
- News18 Telugu
- Last Updated: April 20, 2021, 21:28 IST
తిరుపతి ఉప ఎన్నికలో రేగిన రాజకీయ కాక చల్లారడం లేదు. తిరుపతిలో దొంగ ఓట్లు భారీగా పడ్డాయని ఇటు టీడీపీ, అటు బీజేపీ సహా విపక్షాలన్ని ఆరోపిస్తున్నాయి. అధికార వైసీపీ.. ఓటమి భయంతో భారీగా దొంగ ఓట్లు వేయించిందని ఆందోళన కూడా చేశాయి. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి పలు ఫిర్యాదులు అందాయి. ముఖ్యంగా ఇటీవల వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆడియో క్లిప్పులు కూడా బయట పడడం కలకలం రేపింది. ఇతర ప్రాంతాల నుంచి బస్సుల్లో ఓటర్లు తిరుపతికి తరలించి ఓట్లు వేయించారు అన్నది విపక్షాల ప్రధాన ఆరోపణ. ఎన్నిక రోజే దీనిపై దుమారం రేగింది. కొంతమందిని పట్టుకున్న విపక్షాలు పోలీసులకుే అప్పగించాయి కూడా. దీనిపై అదే స్థాయిలో వైసీపీ నేతలు కూడా కౌంటర్లు ఇస్తున్నారు. తాము రిగ్గింగ్ చేయాలి అనుకుంటే 80 శాతానికిపై ఓటింగ్ జరిగేదని వైసీపీ నేతలు అంటున్నారు. వారి వాదన ఎలా ఉన్నా.. విపక్షాలు మాత్రం తిరుపతి అసెంబ్లీ వరకు రీ పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై ఆధారాలతో సహా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశాయి.
అయితే ఇప్పటి వరకు ఇలా రిగ్గింగుకు పాల్పడింది వైసీపీ అంటూ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఆరోపిస్తూ వస్తోంది. చంద్రబాబు నాయుడు సహా ఆ పార్టీ నేతలు ఇదే మాట పదే పదే చెబుతూ వస్తున్నారు. ఉప ఎన్నికను రద్దు చేయాలని.. పోలింగ్ జరుగుతున్న సమయం నుండే ఆయన డిమాండ్ చేస్తూ వస్తున్నారు. దీనిపై న్యాయపరంగా పోరాటానికి కూడా చంద్రబాబు సిద్ధమయ్యారు. అయితే ఇదే సమయంలో వైసీపీ, టీడీపీలకు బీజీపీ షాక్ ఇచ్చింది.
తిరుపతి ఉప ఎన్నికలో భారీగా అక్రమాలకు తెర లేపారు అంటూ హైకోర్టులో పిల్ వేశారు బీజేపీ అభ్యర్థి రత్న ప్రభ. వెంటనే తిరుపతి ఉప ఎన్నిక ఫలితాలు నిలిపివేయాలని.. మొన్న జరిగిన ఎన్నికను రద్దు చేసి.. మళ్లీ రీ పోలింగ్ నిర్వహించాలని ఆమె కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ లో తిరుపతి వైసీపీ అభ్యర్థి, గురుమూర్తి, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి, సీఈసీ, స్థానిక ఎన్నికల అధికారులను కూడా అందులో ప్రతివాదులగా చేర్చారు ఆమె. అయితే పిటిషన్ ను విచారణకు హైకోర్టు స్వీకరించింది. దీంతో రేపు ఈ పిటిషన్ విచారణకు వస్తుందని అంతా భావిస్తున్నారు. మరి దీనిపై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి. బై పోల్ లో భారీగా రిగ్గింగు జరిగినట్టు తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని ఆమె కోర్టుకు విన్నవించారు.
ఓ వైపు వైసీపీ భారీగా అక్రమాలకు పాల్పడిందని.. దొంగ ఓట్లను దగ్గరుండి వేయించిందని.. అందుకే స్థానిక పోలీసులు సహకరించారని టీడీపీ ఆరోపిస్తూ వచ్చింది. కానీ బీజేపీ అభ్యర్థి ఇప్పుడు టీడీపీ అభ్యర్థిపైనా పిటిషన్ లో ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది.