
- News18 Telugu
- Last Updated: April 17, 2021, 14:13 IST
ప్రస్తుతం ఉన్న కొవిడ్ ఉధృతి పరిస్థితుల్లో ప్రముఖ ఆసుపత్రుల్లో సామాన్యులకు బెడ్ దొరకడం చాలా కష్టంగా ఉంది. కానీ ఓ సెలబ్రెటీకి ఆసుపత్రిలో బెడ్ దొరకని పరిస్థితి ఉందంటే ఆశ్చర్యపడకుండా ఉండరు. అది కూడా ఓ మాజీ ముఖ్యమంత్రికి అని తెలిస్తే అవాక్కవడం ఖాయం. అవును, ఓ మాజీ ముఖ్యమంత్రి కరోనా బారిన పడ్డారు. నిన్నమొన్నటి వరకు ఆ రాష్ట్రంలో ఆయన చెప్పిందే వేదం. కానీ ఇప్పుడు ఆయనకే ఆసుపత్రిలో బెడ్ దొరకని పరిస్థితి. ప్రస్తుత ఆరోగ్య శాఖ మంత్రికి ఫోన్ చేసి బెడ్ ఇప్పించాలని కోరినప్పటికీ ఫలితం ఏమాత్రం కానరాలేదు. కర్ణాటక రాష్ట్రంలో ప్రస్తుతం కనిపిస్తున్న సీన్ ఇదీ. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన ట్విటర్ ఖాతా ద్వారా తెలియజేశారు.
’కొవిడ్ పరీక్షల్లో నాకు పాజిటివ్ అని తేలింది. గత కొద్ది రోజులుగా నన్ను కలిసిన, నాతో సన్నిహితంగా మెలిగిన వారంతా దయచేసి కొవిడ్ పరీక్షలు చేయించుకోండి. వారంతా తమంతట తాముగా ఇళ్లల్లో క్వారంటైన్ అవ్వండి‘ అంటూ కుమారస్వామి శనివారం ఉదయం 10గంటల 37 నిమిషాల సమయంలో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసిన ఆయన పార్టీ అనుచరులు కలవరపాటుకు గురయ్యారు. కొద్ది రోజులుగా కుమారస్వామి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. శనివారం బసవకల్యాణ నియోజకవర్గంలో ఉప ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. ఈ ఉప ఎన్నికల ప్రచారంలో తమ పార్టీ అభ్యర్థి కోసం కుమారస్వామి ప్రచారం నిర్వహించారు. ఈ సమయంలోనే ఆయనకు కొవిడ్ సోకి ఉంటుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. శనివారం ఓ కేసునకు సంబంధించి కోర్టులో హాజరు కావాల్సి ఉన్నప్పటికీ కొవిడ్ సోకిన కారణంగా ఆన్ లైన్ లో హాజరుకు అనుమతి తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: నాలుగు నెలల క్రితం పెళ్లి.. భార్య గర్భవతి.. ఆమె గురించి చివరిసారి వాట్సప్ స్టేటస్ పెట్టి మరీ టిక్ టాక్ టోనీ దారుణం..!
ఎన్నికల ప్రచారం నుంచి తిరిగి వచ్చిన కుమారస్వామి కాస్త అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన నేరుగా తన ఇంటికి వెళ్లకుండా ఓ ప్రైవేటు హోటల్ లో ఉంటున్నారు. కరోనా టెస్టులు చేయించుకున్నారు. పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో మణిపాల్ ఆసుపత్రిలో బెడ్ కోసం సంప్రదించారు. అయితే బెడ్స్ ఖాళీ లేవని అక్కడి అధికారుల నుంచి సమాధానం వచ్చింది. ప్రస్తుత ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్ కు ఫోన్ చేసి బెడ్ ను ఏర్పాటు చేయాల్సిందిగా కుమార స్వామి పార్టీ ప్రతినిధులు ఫోన్ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో బన్నెర్ ఘట్టా రోడ్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాలని ఆయన నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా కొద్ది రోజుల క్రితమే కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామికి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది.
ఇది కూడా చదవండి: ఓ ఇంటి ముందు టెంటు వేసి.. కుర్చీలో కూర్చుని కూలింగ్ వాటర్ తాగుతూ నిరసన.. ఇంతకీ అసలేం జరిగిందో తెలిస్తే అవాక్కవడం ఖాయం..!