ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ (APSRTC) ఆన్ లైన్ సర్వీసుల్లో కీలక మార్పులు చేయనుంది. అన్ని సేవలూ ఒకే యాప్ అందుబాటులోకి తీసుకురానుంది. దీనికి సంబంధించి అభి బస్ (Abhi Bus) తో డీల్ కుదుర్చుకుంది. యునైటెడ్ టికెటింగ్ సొల్యూషన్ కోసం టెండర్లు ఆహ్వానించిన ఏపీఎస్ ఆర్టీసీ అతి తక్కువ ధరకు కోట్ చేసి అభిబస్ కు టెండర్ ఇచ్చింది. మరో ఆరు నెలల్లో కొత్త యాప్ అందుబాటులోకి రానుంది. ఇందులో టికెట్ బుకింగ్ (RTC Online Ticket Reservation) తో పాటు బస్ సర్వీసుల ట్రాకింగ్ (Bus Service Tracking System) వంటి అన్ని సదుపాయాలు ఉండనున్నాయి. ప్రతి టికెట్ పై అభి బస్ కు 17పైసలు కమిషన్ ను ఆర్టీసీ చెల్లించనుంది. గతంలో ఒక్కో టికెట్ పై అభి బస్ కు 15పైసలు కమిషన్ దక్కేది.
కరోనా కారణంగా ఈ ఏడాది మొదట్లో అన్ని రకాల టికెట్లను ఆన్ లైన్ ద్వారానే జారీ చేయాలని నిర్ణయించిన ఆర్టీసీ.. ఆ పనులను టెండర్లు లేకుండా నామినేటెడ్ పద్ధతిలో అభిబస్ కు ఇచ్చింది. తాజాగా టెండర్లు ఆహ్వానించడంతో అభిబస్ సంస్థ 17 పైసలకు బిడ్ దాఖలు చేసింది. అందరికంటే తక్కువ ధరకు కోట్ చేయడంతో టెండర్ ఆ సంస్థకే అప్పగించారు.
రోజుకు రూ.5లక్షలు
ఏపీఎస్ ఆర్టీసీలో ప్రతి రోజూ అన్నిరకాల సర్వీసుల్లో 30లక్షల టికెట్లు బుక్ అవుతాయి. ఈ లెక్కన ఒక్కో టికెట్ కు 17పైసల చొప్పున రూ.5లక్షలకు పైగా చెల్లించనుంది. ఇలా ఐదేళ్లకు అన్ని సర్వీసులకు గానీ మొత్తం రూ.70కోట్లను ప్రభుత్వం అభిబస్ కు చెల్లించనుంది. ఇందులో రూ.30కోట్ల వరకు కేంద్రం నుంచి రానుంది. ప్రభుత్వం చెల్లించే అన్నిరకాల సర్వీసులను 17పైసల ధరకే అభిబస్ అందించనుంది.
ఆన్ లైన్ సేవలు ఇవే..
ఏపీఎస్ఆర్టీసీ ఆన్ లైన్ ద్వారా దూరప్రాంత బస్సుల ఆన్ లైన్ టికెట్ రిజర్వేషన్, పల్లెవలుగులో సాధారణ టికెట్ల బుకింగ్, బస్ మిస్ అయితే వేరే బస్సులో టికెట్ అడ్జస్ట్ చేయడం, అన్ని బస్ సర్వీసుల ట్రాకింగ్ సిస్టమ్, విద్యార్థులు, ఇతరులకు బస్ పాసుల జారీ, కార్గొపార్శిల్ సర్వీస్ బుకింగ్, కంప్లైంట్స్ స్వీకరణ వంటివి యాప్ ద్వారా ప్రాసెస్ చేయనున్నారు.
పార్శిల్ డోర్ డెలివరీ..
కరోనా కారణంగా ఏపీఎస్ ఆర్టీసీ సర్వీసులు నిలిచిపోవడంతో గత ఏడాది కాలంగా భారీ నష్టాలను చవిచూస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవలే పార్శిల్ డోర్ డెలివరీ సిస్టమ్ ను ఆర్టీసీ ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ఎవరైనా ఆర్టీసీ బస్సుల ద్వారా పార్శిల్ పంపిస్తే దానిని కోరుకున్న అడ్రస్ కు డోర్ డెలివరీ చేయనున్నారు. ఇందుకు గానూ కిలో పార్శిల్ కు రూ.15 రూపాయలు, 1-6 కిలోల మధ్య పార్శిల్ కు రూ.25, 6-10 కిలోల మధ్య బరువుండే పార్శిల్ కు రూ.30 చెల్లించాల్సి ఉంటుంది. దీనికి అదనంగా జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం పార్శిల్ ట్రాకింగ్ సిస్టమ్ ను కూడా ఆర్టీసీ అందుబాటులోకి తీసుకురానుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Apsrtc, RTC buses