PM Modi on Vaccination: మీదే భారం.. అందరికీ వ్యాక్సిన్ అందాలి.. వ్యాక్సిన్ తయారీదారులతో ప్రధాని మోదీ

PM Modi on Vaccination: దేశంలో తయారయ్యే వ్యాక్సిన్‌లు తక్కువ ధరకు లభిస్తాయని చెప్పిన మోదీ.. ప్రపంచంలో అతి పెద్ద వ్యాక్సిన్ ప్రక్రియ దేశంలో కొనసాగుతుందని గుర్తు చేశారు.

PM Modi on Vaccination: మీదే భారం.. అందరికీ వ్యాక్సిన్ అందాలి.. వ్యాక్సిన్ తయారీదారులతో ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ(ఫైల్ ఫొటో)

సామర్థ్యం, వనరులు, సేవాభావం వ్యాక్సిన్ ఇండస్ట్రీ బలాలు అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఇవే ప్రపంచంలో మనల్ని వ్యాక్సిన్ లీడర్లుగా మార్చాయని అన్నారు. వ్యాక్సిన్ తయారీదారులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యాక్సిన్ తయారీదారులు సాధించిన లక్ష్యాలను, వారి చిత్తశుద్ధిని అభినందించారు. వ్యాక్సిన్ తయారీదారులపై నమ్మకం ఉందన్న ప్రధాని మోదీ.. అదే నమ్మకంతో మే 1వ తేదీ నుంచి 18 ఏళ్ల నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ప్రజలందరికీ వ్యాక్సిన్ అందేలా ఉత్పత్తిని వేగవంతం చేయాలని కోరారు. దేశంలో కొత్త కొత్త వ్యాక్సిన్ల తయారీ కోసం శ్రమిస్తున్న శాస్త్రవేత్తలను ప్రధాని మోదీ అభినందించారు. వ్యాక్సిన్‌ను రికార్డ్ సమయంలో అభివృద్ధి చేయడంతో పాటు ఉత్పత్తి చేయడంపై ప్రధాని మోదీ వ్యాక్సిన్ తయారీదారులను అభినందించారు.

దేశంలో తయారయ్యే వ్యాక్సిన్‌లు తక్కువ ధరకు లభిస్తాయని చెప్పిన మోదీ.. ప్రపంచంలో అతి పెద్ద వ్యాక్సిన్ ప్రక్రియ దేశంలో కొనసాగుతుందని గుర్తు చేశారు. మిషన్ కోవిడ్ సురక్షలో భాగంగా వ్యాక్సిన్ తయారీ, అభివృద్ధి కోసం పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంలో పని చేస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు. వ్యాక్సిన్ తయారీదారులందరికీ కావాల్సిన సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. వేగంగా, శాస్త్రీయంగా వ్యాక్సిన్ ఆమోదం ప్రక్రియను చేపడతామని అన్నారు. ప్రస్తుతం ట్రయల్స్ దశలో ఉన్న వ్యాక్సిన్ల విషయంలోనూ ఇదే సహకారం అందిస్తామని అన్నారు. ప్రైవేటు వైద్యరంగం కరోనాపై పోరాటంలో కీలక పాత్ర పోషించిందని ప్రధాని మోదీ అన్నారు.

రాబోయే రోజుల్లో వ్యాక్సినేషన్ విషయంలో ప్రైవేటు వైద్య రంగం పాత్ర మరింత ఎక్కువగా ఉండనుందని అన్నారు. ఆస్పత్రులకు, ఫార్మా రంగానికి మధ్య సమన్వయం ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే కంపెనీలు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపాయి. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించడంతో పాటు వ్యాక్సిన్ తయారీకి ప్రొత్సాహకాలు అందించడంపై హర్షం వ్యక్తం చేశాయి. ఇదే సమయంలో తమ వ్యాక్సిన్ ఉత్పత్తి పెంపు, కొత్త వేరియంట్లపై అధ్యయనం అంశంపై వ్యాక్సిన్ తయారీదారులు ప్రధాని మోదీతో చర్చించారు.

Published by:Kishore Akkaladevi
First published:April 20, 2021, 20:30 pm