ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) పనులు వడివడిగా సాగుతున్నాయి. అనుకున్న సమయానికి ప్రాజెక్టును పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. తాజాగా పోలవరం పనుల్లో ఓ అద్భుతం బయటపడింది. ప్రాజెక్టు స్పిల్ వే అప్రోచ్ ఛానల్ తవ్వకాల్లో పురాతన శివలింగం బయటపడింది. వెంటనే ప్రాజెక్ట్ సిబ్బంది పురావస్తు శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడం.. అధికారులు పరిశీలించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తవ్వకాల్లో బయటపట్ట శివలంగం ఆషామాషీది కాదని.. శతాబ్దాల చరిత్ర ఉందని పురావస్తు శాఖ తెలిపింది. శివలింగం ఇప్పటిది కాదని 12వ శతాబ్దానికి చెందినది పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్ తిమ్మరాజు తెలిపారు. పట్టిసీమ ఆలయంలోని శివలింగం.. ఇప్పుడు లభ్యమైన శివలింగం ఒకే విధంగా ఉన్నాయన్నారు.
800 ఏళ్ల క్రితం గోదావరి గట్టున ఆ మహాలింగాన్ని ప్రతిష్టించి ఉంటారని తిమ్మరాజు తెలిపారు. చాళుక్యుల పాలనలో గోదావరి నది వెంబడి శివాలయాలు నిర్మించారని.. అందులో ఓ ఆలయానికి సంబంధించిన లింగమే ఇది అయిఉంటుందన్నారు. 25 ఏళ్ల క్రితం అంటే 1996-2022 మధ్య కాలంలో పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో పురావస్తు శాఖ జరిగిన తవ్వకాల్లో రెండో శతాబ్దం నాటి ఇటుకలు, ఆలయాల ఆనవాళ్లు బయటపడ్డాయని ఆయన చెప్పారు.
పోలవరం ముంపు ప్రాంతంలో ఉన్న 375 గ్రామాల్లో దొరికిన పురాతన వస్తువులను ప్రదర్శించేందుకు మ్యూజియం ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పెట్టినట్లు తలిపారు. ప్రస్తుతం శివలింగం దొరికిన అప్రోచ్ ఛానల్ లో మరింత లోతుగా తవ్వితే పురాతన ఆలయం బయటపడే అవకాశముందని అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉంటే గతంలో తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలంలో జరిగిన తవ్వకాల్లో ఆదిమానవుని అవశేషాలు, రాజమహేంద్రవరం, ఏలూరు సమీపంలోని రుద్రం కోట వద్ద కొన్ని పూసలు లభ్యమవగా.. మరికొన్ని ప్రాంతాల్లో వందల ఏళ్లనాటి శివలింగాలు బయటపడ్డాయి. ఈ శివలింగాన్ని మ్యూజియంకు తరలిస్తారా.. లేక ప్రాజెక్టు సమీపంలోనే ఆలయం నిర్మించి పూజలు జరుపుతారా అనేది ఆసక్తికరంగా మారింది. శివుడికి ఆలయం నిర్మించి నిత్య పూజలు జరిపిస్తే ప్రాజెక్టుకు, చుట్టుపక్కలవారికి మంచి జరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు శివలింగం దొరికిన చోట ఆలయం అనవాళ్ల కోసం మరింత లోతుగా తవ్వకాలు జరుపుతారా లేక యథావిథిగా వదిలేస్తారా అనేది కూడా చర్చనీయాంశమైంది. పోలవరంను పర్యాటక ప్రాంతంగానూ అభివృద్ధి చేసే అవకాశం ఉండటంతో అక్కడే పురాతన వస్తువులు, గిరిజన సంస్కృతికి సంబంధించి మ్యూజియం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Polavaram