుబాటు ఏంటి..? అని ఆర్థిక మంత్రి తల పట్టుకుంటున్నట్టు సమాచారం. ఇప్పటికే ఆయన ఆర్థిక శాఖ అధికారులపై ఒత్తిడి తెస్తున్నా.. ఉన్న ఆదాయం ఖర్చు చేస్తే.. తాము మాత్రం ఎక్కడ నుంచి లెక్కలు చూపిస్తామని తిరిగి ప్రశ్నిస్తున్నట్టు సమాచారం.. దీంతో ఈ బడ్జెట్ గండ గట్టెక్కెది ఎలా అని.. ఇటు ఆర్థిక మంత్రి.. అటు ఆర్థిక శాఖ అధికారులు తర్జనభర్జన పడుతున్నట్టు సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.