G Venkatesh, News18, Anantapuram
శ్రీ సత్యసాయి జిల్లా (Sri Satya Sai District) అభివృద్ధి ఒక అడుగు ముందుకు పడింది.జిల్లాగా గతేడాది ఏప్రిల్ 4న ఏర్పాటైంది. ఈ నేపథ్యంలో పుట్టపర్తి (Puttaparthi) నగర పంచాయతీని గ్రేడ్2 మున్సిపాలిటీగా చేస్తూ గురువారం ప్రభుత్వం జీవో విడుదల చేసింది. 2011 లెక్కల ప్రకారం 31,610 మంది జనాభా, 59.77 కిలోమీటర్ల విస్తీర్ణంలో 518 చదరపు కిలోమీటర్ల జనసాంద్రతగా పుట్టపర్తి నగర పంచాయతీగా ఏర్పాటైంది. ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం 40 వేలు మంది ఉండటం, పుట్టపర్తి నగర పంచాయతీ సంవత్సర ఆదాయం రూ.4.47 కోట్లు వస్తోంది దేశ, విదేశీ భక్తులు ప్రతి ఏటా ఆరు లక్షల మంది పుట్టపర్తికి సత్యసాయి మహాసమాధి దర్శనార్థం వస్తుంటారు.
అలాంటి పుట్టపర్తిని గ్రేడ్2 మున్సిపాలిటీగా ఏర్పాటు చేయాలని 2022 నవంబరులో కౌన్సిల్ సమావేశంలో పాలకవర్గ సభ్యులు తీర్మానం చేసి పంపారు. జిల్లా కేంద్రంగా ఏర్పడినందున అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని, మున్సిపాలిటీ ఏర్పాటు చేస్తూ.. ఏపీ మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ది శాఖ జీవో నెంబర్ 18 జీవో జారీ చేసింది.
చిత్రావతినది ఒడ్డున కొండకోనల్లోని కుగ్రామమైన గొల్లపల్లి నేడు జిల్లా కేంద్రంగా మారింది. కనీసం ఒకపుడు రహదారి, తాగునీటి సౌకర్యం లేని పుట్టపర్తి నేడు ప్రపంచ పటంలో విశిష్ఠస్థానం పొందింది. ఆధ్యాత్మికంగా ప్రారంభమై దేశ విదేశాల నుంచి రాకపోకలు జరుగుతూ, ఈ ప్రాంతానికి విశిష్టత ఏర్పడింది. సత్యసాయి బాబా బోధనలతో ఈ ప్రాంతం ఆధ్యాత్మిక శోభను సంచరించుకుంది.
మొదటగా పుట్టపర్తి పంచాయతీలోకి ఎనుములపల్లి, బ్రహ్మణపల్లి, బీడుపల్లి, బడేనాయక్తండా పంచాయతీలు విలీనం చేసి.. 2006లో మేజర్ పంచాయతీగా ఏర్పడింది. 2011లో నగర పంచాయతీగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2014లో ప్రథమంగా నగర పంచాయతీ ఎన్నికలు జరిగాయి.మున్సిపాలిటీగా ఏర్పాటు చేయటంతో అభివృద్ధికి ప్రత్యేక నిధులు వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రజలపై పన్నుల భారం పడనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anantapuram, Andhra Pradesh, Local News