AP Budget Session 2023-24 : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జె్ట్ సమావేశాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. ఇవాళ (మంగళవారం) గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ నెల 17న ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెడుతుంది. ఈసారి బడ్జెట్ రూ.2 లక్షల 60 వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి... ప్రస్తుత వైసీపీ ప్రభుత్వానికి ఇదే చివరి పూర్తిస్థాయి బడ్జెట్. అందువల్ల ఇది ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టీ.. ఎన్నికల్లో వైసీపీకి వచ్చే మైలేజ్ కొంతవరకూ ఆధారపడి ఉంటుంది. ఈ బడ్జెట్లో సంక్షేమంతో పాటు వ్యవసాయం, విద్య, వైద్య రంగాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిసింది.
వచ్చే సంవత్సరం ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టగలదు. ఏప్రిల్ 2024న అటు లోక్సభకు, ఇటు ఏపీ అసెంబ్లీకీ సాధారణ ఎన్నికలు జరుగుతాయి. అందువల్ల ఇప్పుడు ప్రవేశపెట్టే బడ్జెట్ ప్రభుత్వానికి కీలకం కానుంది. ఈ సందర్భంగా కీలక అంశాలపై అసెంబ్లీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక ప్రకటనలు చేస్తారని తెలిసింది. నాలుగేళ్ళ పాలన, మూడు రాజధానులు, సంక్షేమం, వైజాగ్ గ్లోబల్ సమ్మిట్, నవరత్నాల అమలు, ఇతర పథకాలు, పాలన జరుగుతున్న తీరు వంటి ముఖ్యమైన అంశాలపై ప్రభుత్వ ఎజెండా ఉంటుందని సమాచారం.
ఇవాళ సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లులను కేబినెట్ ఆమోదించనుంది. ఈ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలి అనే అంశంపై విపక్షాలతో బీఏసీ సమావేశంలో ప్రభుత్వం చర్చిస్తుంది. ఈ నెల 27 వరకు సమావేశాలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. ఈ సమావేశాల్లో ప్రభుత్వాన్ని వివిధ అంశాలపై నిలదీస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారు. నాలుగేళ్లుగా పాలన పడకేసిందని అంటున్నారు. విపక్షాల తీరు చూస్తే.. బడ్జెట్ సమావేశాలు వాడి వేడిగానే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Ys jagan, Ys jagan mohan reddy