PM Modi: లాక్‌డౌన్ పరిస్థితి వద్దు.. కలిసికట్టుగా కరోనాపై పోరాడాలన్న ప్రధాని మోదీ

PM Modi: కరోనా సెకండ్ వేవ్ దేశంలో ఉధృతంగా సాగుతోందని ప్రధాని మోదీ అన్నారు. కరోనా మహమ్మారిపై అందరం యుద్ధం చేస్తున్నామని తెలిపారు. ఈ సంక్షోభం నుంచి అంతా బయటపడాలని అన్నారు.

PM Modi: లాక్‌డౌన్ పరిస్థితి వద్దు.. కలిసికట్టుగా కరోనాపై పోరాడాలన్న ప్రధాని మోదీ
నరేంద్ర మోదీ (file Image - credit - twitter - ANI)

దేశంలో కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా చూసుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశంలో లాక్‌డౌన్ అవసరం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని వ్యాఖ్యానించారు. చివరి అస్త్రంగానే లాక్‌డౌన్ ఉపయోగించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. ఈసారి కరోనాతో యుద్ధంలో యువకులు ముందుకు రావాలని అన్నారు. ఎక్కడిక్కడ యువకులు కమిటీలు వేసుకుని పరిస్థితిని సమీక్షించాలని అన్నారు. యువకులు ఈ రకంగా చేస్తే లాక్‌డౌన్ అవసరం లేదని.. కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేయాల్సిన పనిలేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అయితే అవసరం లేకుండా ఎవరూ బయటకు రాకుండా చూసుకోవాలని అన్నారు.

కరోనా సెకండ్ వేవ్ దేశంలో ఉధృతంగా సాగుతోందని ప్రధాని మోదీ అన్నారు. కరోనా మహమ్మారిపై అందరం యుద్ధం చేస్తున్నామని తెలిపారు. ఈ సంక్షోభం నుంచి అంతా బయటపడాలని అన్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రజలకు సేవ చేస్తున్న వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు ఆయన సెల్యూట్ చేశారు. అందరం కలిసి ఈ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవాలని అన్నారు. ఎంత కష్టం వచ్చినా ధైర్యం కోల్పోకూడదని.. ధైర్యంతో ముందుకు సాగాలని అన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో దేశంలోని ఫార్మా కంపెనీలు ఔషధాల ఉత్పత్తిని పెంచాయని ప్రధాని మోదీ అన్నారు. ఆక్సిజన్ సరఫరా కోసం ప్రత్యేక రైలు ఏర్పాటైందని గుర్తు చేశారు.

దేశంలోని శాస్త్రవేత్తలు పగలు రాత్రి శ్రమించి ప్రజల కోసం వ్యాక్సిన్ తయారు చేశారని ప్రధాని మోదీ అన్నారు. ఈ విషయంలో దేశంలో ప్రైవేటు రంగం ఎంతో కష్టపడిందని అన్నారు. ఈ కారణంగానే దేశంలో రెండో వ్యాక్సిన్లు పెద్ద ఎత్తున తయారవుతున్నాయని గుర్తు చేశారు. వీటి కారణంగానే దేశంలో అతి పెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోందని వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు దేశంలో 12 కోట్ల మందికి వ్యాక్సిన్ అందించామని అన్నారు. త్వరలోనే 18 ఏళ్లు నిండిన వాళ్లందరికీ వ్యాక్సిన్ అందించాలని నిర్ణయం తీసుకున్నామని ప్రధాని మోదీ తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా వ్యాక్సిన్ లభిస్తుందని అన్నారు. ఇది కొనసాగుతుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. గతంతో పోలిస్తే పరిస్థితి ఇప్పుడు భిన్నంగా ఉందని అన్నారు.

Published by:Kishore Akkaladevi
First published:April 20, 2021, 21:08 pm